ఢిల్లీ నుంచి హిమాలయాలు దగ్గరే జగన్ గారూ!

Andhrawatch
2 Min Read

కొన్ని రోజుల కిందట ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి రాజకీయ వైరాగ్యాన్ని ప్రదర్శించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ వెళ్లి అక్కడ ధర్నా చేస్తానని అంటున్నారు. ఇంతకూ ఆయన ఏం చేయదలచుకున్నారు.. ఢిల్లీ వెళ్లి ధర్నా చేసి తిరిగి వచ్చినా సరే రాష్ట్రంలో పరిస్థితి మొత్తం మారిపోతుందని అనుకుంటున్నారా? నిజంగా ఆయనకు రాష్ట్రంలో శాంతి భద్రతలు, సుహృద్భావ వాతావరణం ఉండాలనే కోరిక బలంగా ఉన్నట్లయితే ఆయన ఢిల్లీ నుంచి అక్కడికి దగ్గరగా ఉండే హిమాలయాలకు వెళ్లిపోవడం బెటర్ అని ప్రజల సలహా ఇస్తున్నారు.

ఒకసారి విరక్తితో హిమాలయాలకు వెళ్ళిపోవాలనుకున్న వ్యక్తి మళ్ళీ ఆ ఆలోచన మార్చుకొని క్రియాశీల రాజకీయాలలోకి వచ్చినంత మాత్రాన చిత్తశుద్ధితో పని చేయలేరు అనేది ప్రజల వాదనగా ఉంది. ఈ ఐదేళ్లపాటు తెలుగుదేశాన్ని తిట్టడం కోసం సమయాన్ని వెచ్చిస్తారే తప్ప, తెలుగుదేశం మీద విరక్తితో ప్రజలు మళ్ళీ తనను ముఖ్యమంత్రిని చేస్తారని ఆశపడతారే తప్ప వాస్తవంగా ప్రజల పక్షాన ఉంటూ తన బాధ్యత నిర్వర్తిస్తారనే నమ్మకం ఎవరికీ లేదు. ఆయనను పులివెందుల ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించారు. రాష్ట్ర ప్రజలందరూ కలిసి కేవలం ఎమ్మెల్యేగా మాత్రమే ఉండమని శాసించారు.

ఇలాంటి నేపథ్యంలో కేవలం 11 మంది ఎమ్మెల్యేల చిన్న గుంపును వెంటపెట్టుకొని అసెంబ్లీకి వెళ్లడం అనేది అవమానంగా భావిస్తున్న జగన్మోహన్ రెడ్డి, సభకు హాజరవుతారనే గ్యారెంటీ కూడా లేదు. కాబట్టి ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేకపోయినంత మాత్రాన వచ్చే నష్టం లేదు. చక్కగా తాను ముందుగా నిర్ణయించుకున్నట్టుగా ఢిల్లీలో ధర్నా నిర్వహించిన తర్వాత అక్కడికి చాలా దగ్గరగా ఉండే హిమాలయాలకు వెళితే మంచిదని ప్రజలు అంటున్నారు.

రాష్ట్రంలో ప్రజలను తప్పుదారి పట్టిస్తూ పార్టీ కార్యకర్తలను హింసాత్మక, విధ్వంసాత్మక మాటలతో రెచ్చగొడుతూ శాంతిభద్రతలకు గండి కొట్టడానికి తద్వారా తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాలు ఈడేర్చుకోవడానికి కుట్రలు చేస్తూ ఉండే వ్యక్తి రాష్ట్రంలో ఉండడం కంటే హిమాలయాలలో ఉండడమే మంచిదనే విమర్శలు ప్రజల్లో వినిపిస్తున్నాయి. ఢిల్లీలో ధర్నా అనే అసంబద్ధమైన మాట ప్రకటించిన తర్వాత అటువంటి హిమాలయాలకు ప్రయాణం మేలు  అంటూ జనం జగన్మోహన్ రెడ్డిని ట్రోల్ చేస్తున్నారు!

- Advertisement -
Share This Article