తెలుగు ప్రజలు పెట్టుకున్న కోటి ఆశలకు ప్రతిరూపం నారా చంద్రబాబు నాయుడు! నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్న ఈ శుభవేళ తెలుగు జాతికి ఒక పండుగ దినం. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి దిశగా నడిపించడంలో చంద్రబాబు నాయుడు ని మించిన నాయకుడు మరొకరు లేనేలేరని నమ్మి తెలుగు ప్రజలు సంపూర్ణమైన విశ్వాసంతో కట్టబెట్టిన అధికారం ఇప్పుడు ఆయన చేపట్టబోతున్నారు. మేము పాలకులం కాదు.. ప్రజల సేవకులం మాత్రమే.. ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మాత్రమే.. ప్రజలు మాకు ఈ అవకాశం ఇచ్చారు- అని సవినయంగా మనవి చేసుకుంటూ చంద్రబాబు నాయుడు పదవీ ప్రమాణం చేయబోతున్నారు.
తెలుగు రాష్ట్రం చంద్రబాబు మీద కోటి ఆశలను పెట్టుకుంది. ప్రధానంగా రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం, విశాఖ రైల్వేజోన్ ఇవన్నీ కేవలం చంద్రబాబు ద్వారా మాత్రమే సాధ్యం అవుతాయని రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారు.
జగన్మోహన్ రెడ్డి కంటే మెరుగుగా సంక్షేమ పథకాలను మరింత పెంచి ప్రజలకు ఇళ్ల వద్దనే అందిస్తానని చంద్రబాబు చెప్పిన మాటలను ప్రజలు ఏ విధంగా అయితే నమ్మారో.. అదే విధంగా, జగన్మోహన్ రెడ్డికి చేతకాని రాష్ట్ర అభివృద్ధిని చంద్రబాబు నాయుడు సాకారం చేయగలరని ప్రజలు విశ్వసిస్తున్నారు. ఉద్యోగాల కల్పన, రాష్ట్రానికి ఆదాయ వనరులు పెరిగేలాగా పరిశ్రమలను తీసుకురావడం, సమగ్రవికాసం, సంపద సృష్టి ఇవన్నీ కేవలం చంద్రబాబు ద్వారా మాత్రమే సాధ్యమవుతాయి అనేది ప్రజలకు విశ్వాసం. ఈ నమ్మకాన్ని కొత్త ప్రభుత్వం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మంత్రివర్గ కూర్పులోనే చంద్రబాబు నాయుడు తన ముద్రను చూపించారు. రాష్ట్రం కోసం కష్టించి పని చేయగల వారిని తన సహచరులుగా తీసుకున్నారు. ప్రజల నమ్మకాలను పూర్తి చేయడం తమ బాధ్యతగా ప్రభుత్వం ప్రతిన పూనుతోంది. రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయని ప్రజలు సంతోషిస్తున్నారు.
ప్రజల కోటి ఆశలకు ప్రతిరూపం చంద్రబాబు!
Thursday, July 4, 2024