ఇంటివద్ద ఓటు లో వైసీపీ దందాలు!

Saturday, May 18, 2024

వయస్సు మళ్ళిన వృద్ధుల కోసం ఎన్నికల సంఘం తెచ్చిన అద్భుతమైన ఏర్పాటు.. ఇంటి వద్దనే ఓటు అనేది. ఆ అద్భుతమైన వ్యవస్థలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ దందాలు సాగిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు అన్ని స్థాయుల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగానే వ్యవహరిస్తూ ఉండడం వారి విచ్చలవిడితనానికి ఇంకా తోడ్పడుతోంది. ఇంటివద్ద ఓటు వేయించే సమయంలో కీలక పార్టీలనుంచి ఎన్నికల ఏజంట్లు కూడా అధికారులతో పాటు వెళ్లడం జరుగుతుంది. అలా వెళ్లిన వైసీపీ ఏజంటు.. వైసీపీ అనుకూలంగా ఓటు వేయించేందుకు ప్రభావితం చేయడం వంటివి విచ్చలవిడిగా జరుగుతున్నాయి.. వివాదాస్పదం అవుతున్నాయి.

అనకాపల్లిలో అసలు ఎన్నికల ఏజంటుగా పద్ధతైన పత్రాలు కూడా లేని వ్యక్తి.. ఓటు వేసే వృద్ధురాలిని ప్రభావితం చేయడానికి ప్రయత్నించడం ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది. అక్కడ ఓ వృద్ధురాలితో ఓటు వేయించడానికి ఇంటికి ఎన్నికల అధికారులతో పాటు వైసీపీ నేత ఎంపీపీ శ్రీనివాసరావు, తెలుగుదేశం ఏజెంటుగా రామక్రిష్ణ కూడా వెళ్లారు. అధికారులు ఆమెకు బ్యాలెట్ పత్రం ఇచ్చిన తర్వాత.. ఆమెతో వైసీపీకి ఓటు వేయించేందుకు ప్రయత్నించారు. ఈలోగా తెలుగుదేశం ఏజంటు రామక్రిష్ణ తదితరులు దానిని అడ్డుకున్నారు.

వైసీపీ నాయకుడి వ్యవహారం రసాభాసగా మారింది. ఎంపీపీ శ్రీనివాసరావు ఏజంటు పత్రాలను గమనించగా వాటిమీద అసలు అధికార్ల సంతకాలే లేవు. దీనిపై తెలుగుదేశం నాయకులు ఆర్వోకు ఫిర్యాదు చేశారు.
ఇలాంటి ‘ఇంటివద్దనే ఓటు’ వ్యవహారంలో వైసీపీ నాయకుల దందాలు రాష్ట్రంలో ఇంకా పలుప్రాంతాల్లో నమోదు అవుతున్నాయి. నెల్లూరుజిల్లాల్లో కూడా ఇలాంటి వ్యవహారాలు వెలుగుచూశాయి. అధికారులు అందరూ అయిదేళ్లలో అయిన అలవాటు ప్రకారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కొమ్ముకాస్తున్నట్టుగా వ్యవహరిస్తున్నందవల్ల..  ఇలా జరుగుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles