‘అమరావతి’ గేరు మారుతోంది!

Andhrawatch
2 Min Read

‘ఒక్క చాన్స్’ అంటూ దేబిరించిన జగన్మోహన్ రెడ్డికి ఏపీ ప్రజలు ఆ భాగ్యం కల్పించారు. ఆయన ముఖ్యమంత్రి అయిన నాటినుంచి విధ్వంసక పాలన అంటే ఎలా ఉంటుందో రాష్ట్రానికి రుచిచూపించారు ఆయన! కేవలం చంద్రబాబు చేసిన నిర్మాణలను అధికారికంగా కూల్పించడం మాత్రమే కాదు.. అమరావతి నగర నమూనాలను తయారుచేయిస్తే తన తొత్లులు, తైనాతీలతో వాటిని కూడా ధ్వంసం చేయించారు. ప్రపంచం తలతిప్పి చూసేలాంటి ఒక అద్భుత నగరం పురుడుపోసుకుంటున్న సమయంలో, అయిదేళ్ల పాటు విడవని గ్రహణంలాగా జగన్మోహన్ రెడ్డి అమరావతికి దాపురించారు. ఈ అయిదేళ్లలో సగం, డెబ్బయి శాతం కూడా పూర్తయన నిర్మాణాలతో పరుగులు తీయాల్సిన అమరావతిని ఒక శ్మశానంలాగా మార్చేసి.. ఒక రకమైన శాడిస్టిక్ ఆనందాన్ని అనుభవించారు జగన్.

అయిదేళ్లు గడిచాయి. అమరావతి రాజధానిని స్వప్నించిన చంద్రబాబునాయుడు ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు. నగర నిర్మాణం పట్ల తన చిత్తశుద్ధిని చాటుకున్నారు. త్వరితగతిన నిర్మాణాలు పూర్తిచేయడానికి పునరంకితం అవుతున్నట్టు ప్రకటించారు. ఆటోమేటిగ్గా రాష్ట్ర ప్రభుత్వ పరంగా జరగాల్సిన నిర్మాణాల విషయం మాత్రమే కాకుండా.. ఇతర నిర్మాణాల పరంగా కూడా అమరావతి ఇప్పుడు గేరు మారుస్తోంది.
అమరావతి ప్రాంతంలో ఏర్పాటు కానున్న కేంద్రప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా త్వరలోనే తమ పనులు, నిర్మాణాలు ప్రారంభించే అవకాశం ఉంది. చంద్రబాబు హయాంలో అమరావతి ప్రాంతంలో రిజర్వుబ్యాంకు, జాతీయ బ్యాంకులు, కాగ్, సీబీఐ, పోస్టల్, ఎన్ఐడీ, నిఫ్ట్ .. ఇలా ఇంచుమించు పదిహేనుకు పైగా కేంద్ర ప్రభుత్వ సంస్థలకు స్థలాలు కేటాయించారు. జగన్ రాగానే.. అమరావతి భవితవ్యం అయోమయంలో పడడంతో వారెవ్వరూ నిర్మాణాలు చేపట్టడానికి ముందుకు రాలేదు. మధ్యలో ఓసారి రాజధాని ఏదో తేలకపోవడం వల్లనే తాము నిర్మాణాల జోలికి వెళ్లలేదని రిజర్వు బ్యాంకు ప్రకటించింది కూడా. ఇలాంటి నేపథ్యంలో.. ఇప్పుడు సీఆర్డీయే స్వయంగా రంగంలోకి దిగింది.
స్థల కేటాయింపులు పొందిన అన్ని కేంద్రప్రభుత్వ సంస్థలకు ప్రత్యేకంగా ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు. నిర్మాణాలు ప్రారంభించడానికి ఆహ్వానిస్తున్నారు. తమకు కేటాయించిన భూములను చూపించాలని కొన్ని సంస్థలు కోరుతున్నట్టుగా తెలుస్తోంది. ఆ పర్వం కూడా పూర్తయితే.. రాష్ట్రప్రభుత్వం ముందుకు తీసుకువెళ్లే నిర్మాణాలతో పాటుగా.. కేంద్రప్రభుత్వ సంస్థలన్నీ శరవేగంతో సాగే అవకాశం ఉంది. మొత్తానికి రెండుమూడేళ్ల వ్యవధిలో.. అమరావతి నగరానికి రేఖామత్రంగా ఒకరూపు వచ్చేస్తుందని పలువురు ఆశిస్తున్నారు. 

Share This Article