ప్రధాని మోదీ పర్యటనకు సింగరేణి కార్మికుల సెగ!

Monday, September 16, 2024

వివిధ అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శంఖుస్థాప‌న‌లు, ప్రారంబోత్స‌వాలు చేసేందుకు శనివారం హైదరాబాద్ పర్యటనకు వస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సింగరేణి కార్మికుల నిరసనలు స్వాగతం పలికే అవకాశం ఉంది. ఆ రోజున  సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు బిఆర్ఎస్ పిలుపునిచ్చింది.

ఒకే రోజు  ప్రధాని మోదీ పర్యటన, బీఆర్ఎస్ ఆందోళనలతో   రాష్ట్రంలో రాజకీయం వాతావరణ మరోసారి వేడెక్కనుంది.  లాభాల్లో ఉన్న సింగరేణిని ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరమేముందని బిఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.  ఇటీవల మరోసారి సింగరేణిలోని మరోసారి బొగ్గు గనుల వేలానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ఎత్తున ధర్నాలు నిర్వహించాలని నిర్ణయింఛారు. కొంతకాలంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నెడుతున్న లాభదాయకమైన సింగరేణి గనులను ప్రైవేట్ పరం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని  బిఆర్ఎస్, బీజేపీ నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. ప్రైవేట్ పరం చేసే ప్రసక్తి లేదంటూనే కేంద్రం అందుకు ప్రయత్నం చేస్తున్నట్లు బిఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.

ఈ విషయమై సింగరేణి కార్మికులు సహితం ఆందోళన చెందుతున్నారు. పలు నిరసన కార్యక్రమాలు చేబడుతున్నారు.  సింగ‌రేణి ప్ర‌యివేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా ఈ నెల 8వ తేదీన సింగ‌రేణి ప్రాంతాల్లో బీఆర్ఎస్ మ‌హా ధ‌ర్నాలు చేప‌ట్ట‌నుంది. ఈ మేర‌కు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.

మంచిర్యాల‌, భూపాల‌ప‌ల్లి, కొత్త‌గూడెం, రామ‌గుండం ఏరియాల్లో మ‌హా ధ‌ర్నాలు చేప‌ట్టాల‌ని పిలుపునిచ్చారు. సింగ‌రేణిని ప్ర‌యివేటీక‌రించ‌బోమ‌ని రామగుండంలో ప్ర‌ధాని మోదీ  మాట ఇచ్చి త‌ప్పార‌ని కేటీఆర్ గుర్తు చేశారు. సింగరేణి ప్రాంతంలోని జిల్లాల పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలతో మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా మాట్లాడారు.

సింగరేణి ప్రైవేటీకరణ ప్రయత్నాలను మానుకోవాలని కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం చాలా సార్లు విజ్ఞప్తి చేస్తున్నా వేలం ప్రక్రియను మరోసారి తెరపైకి తీసుకువచ్చిందని కేటీఆర్  మండిపడ్డారు.  వేలం లేకుండా సింగ‌రేణికి బొగ్గు గ‌నులు కేటాయించాల‌ని కేటీఆర్ డిమాండ్ చేశారు.

రైతుల‌కు ఉచిత విద్యుత్ ఇస్తున్న సీఎం కేసీఆర్ సంక‌ల్పాన్ని దెబ్బ‌తీసేందుకే కేంద్రం కుట్ర చేస్తుంద‌ని మండిప‌డ్డారు. తెలంగాణ‌కు సింగ‌రేణి ఓ ఆర్థిక‌, సామాజిక జీవ‌నాడి లాంటింద‌ని పేర్కొన్నారు.  సింగ‌రేణి ప్ర‌యివేటీక‌ర‌ణ‌పై కేంద్రం వెన‌క్కి త‌గ్గ‌కుంటే జంగ్ సైర‌న్ మోగిస్తాం.. మ‌రో ప్ర‌జా ఉద్య‌మం నిర్మిస్తామ‌ని కేటీఆర్ కేంద్రాన్ని హెచ్చ‌రించారు.

ఇప్పటికే పదో తరగతి పేపర్ లీక్ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని పోలీసులు అరెస్ట్ చేసి.. రిమాండ్‌కు తరలించారు. ఈ క్రమంలో.. ఈ విషయంపై మోదీ పర్యటనలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోనున్నాయనేది ఆసక్తికరంగా మారింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles