కవిత అరెస్ట్ తో బెంగాల్ లో చేసిన పొరపాటే బిజెపి చేస్తుందా!

Thursday, September 19, 2024

రాజకీయాలలో అనుభవాలే ఎన్నో పాఠాలు నేర్పుతూ ఉంటాయి. అనుభవాలతో పొరపాట్లను సరిదిద్దుకొని, సరికొత్త వ్యూహాలను అమలుపరిచే వారే విజయం సాధిస్తుంటారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ అందెవేసిన చేయి. తాను గతంలో చేసిన అనేక హామీలను అమలు పరచలేకపోయినా ఎప్పటికప్పుడు సరికొత్త విషయాలను తెరపైకి తెచ్చి ప్రజల దృష్టి తనవైపే ఉండేటట్లు చేస్తూ ఇప్పటివరకు అజేయంగా నిలుస్తున్నారు.

అయితే, కేసీఆర్ ను గద్దె దించి, తెలంగాణాలో ఎట్లాగైనా అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉన్న బిజెపి మాత్రం ఈ విషయంలో వెనుకబడి ఉన్నట్లు స్పష్టం అవుతుంది. ప్రతి రాష్ట్రంలో ఒకే ఫార్ములా అనుసరిస్తూ రావడంతో సరికొత్త ఇమేజ్ తో ప్రజల ముందుకు రాలేకపోతున్నది. ముఖ్యంగా ఇతర రాష్ట్రాలలో విఫలమైన ప్రయోగాలనే ఇక్కడ కూడా చేస్తూ బొక్కబోర్లా పడుతున్నది.

ఎంతసేపు కేసీఆర్ కుటుంబాన్ని, ఆయన పరిపాలనను నిందించడం, వ్యక్తిగత విమర్శలకు దిగడం మినహా తాము అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో చెప్పే ప్రయత్నం చేయడం లేదు. ముఖ్యంగా రెండేళ్ల క్రితం పశ్చిమ బెంగాల్ లో ఎంతో ఉధృతంగా ప్రచారం చేసి, అధికారంలోకి వచ్చేస్తున్నట్లు మాట్లాడి ఘోరంగా విఫలమైన ప్రయోగాలనే తెలంగాణాలో అమలుచేసే ప్రయత్నం చేస్తున్నారు.

కేసీఆర్ కుమార్తె కవితను ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్ట్ చేయడం ద్వారా కేసీఆర్ అవినీతిపరుడని ప్రజలను నమ్మించి, ఓట్లు పొందే ఎత్తుగడ వేస్తున్నట్లు కనిపిస్తున్నది. అయితే పొరుగున ఉన్న బిజెపి ఎమ్యెల్యే ఇంట్లో కోట్లకొలది రూపాయల నోట్లు బయటపడటం, అనేకమంది బిజెపి మంత్రులు, ఎమ్యెల్యేలపై తీవ్ర అవినీతి ఆరోపణలు వెలుగులోకి వేస్తుండడంతో అవినీతి విషయంలో బిజెపిని జనం నమ్మే పరిస్థితులు కనబడటం లేదు.

బెంగాల్ లో సహితం ఎన్నికల ముందు మమత మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ మీద సీబీఐ దాడులు చేయడం ద్వారా ఎన్నికల నిర్వహణలో ఆమెకు కుడిభుజంగా ఉన్న వ్యక్తిని దారిమళ్లించే ఎత్తుగడ వికరించింది. పైగా, తనను ఎన్నికలలో ఎదుర్కోలేక తమ కుటుంభం సభ్యులను వేధిస్తున్నారంటూ  బిజెపి బాహ్దితురాలిగా మమత ప్రజల సానుభూతి పొందగలిగింది.

మమతను ఎంతగా విమర్శిస్తే, ఆమె అంత పెద్ద బాధితురాలిగా బెంగాల్ ప్రజలకు కనపడింది. ప్రజలెప్పుడూ బాధితుల వైపే నిలబడతారని గ్రహించలేక బీజేపీ చావు దెబ్బతిన్నది. ఒకవేళ ఇక్కడ కూడా కవితను సీబీఐ అరెస్టు చేస్తే, భవిష్యత్తులో బీఆర్‌ఎస్‌‌కి కూడా ఇలాంటి సానుభూతే లభించే అవకాశం లేకపోలేదు.

పైగా, మమతను అరెస్ట్ చేయబోతున్నారంటూ చాలాకాలంగా బిజెపి నేతలు బహిరంగంగా చెబుతూనే ఉంటున్నారు. అంటే రాజకీయ కారణాలచేత అరెస్ట్ చేశారనే అభిప్రాయం కూడా వ్యాప్తి చేయడంలో కేసీఆర్ దిట్ట అని మరచిపోలేక పోతున్నారు.

 అభిషేక్‌ బెనర్జీ విషయంలో జరిగినట్టుగానే, కవిత చేసిన తప్పు ఎన్నికల ముందే ఎందుకు గుర్తొచ్చింది? సీబీఐ, ఈడీలు ఎన్నికల ముందే ఎందుకు రావాల్సి వచ్చింది? అనే ప్రశ్నలు బీజేపీకి ప్రతికూలంగా మారే ప్రమాదం లేకపోలేదు. పైగా మద్యం కేసులో వందల కోట్ల రూపాయాలు చేతులు మారాయి అనడమే గాని, ఇప్పటి వరకు ఒక్క రూపాయి అక్రమంగా బదిలీ అయిన్నట్లు, ఎవరికైన చేరినట్లు సాక్ష్యం సంపాదించలేక పోయారు.

నోట్లకు ఓట్ల కేసులో సహితం కెమెరా ముందు నోట్లు ఇస్తూ రేవంత్ రెడ్డి తెలంగాణ పోలీసులకు చిక్కినా ఆ డబ్బు ఎక్కడి నుండి వచ్చిందో ఆధారాలు సంపాదించలేక పోవడంతో ఆ కేసు ముందుకు సాగడం లేదు. అందుకనే సిబిఐ అరెస్ట్ చేస్తే వెంటనే బెయిల్ వస్తుందనే, ఎక్కువకాలం జైలులో ఉంచాలని ఈడీని రంగంలోకి దింపి అరెస్టులు చేయిస్తున్నారు.

సిబిఐ అరెస్ట్ చేసి జైలులో ఉంచిన ఆప్ నేత మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చే అవకాశం ఉందనే  ముందురోజు హడావుడిగా ఈడితో అరెస్ట్ చేయించారు. ఇవ్వన్నీ గ్రహించలేనంత అమాయకులు తెలంగాణ ప్రజలు కాదని బీజేపీ నేతలకు అర్థం కావడం లేదు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles