రివర్స్’ పాపాలను సరిచేయిస్తున్న చంద్రబాబు!

Saturday, October 5, 2024

వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు.. రకరకాల కొత్త ఆలోచనలు చేశారు. జగన్ కొత్త ఆలోచన అనగానే.. ఎవరికైనా సరే.. ఆయన తీసుకువచ్చిన సరికొత్త లిక్కర్ విధానం, వినూత్న ఇసుక విధానం గుర్తకు వస్తాయి. ఆ ముసుగులో అధికార పార్టీ పెద్దలు దోచుకున్న వేలాది కోట్ల రూపాయలు గుర్తుకువస్తాయి. నిజానికి జగన్ బుర్రలో దోచుకోవడం గురించి మాత్రమే కాదు.. చంద్రబాబునాయుడును విలన్ గా ప్రొజెక్టు చేయడానికి చేసిన సరికొత్త ఆలోచనలు కూడా అప్పట్లో అనేకం పుట్టాయి. అలాంటివాటిలో రివర్స్ టెండరింగ్ కూడా ఒకటి. 

చంద్రబాబునాయుడు టెండర్ల రూపంలో తన మనుషులు అయిన కాంట్రాక్టర్లకు దోచిపెట్టేస్తున్నారని, ఆయన ఇచ్చిన కాంట్రాక్టులను రద్దుచేసి.. అవే పనులను మళ్లీ కేటాయిస్తానని, బాబు ఇచ్చిన ధరలకంటె తక్కువ ధరలకు కేటాయిస్తానని అంటూ రివర్స్ టెండరింగ్ విధానం తీసుకువచ్చారు జగన్. నిజం చెప్పాలంటే రివర్స్ టెండరింగ్ అనేదే పెద్దమాయ. దాదాపు యాభైవేల కోట్లరూపాయల విలువైన పోలవరం ప్రాజెక్టు పనుల్లో రివర్స్ టెండరింగ్ పేరుతో కొంత సొమ్ము మిగలబెడుతున్నట్టుగా అప్పట్లో టముకు వేసుకున్నారు. నిజానికి.. జగన్ బ్రాండ్ కొత్త కాంట్రాక్టర్లు చేసిన అలసత్వం వల్ల.. వేల కోట్ల రూపాయల అదనపు భారం పోలవరంపై పడింది. 

రివర్స్ టెండరింగ్ పేరుతో అలాంటి విచిత్రమైన దోపిడీ విధానాన్ని జగన్ సర్కారు తిరుమల తిరుపతి దేవస్థానాల పరిధిలో కూడా అమల్లోకి తీసుకువచ్చింది. జగన్ తీసుకువచ్చిన రివర్స్ టెండరింగ్ విధానం యొక్క ఏకైక లక్ష్యం ఏంటంటే.. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కేటాయించిన కాంట్రాక్టులు అన్నింటినీ ఏకమొత్తంగా రద్దు చేయడం! అన్ని చోట్ల అదే పనిచేసుకుంటూ వెళ్లారు.

కానీ, తిరుమల విషయానికి వచ్చేసరికి ఈ రివర్స్ టెండరింగ్ విధానం ఇంకా దారుణమైన ప్రభావాన్ని చూపించింది. జగన్ తైనాతీలు, అప్పటి పాలకమండళ్లతో కుమ్మక్కయిన వారు.. ఏదో తక్కువ ధరలకు టెండర్లు వేశారు గానీ.. అంతకంటె నీచమైన కల్తీలకు, నాణ్యతలోపాలకు పాల్పడ్డారు. ఇప్పుడు లడ్డూ నెయ్యి కల్తీ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ ఇంతగా భ్రష్టుపట్టిపోతున్నదంటే అందుకు కారణం రివర్స్ టెండరింగ్ మాత్రమే. 

అధికారంలోకి వచ్చిన నాటినుంచి జగన్ చేసిన తప్పులను సరిదిద్దడం మీదనే తన ఫోకస్ మొత్తం పెట్టి పనిచేస్తున్న నారా చంద్రబాబునాయుడు తిరుమల విషయంలోనూ అదే పనిచేశారు. టీటీడీలో కూడా రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తున్నట్టుగా ఈవో శ్యామలరావు తాజాగా ఉత్తర్వులు జారీచేశారు. తిరుమల ప్రసాదాలకు సరుకులు తదితర వ్యవహారాల విషయంలో కనీసం ఇకమీదటనైనా సరైన నాణ్యత ప్రమాణాలు ఉంటే బాగుంటుందని పలువురు ఆశిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles