పోలవరం పట్ల జగన్ క్షమించరాని నేరం!

Friday, July 26, 2024

పోలవరం ప్రాజెక్టు పట్ల జగన్ క్షమించరాని నేరం చేశారని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి కార్యక్రమంలో భాగంగా నేడు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. పోలవరం వద్ద సెల్ఫీ తీసుకుని సీఎం జగన్ కు చాలెంజ్ విసిరారు.

పోలవరంపై చేసిన తప్పు ఒప్పుకుని ఇప్పటికైనా జగన్  చెంపలేసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. పోలవరం ఆపేందుకు గతంలోనూ జగన్ ఎన్నో ప్రయత్నాలు చేశారని చంద్రబాబు ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రం ఆమోదించకుండా ఢిల్లీలో జగన్ లాబీయింగ్ చేశారని వెల్లడించారు. అవాస్తవాలతో పోలవరంపై పుస్తకాలు ప్రచురించారని మండిపడ్డారు.

జగన్ మూర్ఖత్వం వల్లే డయాఫ్రం వాల్ దెబ్బతిన్నదని పేర్కొంటూ ఐఐటీహెచ్ నివేదిక మేరకు, వైసీపీ ప్రభుత్వ తీరు వల్లే డయాఫ్రం వాల్ దెబ్బతిన్నట్టు స్పష్టమైందని స్పష్టం చేశారు. 2020లో వచ్చిన 22 లక్షల క్యూసెక్కుల నీటి వల్ల డయాఫ్రం వాల్ దెబ్బతిన్నదని పేర్కొన్నారు. కాఫర్ డ్యామ్ గ్యాప్ లు పూర్తిచేయనందువల్లే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ వద్దకు నీరు వెళ్లిందని తెలిపారు. 

జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటిన్నర సంవత్సరం పాటు ప్రధాన డ్యామ్ దగ్గర పనులు చేయలేదని చంద్రబాబు విమర్శించారు. అసలు, డయాఫ్రం వాల్ దెబ్బతిన్న రెండేళ్లకు గానీ ప్రభుత్వం తెలుసుకోలేకపోయిందని విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే పోలవరం గైడ్ బండ్ కుంగిపోయిందని స్పష్టం చేశారు.

నిర్వాశితులకు రూ.19 లక్షలు ఇస్తానన్న జగన్ ఒక్కరికీ ఇవ్వలేదని మండిపడ్డారు. పైగా, నిర్వాసితుల లబ్దిదారుల జాబితా మార్చి అక్రమాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. జగన్ అధికారం చేపట్టాక కమీషన్ల కోసం కాంట్రాక్టరును కూడా మార్చారని ఆరోపించారు. కాంట్రాక్టరును మార్చడం కోసం జగన్ బంధువుతో విచారణ చేయించారని చంద్రబాబు వివరించారు. 

టీడీపీ హయాంలో ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి అవినీతి లేదని కేంద్రం చెప్పిందని మాజీ ముఖ్యమంత్రి గుర్తు చేశారు. “ఈ వర్షాకాలం పూర్తయితే జగన్ పని కూడా అయినపోయినట్టే. రాష్ట్రానికి జీవనరేఖ వంటి ప్రాజెక్టును విషాదభరితం చేశారు. పోలవరం పట్ల పేకాటలో జోకర్ తరహాలో వైసీపీ పాలకుల వైఖరి ఉంది” అంటూ చదన్రాబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదివరలో తనను పోలవరంకు వెళ్లకుండా అడ్డగించిన పోలీసులు ఈ సారి పుంగనూరులో ప్రజా తిరుగుబాటు చూసే తనను పోలవరానికి అనుమతించారని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజల తిరుగుబాటుకు ప్రభుత్వం దిగిరాక తప్పలేదని ఎద్దేవా చేశారు. కాగా, దేశంలో పట్టిసీమ లాంటి పెద్ద ప్రాజెక్టు లేదని, ఇక మీదట ఏపీలో వస్తుందన్న నమ్మకం లేదని పేర్కొంటూ అటువంటి కీలకమైన ప్రాజెక్టు‌ని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ సందర్శన సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు.  చేతకాని వైసీపీ ప్రభుత్వం వల్ల పట్టిసీమకు ఎంతో నష్టం వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles