మదర్స్ డే రోజున లోకేష్ కు తల్లి సర్ ప్రైజ్ గిఫ్ట్

Wednesday, September 18, 2024

టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన `యువగళం’ పాదయాత్ర సోమవారం 100వ రోజుకు చేరింది.  అంతకు ముందురోజు సాయంత్రం  అందరూ మథర్స్ డే జరుపుకుంటున్న  సందర్భంగా లోకేష్ మాతృమూర్తి నారా భువనేశ్వరీ కుమారుడికి సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు.

ఎక్కడ ఉన్నా ప్రతిఏటా మదర్స్ డే రోజున తనకు అత్యంత ఇష్టమైన అమ్మను కలిసి ఆమెతో ఆనందాన్ని పంచుకోవడం లోకేష్ కు పరిపాటి. ఈ ఏడాది జనవరి 27న యువనేత లోకేష్ చారిత్రాత్మక పాదయాత్రకు శ్రీకారం చుట్టడంతో ఈసారి మాతృ దినోత్సవం రోజున అమ్మను కలవడం కుదరకపోవడంతో  సోషల్ మీడియా ద్వారా తన తల్లి భువనేశ్వరికి కృతజ్జతలు చెప్పారు. 

అయితే, 99వరోజు పాదయాత్ర ముగించుకొని ఆదివారం సాయంత్రం శ్రీశైలం నియోజకవర్గం బోయరేవుల క్యాంప్ సైట్ కి చేరగానే భువనేశ్వరమ్మ కన్పించింది. తల్లిని చూడగానే లోకేష్ ఆనందానికే అవధుల్లేకుండా పోయాయి. గత కొద్ది నెలలుగా పాదయాత్రలో ఇంటికి దూరంగా ఉంటున్న లోకేష్‌ను చూసేందుకు పాదయాత్ర జరుగుతున్న ప్రాంతానికి ఆమె వచ్చారు.

ఆదివారం సాయంత్రం పాదయాత్ర ముగించుకుని క్యాంప్‌సైట్‌కు వచ్చేసరికి భువనేశ్వరి కనిపించడంతో లోకేష్ ఆనందంతో ఉబ్బితబ్బిబయ్యాడు. సోమవారం 100వరోజు పాదయాత్రలో లోకేష్ తోపాటు ఆయన తల్లి భువనేశ్వరితోపాటు నందమూరి, నారా కుటుంబ సభ్యులు, లోకేష్ చిన్ననాటి స్నేహితులు యాత్రలో పాల్గొంటున్నారు.

యువగళం 100వరోజు పాదయాత్రను పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు యువగళం టీమ్ కోఆర్డినేటర్ కిలారు రాజేష్ నేతృత్వంలో విస్తృత ఏర్పాట్లు చేశారు.

తన భర్త చంద్రబాబు సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏనాడు రాజకీయ వేదికపైకి రాని భువనేశ్వరి తొలిసారి బిడ్డతో కలిసి  అడుగులు వేయనున్నారు. నారా, నందమూరి కుటుంబాలు ప్రత్యేక వాహనంలో  కర్నూలుకు చేరుకోవడంతో యువగళం బృందాల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి.

నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 99వరోజు శ్రీశైలం నియోజకవర్గంలో వెలుగోడు అటవీ ప్రాంతంలో ఉత్సాహంగా సాగింది. పాదయాత్ర దారిలో యువనేతకు వివిధ వర్గాల ప్రజలు సంఘీభావం తెలిపారు. ఆదివారం సాయంత్రం వెలుగోడులో యువనేత పాదయాత్రకు జనం వెల్లువెత్తారు. లోకేష్ ని చూసేందుకు, కలిసి సమస్యలు చెప్పుకునేందుకు భారీగా ప్రజలు రోడ్ల పైకి వచ్చారు.

వెలుగోడు అటవీ ప్రాంతంలో పాదయాత్ర చేస్తున్న సమయంలో నల్లకాల్వలో దివంగత మాజీముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి లోకేష్ నివాళులర్పించారు. అనంతరం సేవ్ ద టైగర్ క్యాంపెయిన్ ప్రతినిధులు ఇమ్రాన్ సిద్ధిఖీ, సీనియర్ జర్నలిస్టు పులిపాక బాలు యువనేతను మర్యాదపూర్వకంగా కలుసుకుని పులుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. అటవీ ప్రాంతంలో పాదయాత్ర సమయంలో తెలుగుగంగ కాల్వను యువనేత సందర్శించారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles