ఐపాక్ కు ప్యాకప్ చెప్పనున్న జగన్ !!

Monday, September 16, 2024

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలలో వ్యూకర్తలుగా వ్యవహరించిన ఐప్యాక్ బృందానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుడ్ బై చెప్పనున్నారా? పోలింగ్ అనంతర పరిణామాలలో రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓటమి తథ్యం అని తేలుతున్న తరుణంలో.. ఐప్యాక్ బృందం ఇన్నాళ్లపాటు అందించిన సేవలకు ధన్యవాదాలు చెప్పి ఇక్కడితో వారి బంధాన్ని వదిలించుకోనున్నారా? అనే అనుమానాలు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలలో రేకెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన నిర్ణయాల విషయంలో సాధారణంగా పార్టీ సీనియర్లను సంప్రదించి సమిష్టి ఆలోచనలకు రావడం ఉండదు. తన ఆలోచనను ఒకరిద్దరితో పంచుకోవడం ఆమేరకు దూసుకెళ్లిపోవడం మాత్రమే జరుగుతుంది. ఇప్పుడు ఐప్యాక్ తో బంధాన్ని తెంచుకోవడం గురించి కూడా పార్టీలో ఎవరికీ క్లారిటీ లేదు. జగన్ స్వయంగా ఆ నిర్ణయానికి వచ్చి అమలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ముఖ్యమంత్రి జగన్ గురువారం నాడు విజయవాడ బెంజ్ సర్కిల్ లోని ఐ ప్యాక్ కార్యాలయాన్ని సందర్శిస్తున్నారు. ఈ సందర్భంగా 30 నిమిషాల పాటు అక్కడి ఆ సంస్థ ప్రతినిధులతో చర్చలు సాగిస్తారు. పోలింగ్ అనంతరం ఏ ఏ పార్టీలు విజయ అవకాశాలు ఎలా ఉన్నాయనేది వారితో మాట్లాడి తెలుసుకుంటారు. ఈ సందర్భంగా తన పార్టీ కోసం పనిచేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేయడంతో పాటు.. సంస్థలోని కీలక ప్రతినిధులకు కొన్ని బహుమతులను కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందించనున్నట్లుగా తెలుస్తోంది.

నిజానికి ఐప్యాక్ తో రాష్ట్రవ్యాప్తంగా పని చేయించుకోవడానికి వారి ద్వారా ఎన్నికల వ్యూహాలను సిద్ధం చేయించుకోవడానికి కొన్ని వందల కోట్ల రూపాయల డీల్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుకున్నారు. ఆ మేరకు వారి ప్రతినిధులు గత ఎన్నికల కంటే ముందు నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ కోసం పనిచేస్తూనే వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గం ఎమ్మెల్యేల మాటకు విలువ ఇవ్వడం కంటే ఐ ప్యాక్ ప్రతినిధులు అందించే నివేదికలకే ప్రాధాన్యం ఇస్తూ జగన్మోహన్ రెడ్డి చెలరేగి ప్రవర్తించారనే అభిప్రాయాలు పార్టీలోనే ఉన్నాయి. గడపగడపకు మీ ప్రభుత్వం వంటి కార్యక్రమాలు నిర్వహించినప్పుడు ఎమ్మెల్యేలు పడుతున్న కష్టం, చేసే పని కంటే ముఖ్యంగా ఐప్యాక్ ప్రతినిధులు ఇచ్చిన నివేదికల ఆధారంగానే వారి పనితీరును బేరీజు వేశారు అనే అభిప్రాయం కూడా వారిలో ఉంది. పార్టీ కేడర్ నాయకులు ఇచ్చే వ్యూహాలకు చెప్పే మాటలకు విలువ ఇవ్వకుండా, పూర్తిగా ఈ సంస్థ మీద ఆధారపడడమే పార్టీకి చేటు తెచ్చిందని కూడా అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి జగన్మోహన్ రెడ్డికి కూడా ఈ సంస్థ సేవలు అందుకోవడం వృథా అని అర్థమైందని.. అందుకే ఒకేసారి వారికి గుడ్ బై చెప్పడానికి సంస్థ కార్యాలయానికి వెళ్లి బహుమతులు కూడా ఇవ్వబోతున్నారని పార్టీలో వినిపిస్తోంది.

నిజానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన యూరోప్ యాత్రకు ముందుగా.. అంటే ఇవాళ గురువారం నాడు రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల నుంచి పార్టీ సీనియర్లను లేదా ఎమ్మెల్యే అభ్యర్థులను పిలిపించి ఒక సమావేశం ఏర్పాటు చేసి పడిన కష్టానికి అభినందించి ఉంటే బాగుండేదని.. పార్టీ వారి కంటే మిన్నగా ఐప్యాక్ ప్రతినిధులను చూడడం మనస్థాపం కలిగిస్తోంది అని పార్టీలోని సీనియర్లు కొందరు చెబుతున్నారు. ఇప్పటికైనా ఐప్యాక్ ను వదిలించుకోవడం భవిష్యత్తులో పార్టీకి మేలు చేస్తుందనే అభిప్రాయం కూడా పలువురిలో వ్యక్తం అవుతోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles