వినుకొండలో వైసిపి టిడిపి నేతల మధ్య ఘర్షణ

Saturday, September 7, 2024

మరోసారి పల్నాడు జిల్లా వినుకొండ పట్టణం రణరంగంగా మారింది. టీడీపీ-వైసీపీ వర్గీయులు రాళ్లు రువ్వుకున్నారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా అదుపుతప్పింది. పరిస్థితులను కంట్రోల్‌కి తెచ్చేందుకు సీఐ గాల్లోకి కాల్పులు జరిపారు. ఇరువర్గాల ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. మరోవైపు ఇరువర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నం చేశారు. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జివీ ఆంజనేయులుపై అక్రమ కేసులకు నిరసనగా టిడిపి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహిస్తుండగా స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ వద్దకు రాగానే వైసిపి నాయకులు, కార్యకర్తలు అక్కడికి భారీగా చేరుకోవడంతో ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. దీంతో పరిస్థితి అదుపు తప్పింది. 

ఇరు వర్గాలను అదుపు చేసేందుకు పట్టణ సీఐ సాంబశివరావు గన్ బయటికి తీసి గాల్లో ఒక రౌండ్ కాల్పులు జరిపారు. దీంతో అక్క‌డివారంద‌రూ చెల్లాచెదుర‌య్యారు.. ఇరువ‌ర్గాల‌ను పోలీసులు అక్క‌డి నుంచి పంపివేసి ప‌రిస్థితిని అదుపు చేశారు. వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకి వ్యతిరేకంగా టీడీపీ నేత  జీవీ ఆంజనేయులు చేస్తున్న పోరాటమే ఉద్రిక్తలకు దారితీసింది. ఎమ్మెల్యే మైనింగ్ అక్రమాలపై టీడీపీ కార్యకర్తలు చేపట్టిన ర్యాలీకి ఎమ్మెల్యే ఎదురుపడటంతో ఉద్రిక్త పరిస్దితులు చోటు చేసుకున్నాయి. దీంతో వైసీపీ వర్సెస్ టీడీపీ కార్యకర్తలు రాళ్ల దాడులు చేసుకున్నారు.

స్ధానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో టీడీపీ నేత జీవీ ఆంజనేయులుపై అక్రమ కేసులు ఎత్తేయాలని కోరుతూ ఆ పార్టీ కార్యకర్తలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. భారీ ఎత్తున స్ధానిక కార్యకర్తలు ఇందులో పాల్గొన్నారు. వీరు ర్యాలీగా వెళ్తున్న సమయంలో ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అటువైపుగా వచ్చారు. దీంతో వీరిద్దరూ ఎదురుపడ్డారు. టీడీపీ కార్యకర్తలు, నేతల్ని చూసిన బ్రహ్మనాయుడు కారు దిగి తనపై ఆరోపణలు నిరూపించాలని కోరారు. మట్టి తవ్వకాలపై చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.

వైసీపీ ఎమ్మెల్యే సవాల్ పై టీడీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. గనుల అక్రమ తవ్వకాలు చేపడున్నారంటూ నినాదాలు చేశారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోవాలని వారిని సూచించారు. కానీ వారు వెనక్కి తగ్గలేదు. ఈ సమయంలో వైసీపీ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకుని పోటాపోటీగా నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్దితులు తలెత్తాయి. పరిస్ధితిని చక్కదిద్దేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. అలాగే లాఠీఛార్జ్ కూడా చేశారు.

ఈ ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే టీడీపీ నేత జీవీ ఆంజనేయులు బస్టాండ్ సెంటర్ కు చేరుకున్నారు. తమ కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేయడంపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. పోలీసులు ఎమ్మెల్యేను వదిలిపెట్టి తమ కార్యకర్తలపై దౌర్జన్యం చేస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే అక్రమాలపై తమ పోరు కొనసాగుతుందని స్పష్టం చేశారు. అనంతరం కార్యకర్తలు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
అయితే స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడి కాన్వాయ్‌పై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని వైఎస్సార్‌సీపీ ఆరోపిస్తోంది. తాను జగనన్న సురక్ష కార్యక్రమానికి వెళ్తుంటే దాడికి దిగినట్లు ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు ఆరోపించారు.

కొద్దిరోజులుగా మట్టి తవ్వకాల విషయంలో ఎమ్మెల్యే బ్రహ్మనాయుడిపై టీడీపీ ఆరోపణలు చేస్తున్నది. ఎమ్మెల్యే అక్రమంగా మట్టిన తన సొంత డెయిరీ కోసం ఉపయోగించుకుంటున్నారని. ఆరోపిస్తూ ప్రతిపక్ష పార్టీ నేతలు ఆ ప్రాంతాన్ని పరిశీలించేందుకు వెళ్లారు. ఆ తర్వాత ఎమ్మెల్యే ఫిర్యాదుతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులతో పాటు టీడీపీ నేతలపై కేసులు నమోదు చేశారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles