జగన్ ఆదేశంపై కాంగ్రెస్ ను దెబ్బతీయడమే పొంగులేటి ఎత్తుగడ!

Saturday, October 5, 2024

తెలంగాణాలో కేసీఆర్ పాలనను అంతమొందించే లక్ష్యంతోనే తన రాజకీయ అడుగులు ఉంటాయని పదే పదే చెబుతున్న బిఆర్ఎస్ బహిష్కృత నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ పార్టీలో చేరమని ఒక వంక కాంగ్రెస్, మరోవంక బిజెపి ఆహ్వానిస్తున్నా `గొంతెమ్మ కోర్కెలతో’ చేరకుండా దాటవేస్తుండటం వెనుక లోతైన రాజకీయ వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. 

తాజాగా, ఆ రెండు పార్టీలలో ఏపార్టీలో కూడా చేరకుండా `తెలంగాణ రైతు సమితి’ (టిఆర్ఎస్) పేరుతో నమోదైన పార్టీ పేరుతో సొంతంగా ప్రజలవద్దకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సంకేతాలు ఇవ్వడం ఆసక్తి కలిగిస్తుంది. ఈ నెల 22న కొత్త పార్టీ విషయం ప్రకటిస్తారని, తెలంగాణ ఆవిర్భవించిన జూన్ 2న కొత్త పార్టీని ప్రారంభిస్తారని కూడా కధనాలు వెలువడుతున్నాయి.

అయితే, ఈ సందర్భంగా ఆయన తెలంగాణాలో మొత్తం సీట్లకు పోటీచేయకుండా కేవలం 45 నుండి 50 సీట్లపైననే దృష్టి సారిస్తున్నట్లు వార్తలు రావడం ప్రాధాన్యత సంతరింప చేసుకుంది. ముఖ్యంగా `రెడ్డి సామాజిక’ వర్గం నేతలను బిఆర్ఎస్ కు వ్యతిరేకంగా సమీకరించేందుకు ప్రయత్నం చేస్తున్నారని కూడా చెబుతున్నారు.

ఈ ఎత్తుగడలను చూస్తుంటే పొంగులేటి ఉద్దేశ్యం కేసీఆర్ ను గద్దె దించడం కాదని, కాంగ్రెస్ ను దెబ్బతీయడమే అని స్పష్టం అవుతుంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పొంగులేటి సన్నిహితుడు కావడం, ఈ మధ్యన కూడా రెండు సార్లు వెళ్లి కలిసి రావడం తెలిసిందే. అందుకనే జగన్ ఆదేశంపై, తెలంగాణాలో ఆయన మిత్రుడు కేసీఆర్ ను ఆదుకోవడం కోసం కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకు వ్యూహరచన చేస్తున్నట్లు పలువురు భావిస్తున్నారు.

 పైగా, తెలంగాణాలో కాంగ్రెస్‌, బీజేపీల పరిస్థితిపై పొంగులేటి చేయించుకున్న సర్వేలో కాంగ్రె్‌సకు 46శాతం, బీజేపీకి 18శాతం అనుకూలంగా ఉన్నట్లు వెల్లడైంది. అంతే కాంగ్రెస్ దాదాపు అధికారంకు దగ్గరలో ఉన్నట్లు స్పష్టం అవుతుంది. అందుకనే కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్న రెడ్డి సామాజికవర్గంలో చీలిక తీసుకు రావడం కోసమే పొంగులేటి ఎత్తుగడలు కేంద్రీకృతమై ఉన్నట్లు కనిపిస్తున్నది. 

ఆయన దృష్టి సారించిన 45 నుండి 50 నియోజకవర్గాలు సహితం కాంగ్రెస్ కు బలమైనవే అయి ఉంటాయని, వాటిల్లో గట్టి అభ్యర్థులను నిలబెట్టడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి, బిఆర్ఎస్ అభ్యర్థులు సునాయనంగా గెలుపొందేందుకు సహకరించే ఉద్దేశ్యంతో ఉన్నట్లు అర్థం అవుతుంది.

మరోవంక, ఈ ఎత్తుడలో పొంగులేటి బిజెపి కేంద్ర నాయకత్వం కూడా అండగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక వంక కాంగ్రెస్ అభ్యర్థులను ఆడిస్తూ, మరోవంక అక్కడక్కడా బిజెపి అభ్యర్థులు గెలుపొందేందుకు సహకరించడమో లేదా స్థానికంగా పొత్తుకు సిద్దపడతామో చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ బలంగా ఉన్న ఉత్తర తెలంగాణ జిల్లాలపైననే ప్రధానంగా పొంగులేటి దృష్టి సారిస్తున్నట్లు స్పష్టం అవుతుంది.

ప్రస్తుతం పొంగులేటి బలం అంత ఎక్కువగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు పరిమితమై ఉంది. అక్కడ వాస్తవానికి బిఆర్ఎస్ కు చెప్పుకోదగిన బలం లేదు. 2014 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా ఖమ్మం నుండి ఎంపీగా గెలుపొంది, వైఎస్ జగన్ ఆదేశంపై నాటి టిఆర్ఎస్ లో చేరారు. చేరుతూ తనతో పాటు కొందరు ఎమ్యెల్యేలను కూడా తీసుకెళ్లారు. ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బిఆర్ఎస్ కు ఉన్న ఎమ్యెల్యేలు అందరూ ఇతర పార్టీల నుండి వచ్చిన ఫిరాయింపుదారులే.

అందుకనే ఖమ్మం జిల్లాలోని మొత్తం 10 నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్ధులని నిలబెట్టడం ద్వారా కాంగ్రెస్ నడ్డి విరిచే వేసేందుకు ఎత్తుగడ వేసినట్లు కనిపిస్తున్నది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles