బండి సంజయ్ కు సిపి రంగనాథ్ దిమ్మతిరిగే కౌంటర్!

Monday, September 16, 2024

పదో తరగతి పేపర్‌ లీక్ కేసులోతనను మొదటి నిందితుడిగా పేర్కొనడంతో పాటు అరెస్ట్ కూడా చేసిన వరంగల్ పోలీస్ కమీషనర్ రంగనాథ్ ను బెదిరించే ధోరణిలో “వరంగల్‌ సీపీని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఆయన అవినీతి చిట్టా మొత్తం బయటకు తీస్తాం…” అంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన హెచ్చరికలకు రంగనాథ్ మంగళవారం దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు.

తాను ఒక్క సెటిల్‌మెంట్, ఒక్క దందా, ఒక్క డీల్ చేసిన‌ట్లు లేదా నాకు లాభం వ‌చ్చేలా ఏదైనా డీల్ చేసిన‌ట్లు నిరూపిస్తే.. అక్ర‌మ ఆస్తులు ఉన్న‌ట్టు నిరూపిస్తే ఉద్యోగం వ‌దిలిపెట్టి వెళ్లిపోతాను అంటూ  ఏవీ రంగ‌నాథ్ సంజ‌య్‌కు స‌వాల్ చేశారు. బహుశా ఈ మధ్య కాలంలో ఐపీఎస్ అధికారి ఎవ్వరో ఒక రాజకీయ నాయకుడి ఆరోపణలకు ఇంత తీవ్రంగా స్పందించి, కౌంటర్ ఇచ్చిన సందర్భం లేదని చెప్పవచ్చు.

 న‌ల్ల‌గొండ ఎస్పీగా ప‌ని చేసిన‌ప్పుడు ఏదో చేశాన‌ని, ఖ‌మ్మంలో ఉన్న‌ప్పుడు కూడా ఏదో చేశాన‌ని ఆరోప‌ణ‌లు చేస్తున్నారని అంటూ ఇన్నాళ్లు ఎందుకు ఈ ఆరోప‌ణ‌లు చేయ‌లేదు? అరెస్టు కాగానే ఈ ఆరోప‌ణ‌లు చేశారని చెబుతూ ఎద్దేవా చేశారు.

‘నా బాధితులు బండి సంజ‌య్‌ను క‌లిశార‌ని ఏదో పేప‌ర్లో చ‌దివాను. ఖ‌మ్మం, కొత్త‌గూడెం ప్ర‌జ‌లు న‌న్ను గుర్తు పెట్టుకున్నారు. నేను ఎవ‌రి ప‌క్షాన ఉంటాను అనేది నేను ప‌ని చేసిన చోట ప్ర‌జ‌ల‌కు తెలుసు’ అని స్పష్టం చేశారు.

`బండి సంజ‌య్ ద‌గ్గ‌రికి వ‌చ్చిన బాధితుల్లో ఎవ‌రై ఉంటారంటే.. అరెస్టు అయిన రౌడీషీట‌ర్లు, పీడీయాక్ట్ న‌మోదైన‌వారు, చీటింగ్ కేసుల్లో ముద్దాయిలు అయి ఉండొచ్చు. భూ క‌బ్జాదారులు ఉండొచ్చు’ అంటూ సంజయ్ ఆరోపణలను కొట్టిపారవేసారు. ‘సెటిల్‌మెంట్స్, దందాలు చేశాను అని బండి సంజ‌య్ అన్నారు. ఆ మాట‌లు విన్న త‌ర్వాత న‌వ్వాలో, ఏడ్వాలో కూడా తెలియ‌లేదు’ అంటూ సంజయ్ ఆరోపణలని అవహేళన చేశారు.

నా గురించి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో బీజేపీ కార్యకర్తలను అడిగితే తెలుస్తుంది. మా ఉద్యోగ ధర్మాన్ని నెరవేరుస్తున్నాం. మాకు ఏ ఒక్క రాజకీయ పార్టీపైనా కక్ష ఉండదు. బండి సంజయ్‌కు నాకు గట్టు పంచాయతీ లేదు. నాపై పరువు నష్టం దావా వేస్తే వేసుకోనివ్వండి. మా దగ్గర అన్నీ ఆధారాలు ఉన్నాయి. కేసులో ముద్దాయి అయినప్పుడు ప్రస్టేషన్‌లో ఉండడం సహజం’ అంటూ ఒక విధంగా సంజయ్ పట్ల సానుభూతి చూపించారు.

`నా వ‌ద్ద‌కు భూకబ్జాదారులు, రౌడీషీట‌ర్లు, చీట‌ర్ల బాధితులు వ‌స్తారు. వాళ్లంతా సామాన్యులు, పేద‌వ‌ర్గాల వారు ఉంటారు. వాళ్లంద‌రూ కూడా రేపు బ‌య‌ట‌కు వ‌చ్చి.. ఇది జ‌రిగింద‌ని చెప్తారు. ఇది ప్ర‌జ‌ల‌కు కూడా తెలియాలి’ అని రంగ‌నాథ్ ఈ సందర్భంగా వెల్లడించారు.

తనను ప్రమాణం చేయమని సంజయ్ పేర్కొనడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. “ప్రతి కేసులో ప్రమాణాలు చేసుకుంటూ పోతే నేను ఇప్పటి వరకూ 10 వేల సార్లు ప్రమాణం చేయాల్సి వచ్చేది. నేను ప్రమాణం చేసే డ్యూటీలోకి వచ్చాను. . నేను చేసే కేసుల్లో విశ్వ‌స‌నీయ‌త‌ను డెవ‌ల‌ప్ చేసుకుంటాం. ఉద్యోగ ప‌రంగా చేసిన ద‌ర్యాప్తు అది. కేసును కేసుగానే చూస్తాం.. ” అని స్పష్టం చేశారు.

‘నేను ఎప్పుడు కూడా రాజ‌కీయాల‌కు అతీతంగా ఉద్యోగం చేశాను. నా స‌ర్వీసులో సెటిల్‌మెంట్లు, దందాలు చేసే వారిని వ‌దిలిపెట్ట‌లేదు. నా ద‌గ్గ‌ర‌కు సామాన్యులు మాత్ర‌మే వ‌స్తారు. రాజ‌కీయ నాయ‌కులు రారు. ఎక్క‌డా చేసిన కూడా నా వ‌ద్ద‌కు సామాన్యులే వ‌చ్చి గోడును వెల్ల‌బోసుకుంటారు. వీళ్ల‌కు న్యాయం చేసేందుకు య‌త్నిస్తాం’ అని రంగ‌నాథ్ తేల్చి చెప్పారు.

సంజయ్ సత్యంబాబు కేసులో తన పాత్ర గురించి ప్రస్తావించడంపై విస్మయం వ్యక్తం చేస్తూ ‘స‌త్యంబాబు కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ కేసు గురించి బండి సంజ‌య్‌కు విష‌యం తెలియ‌న‌ట్లుంది. ఆ కేసును విచారించింది వేరే అధికారులు. సత్యంబాబు కేసు నేను హ్యాండిల్ చేయలేదు. నేను స్పెషల్ ఆఫీసర్‌గా నందిగామకు నన్ను పంపించారు. సత్యం బాబు కేసులో నేను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కాదుఅని రంగనాథ్ వివరించారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles