జగన్ దుర్బుద్ధి, పలాయనవాదానికి పరాకాష్ట!

Tuesday, October 8, 2024

 మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు పదవిలో ఉన్నప్పుడు ఒక్క ప్రెస్ మీట్ కూడా నిర్వహించలేదు.  పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఇప్పటికీ 12 సార్లు బెంగుళూరు ప్యాలెస్ లో ఏకాంతంగా గడపడానికి  తరచూ వెళ్ళిపోతున్న జగన్మోహన్ రెడ్డి..  మధ్య గ్యాప్ లో తాడేపల్లి లో ప్రెస్ మీట్లు  నిర్వహిస్తున్న్నారు. అంతకంటే ఎక్కువ ఖాళీ దొరికితే రాష్ట్రంలో ఎక్కడ శవంలేసినా సరే అక్కడికి పర్యటించి, చంద్రబాబు మీద కొన్ని నిందలు వేయడానికి ఆ సందర్భాన్ని వాడుకుంటున్నారు.  తాజాగా పుంగనూరులో బాలిక  అస్పియా హత్య వ్యవహారం జగన్ వ్యవహార సరళిలో ఉండే దుర్బుద్ధిని బయటపెట్టింది.

అస్పియా హత్యకు గురైతే తాను వెళ్లి పరామర్శించాలని అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన నియోజకవర్గం. తల్లిదండ్రుల పరామర్శ పేరిట అక్కడ ఒక డ్రామా నడిపిస్తే.. ఈ రాష్ట్రంలో అమ్మాయిలకు, మహిళలకు రక్షణ లేదంటూ చంద్రబాబునాయుడు మీద బురద చల్లడానికి వీలవుతుందని ఆయన అనుకున్నారు. కానీ.. బెంగుళూరు విహారయాత్ర నుంచి బాలిక కుటుంబాన్ని పరామర్శించడానికి వ్యవధి దొరకబుచ్చుకునేలోగానే.. ప్రజలు తప్ప మరొక ఎజెండాలేని ప్రభుత్వంలోని మంత్రులు ముగ్గురు వెళ్లి ఆమె కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. ఈలోగా కేసు దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు.. నిందితులను కూడా పట్టుకున్నారు. బాలిక తండ్రి చేసే ఫైనాన్స్ వ్యాపారంలోని విభేదాల కారణంగా ఒక కుటుంబం బాలికను తీసుకువెళ్లి మట్టుపెట్టినట్టు గుర్తించారు. తాను పరామర్శకు వెళితే.. ప్రభుత్వం మీద బురద చల్లవచ్చునని జగన్ ఆశపడ్డారు. కానీ ఆయనకు తీరిక లేదు. రాచకార్యం నిమిత్తం బెంగుళూరు హలహంక ప్యాలెస్ కు అర్జంటుగా వెళ్లిపోయారు. నాలుగురోజులు అక్కడ గడిపాక.. తీరిగ్గా తిరుగుప్రయాణంలో పుంగనూరు వచ్చి పరామర్శిద్దాం అనుకున్నారు. బిడ్డ చచ్చిపోయిన కుటుంబం తాను వచ్చేదాకా ఆగకపోతుందా అనుకున్నారు. అప్పటిదాకా పోలీసులు, ప్రభుత్వం ఏం పనిచేయదులే అని కూడా ఆశించారు. 

కానీ పోలీసులు నిందితుల్ని పట్టేసుకోవడం ఆయనకు షాక్. మంత్రులు కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించడం జీర్ణం కాలేదు. చంద్రబాబు మీద బురద చల్లడానికి అవకాశం లేకపోయిన తర్వాత.. ఇక తాను పుంగనూరు వెళ్లి ఏం ప్రయోజనం అనుకున్నారు. అందుకే గూరు క్యాన్సిల్ చేసుకున్నారు. ఆ కుటుంబం కన్నీళ్లు తుడవడానికి కాకుండా తన రాజకీయం కోసమే వెళ్లాలనుకున్న జగన్ సంకుచిత బుద్ధి ఈ నిర్ణయంతో బయటపడిందని ప్రజలు అనుకుంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles