కేసీఆర్ అనాలోచితంగా ఎయిర్ పోర్ట్ కు మెట్రో లైన్!

Tuesday, July 2, 2024

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మెట్రో రెండోదశ నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ శకుస్థాపన చేశారు. నాగోల్‌-రాయదుర్గం కారిడార్‌-3కు కొనసాగింపుగా రాయదుర్గం నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం వరకు నిర్మించే ఎయిర్‌పోర్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ మెట్రోకు గచ్చిబౌలి సమీపంలోని ఐకియా ఎదుట ఉన్న మైండ్‌స్పేస్‌ వద్ద పునాదిరాయి వేశారు. రూ.6,250 కోట్లతో 31 కిమీ మేర రాయదుర్గం-శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ పనులను చేపట్టారు. 

అయితే, అనాలోచితంగా ఈ మార్గం వేస్తున్నారా అనే అభిప్రాయం కలుగుతుంది. ప్రపంచంలో ఎక్కడైనా ఎయిర్ పోర్ట్ కు మెట్రో లైన్ ఏదో ఒక రైల్వే స్టేషన్ కు అనుసంధానమై ఉంటుంది. కేవలం హైదరాబాద్ నగర ప్రజలే కాకుండా, తెలంగాణలోని అన్ని ప్రాంతాల నుండి వచ్చి, ఎయిర్ పోర్ట్ కు వెళ్లేందుకు సౌలభ్యంగా ఉండాలి. హైదరాబాద్ నగర ప్రజలు సహితం నేరుగా ఎయిర్ పోర్ట్ కు వెళ్లేందుకు ఈ లైన్ సదుపాయంగా ఉండదు.

 సికింద్రాబాద్, నాంపల్లి,  కాచిగూడ రైల్వే స్టేషన్ల నుండి వేయవలసింది. అంటే ఎయిర్ పోర్ట్ కు వెళ్లే ప్రయాణికులకు ఉద్దేశించి కాదని స్పష్టం అవుతుంది. పైగా,  మెట్రోను ఎయిర్పోర్ట్ వరకు విస్తరించాలనే డిమాండ్  చాలా కాలం నుంచే ఉన్నది. ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టిన రాయదుర్గం–ఎయిర్పోర్ట్ రూట్ 31 కిలోమీటర్లు ఉన్నది. 

మరో రెండు రూట్లలోనూ ఎయిర్పోర్ట్కు మెట్రో విస్తరించే ప్లాన్లు గతంలోనే సిద్ధం చేశారు. అందులో ఫలక్నుమా నుంచి ఎయిర్ పోర్ట్ అనే ప్రతిపాదనకు సర్వే పూర్తి చేశారు. ఫలక్నుమా నుంచి ఎయిర్ పోర్ట్ వరకు దూరం 16.6 కిలోమీటర్లు వస్తుంది. అంటే.. 14.4 కిలోమీటర్ల దూరం  తగ్గుతుంది. 

జేబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు చేపట్టాల్సిన 15 కి.మీ.పనుల్లో ఎంజీబీఎస్‌ వరకు పూర్తయ్యాయి. ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు 5.5 కిలోమీటర్ల పనులు పెండింగ్లో ఉన్నాయి. దీనికి గతేడాది, ఈసారి కలిపి బడ్జెట్లో రూ.1,300 కోట్లు కేటాయించినా రూపాయీ విడుదల  చేయలేదు.  ఇది పూర్తి చేసి.. ఫలక్నుమా నుంచి ఎయిర్పోర్ట్కు మెట్రో చేపడితే ఖర్చు తగ్గే అవకాశం ఉంటుంది. 

ఎల్బీ నగర్ నుంచి ఎయిర్పోర్ట్కు ప్రాజెక్ట్ చేపడితే ఆ దూరం  23  కిలో మీటర్ల ఉంటుంది. రాయదుర్గంతో చూస్తే ఇది 8 కిలో మీటర్లు తక్కువ. నిర్మాణ ఖర్చు కూడా తక్కువే. పైగా రాయదుర్గం నుంచి నేరుగా ఎయిర్పోర్ట్ వరకు ఏడాదికి లక్ష మంది వరకే ప్రయాణిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన నెలకు దాదాపు 8,500  మంది, అంటే రోజుకు దాదాపు 300 మంది మాత్రమే కొత్త రూట్లో ప్రయాణిస్తారు.

కొత్త రూట్ పొడవునా టీఆర్ఎస్ నేతలు,  సన్నిహితుల భూములు ఉండడంతో కేవలం రియల్ దందాల కోసమే ఎంచుకున్నట్లు స్పష్టం అవుతుంది. పైగా మొన్నటి వరకు ఉన్న 111 జీవోలోని ఆంక్షలను ఎత్తేయడంతో, అక్కడ భూములకు గిరాకీ పెరిగింది. ఇప్పుడు మెట్రో వల్ల ఆ ఏరియాలో భూముల ధరలు పదింతలు కానున్నాయి. 

భూముల  ధరలను అమాంతం పెంచుకుని రియల్ బూమ్తో సొమ్ము చేసుకోవాలనే ప్లాన్లో భాగంగానే కొత్త మెట్రో రూట్ ఆగమేఘాల మీద పట్టాలు ఎక్కుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రం ఏర్పడ్డాక ఈ ప్రాంతాల్లోని ఎక్కువ మొత్తంలో భూములు కొనుగోలు చేసింది కూడా అధికార పార్టీలోని వాళ్లేననే ఆరోపణలు ఉండటం గమనార్హం. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles