జగన్మోహన్ రెడ్డి తనను ప్రజలు ముఖ్యమంత్రిని చేస్తే మాత్రమే.. వారి గురించి పట్టించుకుంటారా? అధికారం దక్కినప్పుడు మాత్రమే దానిని అనుభవించడానికి ఉత్సాహం ప్రదర్శిస్తారా? అధికారం లేనప్పుడు.. ఆయన పూర్తిగా హైబర్నేట్ మోడ్ లోకి వెళ్లిపోతారా? పార్టీగానీ ప్రజలు గానీ ఎలా పోతే నాకేంటి? అనుకునే పరిస్థితిలో ఉంటారా? అలాంటి సందర్భాల్లో పార్టీని నడిపే బాధ్యత ఎవరో ఒకరు పక్కనుండేవాళ్లు తీసుకోవాల్సిందేనా? జగన్ లో ప్రబలమైన అధికారకాంక్షయే తప్ప.. ప్రజాజీవితం అనే కోణం లేనే లేదా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. రెండు రోజుల కిందట సిట్ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి జగన్ వ్యక్తిత్వం గురించి, పార్టీ నిర్వహణ తీరు గురించి ఇండైరక్టుగా సంకేతాలు ఇస్తూ చెప్పిన మాటలు ఈ విషయాన్ని బోధ పరుస్తున్నాయి.
2014 ఎన్నికల్లో తాను ఖచ్చితంగా గెలుస్తానని జగన్మోహన్ రెడ్డి అనుకున్నారు. కానీ.. అనాథలా ఏర్పడిన కొత్త రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం అయితేనే మేలు చేస్తుందని నమ్మిన ప్రజలు .. ఆయనకు అధికారం కట్టబెట్టారు. ఆ అయిదేళ్లు జగన్ ఎలా వ్యవహరించారు. ఏదో మార్కెటింగ్ స్ట్రాటజీ గా ప్రశాంత్ కిశోర్ ఇచ్చిన సలహాల మేరకు పాదయాత్ర చేయడం కాకుండా.. పార్టీ నిర్వహణలో ఆయన రోల్ ఏమిటి? అని ఎవరికైనా అనిపించవచ్చు. ఆ అయిదేళ్ల సంక్లిష్ట కాలంలో పార్టీని నడిపింది మొత్తం తానేనని విజయసాయి రెడ్డి చెప్పుకున్నారు. అధికారంలో లేనప్పుడు కష్టకాలంలో సింగిల్ హ్యాండెడ్ గా పార్టీని నేనే నడిపాను.. అని ఆయన వెల్లడించారు. ఆయన మాటలను ఖండించడానికి వైవీ సుబ్బారెడ్డి ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పట్టి.. నెంబర్ 2 నుంచి 2000 వరకు తనను నెట్టేశారని ఆయన చేసిన ఆరోపణల మీద కౌంటర్ ఇచ్చారే తప్ప.. ఆయన కీలకంగా చెప్పిన ఈ సంగతి గురించి సమాధానం చెప్పలేదు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు తానే దిక్కుగా ఉన్నానని, పార్టీ అధికారంలోకి రాగానే.. జగన్ చుట్టూ ఆరునెలల్లోనే చాలా గట్టి కోటరీ ఏర్పడిందని.. ఆయన ఆరోపించారు.
ఇక్కడ కీలకంగా గమనించాల్సింది ఏంటంటే.. 2014-19 మధ్య కాలంలో జగన్ పార్టీని పట్టించుకోలేదు. పాదయాత్ర అనేది.. గెలవడానికి ఒక అడ్డదారిగా చేశారు తప్ప.. నిజాయితీతో కాదని తెలుస్తోంది. ఆయన పార్టీని గాలికొదిలేస్తే.. తానే కాపాడుకుంటూ వచ్చానని విజయసాయి మాటలను బట్టి తెలుస్తోంది. ఇప్పుడు 2024 తర్వాత కూడా అదే జరుగుతోంది. జగన్ ప్రతి వీకెండ్ కి బెంగుళూరు యలహంక ప్యాలెస్ కు వెళ్లిపోతూ.. పార్టీని గాలికొదిలేస్తున్నారు. ఏదో మొక్కుబడిగా అప్పుడప్పుడూ కొన్ని సమావేశాలు, అంతకంటె కొంచెం ఎక్కువగా ట్వీట్లు చేస్తున్నారు. ఇప్పుడు జగన్ తీరును జాగ్రత్తగా గమనిస్తే.. విజయసాయి మాటలు నిజమే అనిపిస్తుంది. జగన్ అధికారంలో ఉంటేనే రాష్ట్రం గురించి, ప్రజల గురించి పట్టించుకున్నట్టుగా కనిపిస్తారు. అధికారం లేకపోతే.. ఇక అంతే సంగతులు అనేదే ఆయన వ్యక్తిత్వం అని అర్థమవుతోంది.
జగన్ బుద్ధిపై విజయసాయి మాట గమనించారా?
Sunday, February 1, 2026
