సోము వీర్రాజు బృందంతో పురందేశ్వరి రాజీ!

Thursday, September 19, 2024

అనుకోకుండా ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి లభించడంతో మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి రాష్ట్రంలో పార్టీ బ్రష్టు పట్టడానికి కారణమైన మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు బృందంతో రాజీ ధోరణి ఆవలంభించనున్నట్లు ఆమె పదవి చేపట్టిన సందర్భంగా చేసిన వాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. ఏపీలో పార్టీ ఇంతగా బ్రష్టు పడుతుంటే ఇన్ ఛార్జ్ గా కనీసం రిపోర్ట్ కూడా ఇవ్వలేదంటూ ఏపీ ఇన్ ఛార్జ్, కేంద్ర సహాయ మంత్రి మురళీధరన్ ను స్వయంగా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఆగ్రహంతో ప్రశ్నించారు.

సోము బృందాన్ని సీఎం వైఎస్ జగన్ బినామీలుగా ఏపీ ప్రజలు కోహిస్తున్నారని స్పష్టం కావడంతో పార్టీ ఉనికి కోసం ఆమెను అధ్యక్షురాలిగా చేశారు. జగన్ ప్రభుత్వంకు ఒక వంక కేంద్రం అండగా ఉంటూనే రాజకీయంగా రాష్ట్రంలో ఈ ప్రభుత్వంతో తమకు సంబంధం లేదనే సంకేతం ప్రజలకు ఇచ్చేందుకు తంటాలు పడుతున్నారు. అందుకనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ఢిల్లీ పిలిపించి అమిత్ షా భేటీ అయ్యారు.

మరోవంక, జెపి నడ్డా, అమిత్ షా స్వయంగా దేశంలోనే అత్యంత అవినీతికర ప్రభుత్వం అంటూ బహిరంగసభలలో జగన్ పై చిందులేశారు.  ఇటువంటి సమయంలో అధ్యక్ష పదవి చేపట్టిన ఆమె కొత్త బృందాన్ని ఎంచుకొని, పార్టీకి రాష్ట్రంలో `క్లీన్ ఇమేజ్’ తీసుకొస్తారని అందరూ ఆశించారు. అయితే సోము వీర్రాజు పనితీరును మెచ్చుకొని విధంగా ఆమె మాట్లాడారు.

తాను జాతీయ స్థాయిలో ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పటికీ ఏపీలో తన సొంత జిల్లాలో కూడా పార్టీ కమిటీలలో తన మద్దతుదారులను నియమించుకోలేక పోయిన పురందేశ్వరి సోము వీర్రాజు, జివిఎల్ నరసింహారావు, సునీల్ దేవధర్ బృందం కారణంగా ఎన్నో అవమానాలకు గురయ్యారు. అయితే ఇప్పుడు వారితో పెట్టుకొంటే తనపై దుష్ప్రచారంకు దిగి, అధ్యక్షురాలిగా పనిచేయనీయకుండా అడుగడుగునా అడ్డుపడతారనే భయంతో ఆమె ఉన్నట్లు కనిపిస్తున్నది.

అందుకనే ఆమె అధ్యక్ష పదవి చేపట్టిన కొద్దీ సేపటికే దేవధర్, జివిఎల్ చంద్రబాబు నాయుడుపై విషం కక్కే ప్రయత్నం చేశారు. చంద్ర‌బాబుని క‌మలం క‌ట్ట‌ప్ప‌గా అభివ‌ర్ణించారు.  దివంగత ఎన్టీఆర్ చాలా గొప్ప వ్యక్తి అని, బాహుబలి వంటి ఆయనను కట్టప్ప మాదిరి చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని సునీల్ దేవధర్ విమర్శించారు.  

అలాగే 2014లో బీజేపీతో కలిసి చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని… ఆ తర్వాత బీజేపీని క‌ట్ట‌ప్ప‌లా వెన్నుపోటు పొడిచి బయటకు వెళ్లిపోయారని ఆరోపించారు.  పైగా, సోము వీర్రాజు నాయకత్వంలో ఏపీలో బీజేపీ గ్రాఫ్ పెరిగిందని కితాబునిచ్చారు. ప్రజాపోరు యాత్ర ద్వారా పార్టీని వీర్రాజు ప్రజల్లోకి బాగా తీసుకెళ్లారని కొనియాడారు.

మరోవంక, ప్రధాన ప్రతిపక్షం టీడీపీపై ప్ర‌జ‌ల‌లో విశ్వసనీయత లేదని జివిఎల్ విమర్శించారు. బిజెపిని న‌ట్టేట ముంచిందే చంద్ర‌బాబు అంటూ మండిపడ్డారు. ఇంతకు వైసిపి ప్రభుత్వంపై  పోరాటాలు చేస్తామని మాట తినకపోవడం గమనార్హం. పురందేశ్వరి బాధ్యతలు చేపట్టిన రోజున అసందర్భంగా చంద్రబాబుపై విషం కక్కడం ద్వారా ఆమె తమ దారిలో నడిస్తే సరే, లేకపోతే ఆమెకు పార్టీలో `ముళ్లబాట’ కాగలదంటూ పరోక్షంగా హెచ్చరించినట్లయింది. 

మరోవంక, పురందేశ్వరి సహితం తన ముందున్నవారి గురించి `గార్బేజ్’ వినడానికి, వారిని తప్పులు పట్టేందుకు తాను సిద్ధంగా లేనని తనను కలిసిన వారితో స్పష్టం చేస్తున్నారు. అంటే ఆ బృందంతో విరోధం పెట్టుకొనేందుకు ఆమె భయపడుతున్నట్లు స్పష్టం అవుతుంది. మూడేళ్ళ కాలంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు బృందాన్ని పూర్తిగా పార్టీ నుండి సోము వీర్రాజు బృందం పక్కన పెట్టడం, తనకంటూ పార్టీలో ఎవ్వరూ లేకపోవడంతో ఒంటరిగా నిలబడలేనని ఆమె భావిస్తున్నట్లు కనిపిస్తున్నది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles