తెలంగాణ బిజెపి కాంగ్రెస్ ను చూసి భయపడుతోందా!

Friday, September 20, 2024

తెలంగాణాలో కాంగ్రెస్ ఉనికి కోల్పోయిందని, ఇక కేసీఆర్ ను గద్దె దించగలిగింది తామే అంటూ గత ఏడాది  కాలంగా బిజెపి కేంద్ర, రాష్ట్ర నాయకులు చెబుతూ వస్తున్నారు. అయితే మరో ఆరు నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ ఇప్పుడు బీజేపీలో అటువంటి ధీమా కనబడటం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ను చూసి భయపడుతున్నట్లు వారి ధోరణి కనిపిస్తున్నది.

కొద్దీ రోజులుగా బిజెపి నేతలు కేసీఆర్ పైనకన్నా కాంగ్రెస్ పైన, ముఖ్యంగా టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తుండటం వారిలో నెలకొన్న ఆందోళనను స్పష్టం చేస్తుంది. ఐదు నెలల క్రితం జరిగిన మునుగోడు ఎన్నికలలో బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్  రూ. 25 కోట్లు నిధులు తీసుకున్నట్లు బీజేపీ ఎమ్యెల్యే ఈటెల రాజేందర్ ఇప్పుడు తీరుబడిగా విమర్శలు  గుప్పిస్తున్నారు.

రేవంత్, ఈటల మధ్య జరుగుతున్న వార్‌పై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి  సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఇద్దరు నేతలకు చురకలంటించడం గమనార్హం. ఒక విధంగా ఆమె అసలు లక్ష్యం కేసీఆర్ ను వదిలివేసి కాంగ్రెస్ నేతలపై పడటం ఎందుకంటూ బిజెపి నేతలనే తప్పుపట్టిన్నట్లయింది. బీఆర్‌ఎస్‌తో  పోరాడే తమ్ముళ్లు రేవంత్, ఈటల తమ దాడిని ఒకరిపై ఒకరు చేసుకోవడం సరికాదని ఆమె స్పష్టం చేశారు.

హుజురాబాద్ ఉపఎన్నికలో మాజీ మంత్రి ఈటెల రాజేంద్ర ఘనవిజయం సాధించ తర్వాత జిహెచ్ఎంసి ఎన్నికలలో  సహితం దాదాపు బిఆర్ఎస్ తో సమానంగా డివిజన్లు గెలుచుకోవడంతో ఇక తెలంగాణాలో అధికారంలోకి రాబోతున్నామనే భరోసా ఆ పార్టీ నాయకులలో వ్యక్తం అవుతూ వస్తున్నది.

ఇతర పార్టీల నుండి పెద్ద ఎత్తున నాయకులు వచ్చి చేరుతారనే అభిప్రాయంతో చేరికల కమిటీ అంటూ ఒకటి ఏర్పాటు చేశారు. అయితే రాజకీయ మనుగడ ప్రశ్నార్ధకరంగా ఉన్న నాయకులు తప్ప నియోజకవర్గాలలో పట్టున్న వారెవ్వరూ బీజేపీలో చేరడం  లేదు. ప్రస్తుతం ఉన్న బిజెపి నాయకులలో నియోజకవర్గాలలో పట్టున్నవారు చాలా అరుదుగా ఉన్నారు.

దానితో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఏమోగానీ వచ్చే ఎన్నికలలో బలమైన అభ్యర్థులను నిలబెట్టడమే అసాధ్యంగా కనిపిస్తున్నది. పరిస్థితులు ఇదే విధంగా ఉంటె కేవలం ఒక సీట్ మాత్రమే గెల్చుకున్న 2018 ఎన్నికలలో మాదిరిగా 100కు పైగా నియోజకవర్గాలలో డిపాజిట్లు కూడా గల్లంతు కాగలవని భయపడుతున్నారు. 

 మరోవంక, కాంగ్రెస్ లో ఎన్ని గ్రూపులు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో వారి బలగం చెక్కుచెదరలేదని ఆ పార్టీ నాయకులు జరుపుతున్న పాదయాత్రలు స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్ పుంజుకొంటే బిజెపి ఉనికి ప్రశ్నార్ధకరం కాగలదని ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. అందుకనే వారిలో కాంగ్రెస్ పార్టీ అసహనం బిజెపి నాయకుల మాటలలో వెల్లడి అవుతుంది.

తెలంగాణలో  కే‌‌‌‌‌‌‌‌సీఆర్ కాంగ్రెస్, రేవంత్ కాంగ్రెస్, ఇందిరా కాంగ్రెస్ అని మూడు కాంగ్రెస్  పార్టీలు ఉన్నాయని బీజేపీ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఎద్దేవా చేశారు. అయితే రాష్త్ర బీజేపీలో ఎన్ని గ్రూప్ లు ఉన్నాయో ఆయనకు తెలియదా? సీ‌‌‌‌‌‌‌‌ఎం కేసీఆర్ 25మంది కాంగ్రెస్ నాయకులను టార్గెట్ చేసుకున్నారని తెలిపారు.  

2018 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి  పోస్ట్ పెయిడ్ గా వాడుకుంటే, ఇప్పుడు ఎన్నికలకు ముందే కాంగ్రెస్ నాయకులతో పాదయాత్రలు చేయించి, అనుకున్న వారికి టికెట్లు ఇప్పించి, ఎన్నికల ఖర్చుల కోసం డబ్బులు ఇచ్చి ప్రీ పెయిడ్ గా వాడుకుంటున్నారని తీవ్రమైన ఆరోపణ చేశారు.  బీ‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్, కాంగ్రెస్ రెండూ ఒక్కటేనని స్పష్టం చేశారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles