సీఐడీ చేతికి వెళ్లాక.. అరెస్టులే తరువాయి!

Friday, October 18, 2024

చంద్రబాబునాయుడు నివాసం, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి తదితర కేసులు పోలీసు వ్యవస్థ నుంచి సీఐడీకి బదిలీ చేయడం అనే నిర్ణయం జరిగింది. అయితే ఈ నిర్ణయానికి సంబంధించిన ఉత్తర్వులు ఇంకా పోలీసులకు అందలేదు. అందువల్ల.. వారు తమ సహజ క్రమంలో విచారణ చేసుకుంటూపోతున్నారు.నిందితులను ఇంకా స్టేషనుకు పిలిపించి ప్రశ్నలు అడుగుతున్నారు. విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి పోలీసులు దర్యాప్తు దాదాపుగా పూర్తి చేశారు.నిందితుల పాత్రలకు సంబంధించిన పక్కా వివరాలను సాక్ష్యాలను కూడా సేకరించారు. సూత్రధారుల పాత్రకు సంబంధించి కూడా పక్కా ఆధారాలు సేకరించారు. కేవలం, కొందరు నాయకులు తమను అరెస్గు చేయకుండా కోర్టునుంచి ప్రత్యేక ఉత్తర్వులు తెచ్చుకుని ఉన్న కారణంగా మాత్రమే ఆ ప్రక్రియ ఆలస్యం అవుతోంది. రెండు మూడురోజుల వ్యవధిలో కేసు సీఐడీకి బదిలీ అవుతుందని.. వారు కోర్టు ద్వారానే నిందితుల అరెస్టుకు అనుమతులు తీసుకుని ఆ తర్వాత అరెస్టు చేయడం ద్వారా కేసు విచారణలో ముందుకు వెళతారని తెలుస్తోంది.

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద జరిగిన దాడి వ్యవహారానికి కీలక సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సజ్జల రామక్రిష్ణారెడ్డి గురువారం మంగళగిరి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నాయకుల్లో ఇతర నిందితుల మాదిరిగానే ఆయన కూడా పోలీసులకు అన్నీ డొంకతిరుగుడు సమాధానాలే చెప్పారు. అప్పట్లో ఈ దాడికి కారణంగా వైసీపీ నాయకులు చెబుతున్న- తెలుగుదేశం నేత పట్టాభిమాటలను కూడా ఉదాహరించారు. ఆ మాటలు వింటే తనకే రక్తం మరిగిందని, పట్టాభిని తన్నాలని అనిపించిందని పోలీసులతో అన్నారు.

అయితే ఈ విచారణలో కొన్ని కీలకమైన ట్విస్టులు ఇప్పటికే పోలీసులకు సాక్ష్యాల సహా దొరికినట్టుగా తెలుస్తోంది. దాడికి సూత్రధారులైన కీలక నాయకులందరూ అతి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఫోను ఇవ్వాలని కోరితే దానికి డొంకతిరుగుడు సమాధానాలు చెబుతున్నారు. లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురామ్, దేవినేని అవినాష్ అందరిదీ ఒకటే బాటగా ఉంది. సజ్జల కూడా అదే మాటలు వల్లించారు. 2021 తరువాత నాలుగు ఫోన్లు మార్చానని, అయినా కూడా తాను తన ఫోను ఇవ్వబోనని ఆయన తెగేసి చెప్పారు. కానీ విషయం ఏంటంటే.. ఈ నిందితులు ఫోన్లు ఇవ్వకపోయినా సరే.. దాడి వెనుక వారి పాత్రను నిర్దరించే ఆధారాలను పోలీసులు పక్కాగా సేకరించారని తెలుస్తోంది. ఆ ఆధారాలు అన్నింటినీ కోర్టుకు సమర్పించి.. కోర్టు ద్వారానే వీరి అరెస్టుకు ఉత్తర్వులు తీసుకుంటారని, ఇప్పుడు విచారణ ఎదుర్కొన్న వారందరినీ అరెస్టు చేసే అవకాశం ఉన్నదని తెలుస్తోంది. మరి ఈ వైసీపీ దళాలు మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లే ప్రయత్నం చేస్తాయో లేదో వేచిచూడాలి. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles