రాజమండ్రి ఎమ్యెల్యే  భర్త, మామల అరెస్టుపై భగ్గుమన్న టీడీపీ శ్రేణులు

Thursday, July 4, 2024

టిడిపిని వదిలి అధికార పార్టీలో చేరమని కొంతకాలంగా వత్తిడులు ఎదుర్కొంటున్న రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని భర్త, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (వాసు), ఆమె మామగారైన మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావులను ఏపీ సీఐడీ అధికారులు ఆదివారం అరెస్ట్ చేయడంతో టిడిపి శ్రేణులు భగ్గుమంటున్నారు. వీరి అరెస్టుల పట్ల టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాజముండ్రిలోని ఆదిరెడ్డి ఇంటికి వెళ్లిన సీఐడీ అధికారులు తండ్రీ కుమారులను అదుపులోకి తీసుకుని వారిని స్థానిక సీఐడీ కార్యాలయానికి తీసుకెళ్లారు. రాజమండ్రిలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ కుటుంబీకులు జగత్‌జనని చిట్‌ఫండ్‌ కంపెనీ నిర్వహిస్తున్నారు. ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై అరెస్ట్ చేసిన్నట్లు చెబుతున్నారు.

అధికార వర్గాల కధనం ప్రకారం జగజ్జనని చిట్‌ఫండ్‌‌పై సీఐడీకి, కాకినాడ అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌కు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో నకిలీ ఖాతాలను సృష్టించి మోసాలకు పాల్పడ్డారని, చిట్స్‌ చెల్లింపుల్లోనూ అక్రమాలకు పాల్పడినట్టు అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ గుర్తించి సీఐడీకి ఆధారాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఖాతాదారుల డబ్బులను దుర్వినియోగం చేసినట్లు, ఫాల్స్‌ డిక్లరేషన్‌ను అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ గుర్తించారు.

మొత్తం 49 సబ్‌స్కైబర్‌ల వివరాలను తనిఖీ చేసి ఆధారాలు ఇచ్చారు. డాక్యుమెంట్ల నిర్వహణలోనూ ఆక్రమాలు జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా చిట్‌ఫండ్స్ నిధులతో ఫైనాన్స్‌ వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించడంతో 1982 చిట్‌‌ఫండ్‌ చట్టాన్ని ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడినట్లు తెలిపారు. దీంతో, జగజ్జనని చిట్‌ఫండ్స్‌ డైరెక్టర్లు ఆదిరెడ్డి అప్పారావు, వాసులను సీఐడీ అరెస్ట్‌ చేసింది.

అయితే, ఆదిరెడ్డి అప్పారావు, వాసుల అరెస్ట్ విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నేతలపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అక్రమ అరెస్టులు చేశారని ఆరోపిస్తూసీఐడీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. అటు అరెస్ట్.. ఇటు ఆందోళనతో రాజమండ్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

రాజమండ్రిలోని పార్టీ కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు. మాజీ మంత్రి జవహర్‌, మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సహా నేతలు అక్కడికి చేరుకుని సీఐడీ చర్యలను తీవ్రంగా ఖండించారు.

కాగా, ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు  ఫోన్ చేసి అరెస్ట్, ఆ తర్వాత జరిగిన పరిణామాలను అడిగి తెలుసుకున్నారు. భవానికి చంద్రబాబు ఫోన్‌లో ధైర్యం చెప్పారు. ఆదిరెడ్డి అప్పారావు, శ్రీనివాస్ అరెస్టును ఖండిస్తూ వైసీపీ ప్రభుత్వ తీరులో మార్పు రావడం లేదని ఆయన మండిపడ్డారు. రాజకీయ వేధింపులు, కక్ష సాధింపులు కొనసాగుతున్నాయని దుయ్యబట్టారు.

ఆదిరెడ్డి అప్పారావు, శ్రీనివాస్ అరెస్టులే అందుకు సాక్ష్యమని మాజీ ముఖ్యమంత్రి విమర్శించారు. సీఐడీ దర్యాప్తు ఏజెన్సీనా? లేక వైసీపీ వేధింపుల ఏజెన్సీనా? అని చంద్రబాబు ప్రశ్నించారు. కోర్టులు చీవాట్లు పెట్టినా ప్రభుత్వ బుద్ధి మారకపోవడం సీఎం జగన్రెడ్డి విషపు రాజకీయ ఆలోచనలకు నిదర్శనమని చంద్రబాబు దుయ్యబట్టారు.

మరోవంక, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరలేదనే అక్కసుతోనే ఆదిరెడ్డి కుటుంబంపై కక్ష సాధింపులకు పాల్పడ్డారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం ట్వీట్‌ చేశారు.

‘‘ఒక కన్నుని పొడిచిన మరో కన్నుని సీబీఐ అరెస్ట్ చేసే వేళ, ఆదిరెడ్డి కుటుంబాన్ని సీఐడీ అదుపులోకి తీసుకోవడం జగన్ స్టైల్ డైవర్షన్ డ్రామా. ఫిర్యాదులు లేని కేసుల్లో బీసీ టీడీపీ నేతలైన మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి వాసులని అదుపులోకి తీసుకోవడం ఏ1 దొంగ పాలనలోనే సాధ్యం. వైసీపీలో చేరలేదనే అక్కసుతో బీసీ నేతలైన ఆదిరెడ్డి కుటుంబంపై కక్ష కట్టడం దారుణం. ఆదిరెడ్డి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది.’’ అని నారా లోకేష్ పేర్కొన్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles