వితంతువులు, వృద్ధులకు రూ. 4వేల పెన్షన్‌.. రాహుల్ తొలి ఎన్నికల హామీ

Saturday, May 11, 2024

మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరుగనున్న తెలంగాణాలో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ ఆదివారం ఖమ్మంలో జరిగిన భారీ బహిరంగ సభ  `తెలంగాణ జనగర్జన సభ’ తొలి ఎన్నికల హామీని ప్రకటించారు.  తెలంగాణాలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక వితంతువులు, వృద్ధులకు రూ. 4వేల పెన్షన్‌ అందిస్తామని వెల్లడించారు. 

అధికారంలోకి వస్తే వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బీడీ వర్కర్లు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, ఎయిడ్స్ బాధితులు, పైలేరియా/ డయాలసిస్ పేషంట్లకు చేయూత పథకం కింద నెలకు రూ. 4000 పింఛన్ అందించనున్నట్లు ప్రకటించారు. ‘కాంగ్రెస్ గ్యారెంటీ’ అని పేర్కొంటూ ఈ పథకాన్ని ప్రకటించారు.

ఖమ్మం గడ్డపై జనగర్జన సభకు విచ్చేసిన భారీ జనసందోహాన్ని చూసిన కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఉత్సాహంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఖిల్లా అని అభివర్ణించారు. మీ మనసుల్లో, మీ రక్తంలో కాంగ్రెస్ ఉందని పేర్కొన్నారు. పీపుల్ మార్చ్ చేసిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను అభినందిస్తున్నట్టు తెలిపారు.

కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి పేదలకు భరోసా ఇచ్చారని కొనియాడారు. ఈ సభ ద్వారా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం పలుకుతున్నానని తెలిపారు. పొంగులేటి పులిలా పోరాడుతున్నారని అభినందించారు.

గతంలో, తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య ముక్కోణపు పోటీ అనేవాళ్లమని చెబుతూ  ఇప్పుడా పరిస్థితి లేదని చెప్పారు. బీజేపీ ఎప్పుడో ఖతమ్ అయిపోయిందని చెబుతూ ఏమైందో తెలియదు కానీ, బీజేపీ బండికి నాలుగు టైర్లు పంక్చర్ అయ్యాయని ఎద్దేవా చేశారు.

పోటీ అంతా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే అని స్పష్టం చేశారు. కర్ణాటకలో ఎలాగైతే బీజేపీని ఓడించామో, ఇక్కడ తెలంగాణలో బీజేపీకి బీ టీమ్ గా ఉన్న బీఆర్ఎస్ ను కూడా అలాగే ఓడించబోతున్నాం అని రాహుల్ ధీమా వ్యక్తం చేసారు.

ఒకప్పుడు తెలంగాణ అనేది పేదలకు, రైతులకు, అందరికీ ఓ స్వప్నంలా ఉండేదని పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ సాకారం చేసిన ఆ స్వప్నాన్ని బీఆర్ఎస్ పార్టీ తొమ్మిదేళ్ల పాటు ధ్వంసం చేసిందని రాహుల్ గాంధీ విమర్శించారు. కేసీఆర్ తెలంగాణకు తానో రాజులా భావిస్తుంటారని, తెలంగాణ రాష్ట్రాన్ని ఆయన తన జాగీరు అనుకుంటున్నారని విమర్శించారు.

‘‘లక్ష కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగింది. మిషన్‌ కాకతీయ వేల కోట్ల కుంభకోణం. ధరణి పోర్టల్‌తో ముఖ్యమంత్రి భూములన్నీ దోచుకుంటున్నాడు. లిక్కర్‌ స్కాంతో పాటు ఇతర కుంభకోణాలన్నీ కేంద్ర ఏజెన్సీలకు తెలుసు. కేసీఆర్‌ రిమోట్‌ కంట్రోల్‌ మోదీ చేతుల్లో ఉంది. అందుకే పార్లమెంటులో బీజేపీకి మద్దతు పలుకుతున్నారు. బీఆర్‌ఎస్‌ అంటే.. బీజేపీ రిష్తేదార్‌ (బంధుత్వ) సమితి’’ అంటూ బిఆర్ఎస్, బీజేపీలపై ధ్వజమెత్తారు.

బిఆర్ఎస్ పార్టీ బిజెపి బి-టీం అని స్పష్టం చేస్తూ, ఆ పార్టీ భాగస్వామ్యం గల ఎటువంటి ప్రతిపక్ష వేదికలో కాంగ్రెస్ భాగస్వామి కాబోదని రాహుల్ స్పష్టంగా ప్రకటించారు.ఇటీవల పాట్నాలో జరిగిన ప్రతిపక్షాల సమావేశంలో బీఆర్‌ఎస్‌ను ఆహ్వానించాలని కొన్ని పార్టీలు కోరాయని చెబుతూ అయితే  వారి నిర్ణయాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకించామని తెలిపారు.

వాళ్లను ఆహ్వానిస్తే తాము హాజరుకాబోమని చెప్పామని చెప్పారు.  తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఆయన కుటుంబం అవినీతి అక్రమాలు, కుంభకోణాల సమాచారమంతా కేంద్ర దర్యాప్తు సంస్థల వద్ద ఉందని పేర్కొంటూ లిక్కర్‌ కుంభకోణంతో పాటుఇతర అక్రమాల వివరాలన్నీ కేంద్రం వద్ద ఉన్నాయని, అందుకే కేసీఆర్‌ ప్రధాని ముందు తలొగ్గారని రాహుల్ ఆరోపించారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles