పెద్దిరెడ్డి పేరొక్కటేనా? పెద్దరెడ్ల పేర్లు కూడా వస్తాయా?

Saturday, October 5, 2024

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని, వనరుల్ని దోచుకుని పంచుకున్న అయిదేళ్ల కాలంలో ఒక పాపానికి సంబంధించిన వ్యవహారాలు దాదాపుగా ఒక కొలిక్కి వస్తున్నాయి. ఇసుక తవ్వకాలు, విక్రయాలకు సంబంధించిన అక్రమాలకు ప్రధాన సూత్రధారిగా ఉన్నటువంటి గనులశాఖ అప్పటి డైరక్టర్ వెంకటరెడ్డి ప్రస్తుతం ఏసీబీ కస్టడీలో విచారణను ఎదుర్కొంటున్నారు. ఇసుక విక్రయాల్లో అక్రమాలు జరిగినట్టుగా, తవ్వకాల దగ్గరినుంచి విక్రయాలు, రవాణా వంటి సమస్త వ్యవహారాలను ప్రెవేటు కంపెనీలకు అప్పగించడం వెనుక చోటు చేసుకున్న మతలబుల గురించి వెంకటరెడ్డి సూచనప్రాయంగా విచారణలో ఒప్పుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ‘అంతా పైవారి ఆదేశాల మేరకే చేశాను’ అని ప్రతి ప్రశ్నకూ జవాబు చెప్పిన వెంకటరెడ్డి తనతో అక్రమాలు చేయించిన పెద్దల పేర్లు మాత్రం అడగవద్దని తాను చెప్పలేనని అనడం విశేషం.

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొత్త ఇసుక విధానం తీసుకువచ్చింది. ఇసుక ధరలు అమాంతం పెరిగాయి. తవ్వకం దగ్గరినుంచి సరఫరా వరకు పనులన్నీ ప్రెవేటు కంపెనీలకు అప్పగించారు. అప్పట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గనుల శాఖ మంత్రిగా ఉన్నారు. పెద్దిరెడ్డికి సన్నిహితులైన కంపెనీల పేర్లతోనే కాంట్రాక్టులు అన్నీ కట్టబెట్టేశారనే ఆరోపణలు వచ్చాయి. పైగా ఇసుక తవ్వకాల్లో అనేక అరాచకాలు కూడా చోటు చేసుకున్నాయి.  అనుమతుల్లేకుండానే తవ్వకాలు సాగించడం, ఒకే బిల్లుతో అనేక లారీల ఇసుకను సరఫరా చేయడం వంటి అక్రమాలు అనేకం. నిజానికి ఇసుక అక్రమ దందాల్లో రాష్ట్రంలోని ప్రతి వైసీపీ ఎమ్మెల్యే కూడా కోట్లాది రూపాయలు కాజేశారు. కాంట్రాక్టు సంస్థలకు అప్పగించిన పనుల రూపంలోనే దాదాపు 2600 కోట్ల రూపాయల మేర దోచుకున్నట్టుగా తమ దర్యాప్తులో తేలిందని, వాటి అంతిమ లబ్ధిదారు ఎవరని దర్యాప్తు అధికారులు ప్రశ్నించినప్పుడు అక్రమాలు జరిగినట్టు ఒప్పుకున్న వెంకటరెడ్డి.. పైవారి ఆదేశాల మేరకే అంతా జరిగిందని ఆ పేర్లు తాను చెప్పలేనని అన్నట్టు తెలుస్తోంది. 

నేరం జరిగిందని ఖరారైన తర్వాత ఇవాళ కాకపోతే రేపైనా తెరవెనుక సూత్రధారుల పేర్లు బయటకు రావాల్సిందే. ఇప్పటికే జరుగుతున్న ప్రచారాన్ని బట్టి అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు తప్పకుండా బయటకు వస్తుందని, ఆయన పేరుతోనే ఆగుతుందా.. లేదా, ఆయనకంటె పైస్థాయిలోని పెద్దపెద్ద రెడ్ల పేర్లు కూడా బయటకు వస్తుందా? అనే స్పష్టత రావడం లేదు. మొత్తానికి ప్రభుత్వం చెబుతున్న 2600 కోట్లు అనేది అధికారిక దోపిడీ మాత్రమేనని.. లెక్కలకు దొరక్కుండా ఇంకా వేల కోట్ల దోపిడీ ఇసుక విక్రయాలు, తవ్వకాల రూపంలో జరిగిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

వెంకటరెడ్డి ద్వారా ఏసీబీ అదికారుల పేర్లు కూడా ఎలా బయటకు రప్పిస్తారో, ఏయే పేర్లు బయటికొస్తాయో వేచిచూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles