బాప్ ఏక్ నంబర్ కా.. బేటా దస్ నంబర్..

Saturday, May 4, 2024

అంతే మరి! ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? మేయదు కదా. తండ్రి ఒక రకం దాదాగిరీ చూపిస్తూ.. రిటర్నింగ్ అధికారిని బెదిరించాడు. కొడుకు.. తాను తండ్రి కంటే గొప్పవాడిని అని నిరూపించుకోవడానికి ప్రత్యర్థి పార్టీ నాయకుల మీద విచ్చలవిడిగా రాళ్ళ దాడికి పురికొల్పాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీ, ఎమ్మెల్యే లుగా తలపడుతున్న తండ్రీ కొడుకుల కథ ఇది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఇద్దరూ తమదైన శైలిలో చెలరేగిపోతున్నారు.

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరి ఎంఎల్ఏ గా వుండగానే.. మంత్రి స్థాయిలో చక్రం తిప్పిన నేత. ఆయన మాట జగన్ వద్ద బ్రహ్మాండంగా చెలామణీ అయ్యేది. ఉమ్మడి చిత్తూరు జిల్లా, తిరుపతి లలో అధికారులు ఎవరైనా సరే ఆయన ఇష్టానుసారం నియమితులు కావాల్సిందే. ఆయన కనుసన్నల్లో నడవాల్సిందే. అలా చెలాయించిన ఆయన.. కొడుకును రంగంలోకి దించి తాను పార్టీ సేవకు పరిమితం అవుతానని అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డికి వేరే గతి లేకపోవడంతో ఒంగోలు పార్లమెంటు బరిలో నిలిపారు. అక్కడ మహిళా రిటర్నింగ్ అధికారిని.. ‘‘మీమీద మేం ప్రైవేటు కేసులు పెడితే కోర్టుకు తిరుగుతూ ఉండాల్సిందే’’ అని బెదిరించి.. ఇప్పటికే వార్తల్లో నిలిచారు.

కాగా, కొడుకు ఏకంగా తెలుగుదేశం వారిపై తన అనుచరులతో దాడులు చేయిస్తున్నాడు. గురువారం నామినేషన్ లో సందర్భంగా.. టీడీపీ, వైసీపీ వారిమధ్య గలాటా చోటు చేసుకుంది. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అనుచరులు టీడీపీ వారిపై పెద్ద ఎత్తున రాళ్ళ దాడికి దిగారు.  తండ్రి కొడుకులు ఒకరిని మించి మరొకరు దాదా చేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు.

చెవిరెడ్డి తండ్రీ కొడుకుల వ్యవహార సరళి మీద నియోజకవర్గంలో ఇప్పటికే పుంఖానుపుంఖాలుగా నేరమయ వ్యవహారాలు చెలామణీలో ఉన్నాయి. అలాంటి వాటికి తోడు.. ఇప్పుడిలా ప్రత్యర్థి పార్టీ మీద దాడులకు పురికొల్పడం కూడానా అని జనం ముక్కున వేలేసుకుంటున్నారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles