నాగార్జున గోడును లైట్ తీసుకున్న రేవంత్!

Sunday, October 13, 2024

మామూలు పరిస్థితుల్లో అయితే.. ఇలాంటి సందర్భాల్లో నాయకుల స్పందన ఇంకో తీరుగా ఉండేది. కానీ, ఇప్పుడు వాతావరణం వేరు. అక్కినేని నాగార్జున కుటుంబానికి, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య శత్రువాతావరణం ఉంది. ఇలాంటి నేపథ్యంలో నాగార్జున గోడును ప్రభుత్వంలోని నాయకులు ఎవ్వరూ కూడా పట్టించుకోవడం లేదు. నాగార్జున గురించి ఆయన కొడుకు నాగచైతన్య గురించి మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఆ సినీహీరో కోర్టును ఆశ్రయించినప్పటికీ..  ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి గానీ, కాంగ్రెస్ పార్టీ గానీ దానిని లైట్ తీసుకున్నారు. ‘కోర్టుకు వెళ్లావు కదా.. అయితే కోర్టులోనే తేల్చుకో’ అన్నట్టుగా వారు ఇగ్నోర్ చేశారు.

కొండాసురేఖ ఫోటోలను ట్రోలింగ్ చేస్తూ భారత రాష్ట్ర సమితికి చెందిన సోషల్ మీడియా దళాలు.. హేయమైన పోస్టులు పెట్టిన దగ్గరినుంచి వివాదం ప్రారంభం అయింది. ఆ పోస్టులను ఖండించని కేటీఆర్ స్త్రీలోలుడు అని అర్థం వచ్చేలా కొండా సురేఖ ఒక రేంజిలో ఆయనను విమర్శించారు. సినీ హీరోయిన్లను తన వద్దకు పంపమని అంటాడని అన్నారు. సమంతను తన వద్దకు పంపమంటే.. నాగార్జున, నాగచైతన్య వెళ్లమన్నారని అంటూ, ఆమె ఒప్పుకోనందువల్లనే విడాకులు అయ్యాయన్నారు. ఈ వ్యాఖ్యలను అటు నాగార్జున, ఇటు సమంత కూడా ఖండించారు. సమంతకు మాత్రం సారీ చెప్పిన కొండా సురేఖ ఆమె విషయంలో  వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. నాగార్జున తర్వాత పరువునష్టం దావాతో కోర్టుకు వెళ్లారు. కేటీఆర్ కూడా మరో కేసు వేశారు. ఈలోగా సినీ ప్రముఖులు అనేకమంది నాగార్జున కు అనుకూలంగా కొండా సురేఖను విమర్శించారు.

ఈ పరిణామాలతోనే.. భారాసతో కలిసి నాగార్జున అనుకూలంగా వ్యవహరిస్తున్నట్టుగా ఒక కలర్ వచ్చింది. దీనికి ఎన్ కన్వెన్షన్ హైడ్రా కూల్చివేతల్లో నేలమట్టం చేసేసిన తర్వాత.. ప్రభుత్వం మీద నాగార్జున చేసిన వ్యాఖ్యలన్నీ కలిపి ఒక శత్రుభావాన్ని ఆల్రెడీ ఏర్పరచి ఉంచాయి. ఈ నేపథ్యంలో నాగార్జున గోడును కాంగ్రెస్ అస్సలు పట్టించుకోకుండా ఇగ్నోర్ చేస్తుంది.

సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో, నాగార్జున పట్ల వేరే వ్యతిరేకత లేకపోతే, కొండా సురేఖ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం వంటి ప్రకటన పార్టీ అధికారికంగా చేస్తుంది. ఆమెను సంజాయిషీ అడుగుతుంది. ఇలా మాట్లాడినందుకు నోటీసు ఇస్తుంది. కానీ ఇప్పుడు అలాంటివేం జరగలేదు. పార్టీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ ఆమె అలా మాట్లాడి ఉండాల్సింది కాదంటూనే, ఆ వ్యాఖ్యలు కావాలని చేసినవి కాదని, కేటీఆర్ వైఖరి వల్లనే ఆ మాటలు వచ్చాయని సమర్థించడం గమనార్హం. పైగా ఇప్పటిదాకా కొండా సురేఖను కాంగ్రెస్ అధిష్ఠానం ఈ విషయంలో ఎలాంటి వివరణ కోరలేదని కూడా ఆయన ధ్రువీకరించారు. పార్టీ పరంగా కాంగ్రెస్ నాగార్జున గోడును పట్టించుకోదలచుకోలేదని అర్థమవుతోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles