జగన్ పై దర్యాప్తు కోరిన చంద్రబాబుపై సోము శివతాండవం!

Monday, September 16, 2024

వైసీపీ రాజకీయ ప్రత్యర్థి అంటూనే ఆ పార్టీ ప్రయోజనాలు కాపాడటమే తన విద్యుక్తధర్మంగా వ్యవహరిస్తూ వస్తున్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కొద్దీ రోజులుగా తప్పనిసరి రాజకీయ పరిస్థితులు సీఎం జగన్ మోహన్ రెడ్డిపై అప్పుడప్పుడు విమర్శలు చేస్తూ వస్తున్నారు.

ఇటీవల పార్టీ కేంద్ర నాయకులు జెపి నడ్డా, అమిత్ షా ఏపీ పర్యటన సందర్భంగా దేశంలోనే `అత్యంత అవినీతి ప్రభుత్వం’ జగన్ నడుపుతున్నారని విమర్శలు గుప్పించడంతో జగన్ కన్నా వీర్రాజు, బీజేపీలోని ఆయన బృందం ఎక్కువగా బాధపడుతున్నట్లుంది.

జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన అమిత్ షా ఆ ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై దర్యాప్తు కూడా జరిపించాలని అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోరడంతో సోము వీర్రాజు శివతాండవం జరిపినట్లు టీడీపీ అధినేతపై విరుచుకు పడ్డారు. జగన్‍పై కేంద్రం చర్యలు తీసుకోవాలని చంద్రబాబు అనడం హాస్యాస్పదమన్నారు. స్వయంగా కేంద్ర హోంమంత్రిగా ఉన్న వ్యక్తి బహిరంగసభలో చెప్పిన మాటలపై తగు చర్యలు తీసుకోమని కోరితే ఈయనకు ఎందుకంత కోపమో అర్థం కావడం లేదు.

టిడిపి-బిజెపి పొత్తుల విషయం ఇంకా చర్చలకు రాలేదని ఒక వంక రెండు పార్టీల నేతలు చెబుతుండగా, ఎక్కడ పొత్తులు వస్తాయో అన్న భయంతో మొదట్లోనే తుంచివేయాలనే ధోరణిలో సోము మాట్లాడిన్నట్లుంది.

ఏపీలో శాంతిభద్రతలు అధ్వాన్నంగా మారాయని జెపి నడ్డా, అమిత్ షా మాట్లాడినా ఫర్వాలేదు గాని, చంద్రబాబు మాత్రం మాట్లాడరాదని ఆయన చెప్పుకొచ్చారు. సీబీఐని రాష్ట్రంలోకి రాకుండా నిషేధించిన వ్యక్తి చంద్రబాబు ఇప్పుడు శాంతిభద్రతల గురించి మాట్లాడే అర్హత లేదంటూ వితండవాదన తెరపైకి తీసుకొచ్చారు. 

నోటాతో పోటీపడే పార్టీ బీజేపీ అన్నారుగా.. ఇప్పుడు తమతో ఎలా పొత్తు పెట్టుకుంటారని ప్రశ్నించారు. బీజేపీని అవమానించేలా గతంలో మాట్లాడారని.. ఇప్పుడు తమతో పొత్తుకు ఎలా పాకులాడుతున్నారో చెప్పాలని నిలదీశారు. తమ పార్టీని అవమానించిన వ్యక్తితో పొత్తు ఆలోచన ఎలా చేస్తాం? అంటూ తనకు తానే ప్రశ్నించుకున్నారు. అంటే టిడిపితో పొరపాటున కూడా చేతులు కలపవద్దని పరోక్షంగా బీజేపీ కేంద్ర నాయకత్వాన్ని హెచ్చరిస్తున్నట్లు మాట్లాడారు.

ప్రధాన మంత్రుల్ని మార్చే శక్తి ఉన్న, కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పే  చంద్రబాబు అప్పుడు రైల్వే జోన్, ప్రత్యేక హోదా ఎందుకు తీసుకురాలేకపోయారని ప్రశ్నించారు. ఈ రెండు 2014 ఎన్నికల ప్రణాళికలో హామీలు ఇచ్చింది బిజెపి. తనను గెలిపిస్తే కేంద్రాన్ని నిలదీసి సాధిస్తానని 2019లో చెప్పింది జగన్ మోహన్ రెడ్డి. అప్పుడు అంతగా చెప్పి, ఇప్పుడు పిల్లిగా మారిపోయి మాట్లాడావే అంటూ జగన్ ను నిలదీస్తే సోము వీర్రాజు ఆగ్రహంతో చిందులు వేస్తున్నట్లు కనిపిస్తున్నది.

మరోవైపు బాపట్ల జిల్లా చీరాలలో సోము వీర్రాజుకు నిరసన సెగ తగిలిన సంగతి తెలిసిందే. ఏపీకి ప్రత్యేక హోదా మాటేంటి.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, విశాఖ రైల్వే జోన్ ఏమైందని చీరాల అభివృద్ధి సాధన సమితి ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసనకు దిగారు. పోలీసులు వారిని అడ్డుకుని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles