అవినాష్ ముందస్తు బెయిల్ పై ఎటూ తేల్చని హైకోర్టు!

Saturday, July 27, 2024

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో దూకుడుగా వ్యవహరిస్తున్న సిబిఐ అరెస్ట్ నుండి తప్పించుకునేందుకు ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి చుక్కెదురవుతున్నది.

గత 3 రోజులుగా కొనసాగుతున్న  సుదీర్ఘ విచారణ అనంతరం శుక్రవారం బెయిల్ ఇచ్చే విషయమై తీర్పు ఇవ్వగలదని ఎదురుచూసిన ఎంపీకి ఈ రోజు తీర్పు ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేయడంతో నిరాశ ఎదురైంది. హైకోర్టు, సీజే బెంచ్‌లో ముందస్తు బెయిల్‌పై అవినాష్ రెడ్డికి ఊరట లభించకపోవడంతో సిబిఐ మరింత దూకుడుగా వచ్చే రెండు మూడు రోజులలో వ్యవహరించే అవకాశం  ఉన్నట్లు భావిస్తున్నారు.

పైగా,  హైకోర్టుకు శనివారం నుండి జూన్ 2 వరకు  వేసవి సెలవలు కావడంతో తర్వాతే తీర్పు ఇస్తామని ధర్మాసనం తెలిపింది. దీంతో జూన్ 5కు  విచారణ వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది.  అయితే ఈ కేసులో అర్జెన్సీ ఉందని ఇరుపక్షాల లాయర్లు కోర్టును కోరారు.

ఈ రోజు వాదనలు విన్నప్పటికీ ఈ రోజు తీర్పు ఇవ్వలేనని న్యాయమూర్తి తెలిపారు. బెయిల్ పిటిషన్‌పై తీర్పు అన్ని రోజులు రిజర్వ్‌లో పెట్టడం బాగుండదని చెబుతూ అత్యవసరమైతే చీఫ్ కోర్టును అభ్యర్థించాలని హైకోర్టు సూచించింది. సీబీఐ తనపని తాను చేసుకు పోవచ్చునని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకునేది ఉండదని స్పష్టం చేశారు.

ఈ మేరకు సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయని పేర్కొంటూ సీబీఐ విచారణ చేసుకోవచ్చునని చెప్పారు. అంటే, అవసరమనుకొంటే సీబీఐ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసుకోవచ్చనే సంకేతం ఇచ్చారు.  అంతేకాదు  కేసును వెకేషన్‌ బెంచ్‌కు మార్చుకోవచ్చని హైకోర్టు ఇరు పక్షాలకు సూచించింది.

అత్యవసరమైతే ఇరుపక్షాలు హైకోర్టు ఛీఫ్ జస్టిస్ బెంచ్ ను సంప్రదించాలని న్యాయమూర్తి జస్టిస్ సురేంద్ర సూచించారు. దీంతో ఇరుపక్షాలు ప్రత్యామ్నాయాలపై దృష్టిసారించాయి. ఛీఫ్ జస్టిస్ బెంచ్ ను సంప్రదించేందుకు ఇరుపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడి కూడా విచారణ జరగకపోతే వేసవి సెలవులు పూర్తయ్యే వరకూ ముందస్తు బెయిల్ లభించే అవకాశం లేదు.

 ఆ లోపు సీబీఐ అవినాష్ ను అరెస్టు చేస్తుందా లేదా అన్నది తేలాల్సి ఉంది. ఇప్పటికే సీబీఐ ఈ కేసులో అవినాష్ ను అరెస్టు చేసి తీరాల్సిందేనని హైకోర్టుకు పలుమార్లు తెలిపింది. గురువారం విచారణలోనూ సీబీఐ న్యాయవాదిగా ఉన్న పీపీ నాగేంద్ర  అవినాష్ ను అరెస్టు చేయకుండా కస్టోడియల్ విచారణ చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పేశారు.

 దీంతో హైకోర్టులో అవినాష్‌కు గట్టి షాక్ తగిలినట్లయ్యింది.  ప్రతి గురువారం అత్యవసర కేసుల విచారణను మే 4, 11, 18, 25, జూన్ 1 ప్రత్యేక కోర్టు జరుపుతుందని సీజే తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో అవినాష్ రెడ్డి  ముందస్తు బెయిల్ పిటీషన్ తీర్పుపై ఇంకా ఉత్కంఠ వీడకపోగా, సర్వత్రా ఆసక్తి నెలకొంది.

  ముందస్తు బెయిల్ పిటీషన్ ఇవ్వాలని దాఖలు చేసిన అవినాష్ రెడ్డి ( పిటీషన్ పై గురువారం కూడా తెలంగాణ హైకోర్టులో వాడీవేడిగా వాదనలు జరిగాయి. సీబీఐ ఆధారంగా చెబుతున్న గూగుల్  టెకౌట్ ఫోన్ లొకేషన్ ను వెల్లడిస్తుంది కానీ..వ్యక్తి లొకేషన్ కాదని అవినాష్ తరపు లాయర్ వాదించారు. 

అలాగే అప్రూవర్ గా మారిన దస్తగిరి బెయిల్ పిటీషన్ ను సీబీఐ వ్యతిరేకించకపోవడం, తాము కోరుకున్న విధంగా దస్తగిరి చెప్పేలా సీబీఐ ఒత్తిడి తీసుకొచ్చిందని ఆరోపించారు. సునీత తరపున సిద్దార్ధ లూత్రా, సీబీఐ తరపున నాగేంద్ర కూడా వాదనలు వినిపించగా అప్పుడే కోర్టు సమయం ముగిసింది. దీనితో విచారణను శుక్రవారంకు వాయిదా వేయగా, ఇవాళ తీర్పు ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేయడంతో అవినాష్ రెడ్డికి చుక్కెదురైనట్లయింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles