సిద్ధిపేటలో హరీశ్ ఓటమే మైనంపల్లి టార్గెట్!

Saturday, May 4, 2024

తెలంగాణ రాజకీయాలలో అనుకున్నదే అయింది. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు మళ్ళీ కెసిఆర్ టికెట్ ధృవీకరించారు గాని ఆయన తన తిరుగుబాటు బాట నుంచి పక్కకు రాలేదు. పర్యవసానంగా ఆయన అభ్యర్థిత్వాన్ని మార్చాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ తిరుగుబాటును గులాబీ దళపతి సీరియస్ గా తీసుకున్నారు. మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి కొత్తగా అభ్యర్థిని ప్రకటించడానికి మూడు పేర్లను పరిశీలిస్తున్నారు. టికెట్లు ప్రకటించడానికి కొన్ని గంటల ముందే.. తనకు, తన కొడుకుకు కూడా టికెట్లు ఇవ్వకపోతే.. తాము ఇండిపెండెంట్లుగా పోటీచేస్తాం అని మైనంపల్లి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మేరకే ఆయన పార్టీకి దూరం అయిపోతున్నరు. అయితే సిద్ధిపేటలో హరీశ్ రావు ఓటమే మైనంపల్లి టార్గెట్ గా ఉన్నట్టుగా పలువురు విశ్లేషిస్తున్నారు.

మైనంపల్లి తండ్రీ కొడుకులు ఇండిపెండెంటుగా పోటీచేయడానికి సిద్ధంగానే ఉన్నారు. కానీ.. గెలుపు గుర్రాలు కాగల వారిని తమ పార్టీలో చేర్చుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. అయితే.. కుటుంబంలో రెండేసి టికెట్లు ఇవ్వడంపై కాంగ్రెస్ కు కొన్ని అభ్యంతరాలున్నాయి. సీనియర్లకే అలా ఇవ్వకూడదని వారు గతంలోనే నియమం పెట్టుకున్నారు. ఇప్పుడు మైనంపల్లి ఫ్యామిలీని ఆహ్వానించి రెండు టికెట్లు ఇస్తే రచ్చరచ్చ అయిపోతుంది.

ఆ సంగతి పక్కన పెడితే.. మైనంపల్లి హన్మంతరావు మాత్రం.. ఎట్టి పరిస్థితుల్లోనూ సిద్ధి పేటలో హరీశ్ రావు హవాకు గండి కొట్టాలనే ప్రయత్నంలో చాలా సీరియస్ గా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. తన కొడుకు రాజకీయ జీవితం మాత్రమే తనకు ప్రధానమని హన్మంతరావు తొలినుంచి చెబుతున్నారు. మెదక్ లో కొడుకును ఇండిపెండెంటుగా పోటీచేయించడం గ్యారంటీ అని అనుకోవచ్చు. అయితే తాను ప్రస్తుతం భారాస తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజిగిరినే ఎంచుకుంటారా? లేదా, హరీష్ ను దెబ్బకొట్టడానికి తాను సవాలు విసిరినట్టుగా సిద్ధిపేట నుంచి బరిలోకి దిగుతారా? అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.

కొడుకుకు టికెట్ కోసం పట్టుబట్టిన హన్మంతరావు.. తామిద్దరూ ఇండిపెండెంట్లుగా పోటీచేసిన తర్వాత.. నెగ్గితే అప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలో చేరాలని కూడా అనుకుంటున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles