పోలీసులు సీబీఐని బెదిరించారా? గవర్నర్ విస్మయం!

Thursday, April 25, 2024

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ వైఎస్‌ అవినాశ్‌ రెడ్డిని కర్నూల్ వరకు వెళ్లి స్థానిక పోలీసులకు `భయపడి’ అరెస్ట్ చేయలేకపోవడం ఒక వంక రాష్ట్ర గవర్నర్ నజీర్ అహ్మద్ కు, మరోవంక సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు సహితం విస్మయం కలిగించింది.  ఇదంతా ప్రధాని మోదీ – సీఎం వైఎస్ జగన్ ల కుమ్మక్కు రాజకీయాల కారణంగా కర్నూల్ పోలీస్ – సీబీఐ దొంగాట ఆడుతున్నారని సాధారణ ప్రజలకు సహితం తెలిసిపోయింది.

ఎక్కడైనా సీబీఐ వస్తే స్థానిక పోలీసులు భయపడతారు. కానీ జగన్ పాలనలో స్థానిక పోలీసులే సీబీఐ వాళ్లను బెదిరిస్తున్నారు. లోకల్ పోలీసులే దర్యాప్తు అధికారిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు.

‘‘సీబీఐని చూస్తే రాజకీయ నేతలు, ఆర్థిక నేరాల్లో ఉన్నవారు భయపడతారు. అధికారంతో సంబంధం లేకుండా నేరాభియోగం ఎదుర్కొనే అనేకమందిని సీబీఐ అరెస్టు చేసింది. ఏపీలో మాత్రం ఆకురౌడీలు, కిరాయి రౌడీలకు సీబీఐ భయపడుతోంది. ఈ పరిణామం రాజ్యాంగ వ్యవస్థలపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని, గౌరవాన్ని చెరిపేస్తోంది. ఈ నమ్మకాన్ని, గౌరవాన్ని పెంచాల్సిన బాధ్యత మీపైనే ఉంది’’ అని టీడీపీ నేతలు రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌కు విజ్ఞప్తి చేశారు.

వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు సిబిఐ బృందం కర్నూల్ వస్తే వారు స్థానిక పోలీసులకు బెదిరిపోయి తోకముడిచింది వైనాన్ని గవర్నర్ ను కలిసిన టీడీపీ బృందం మంగళవారం సాయంత్రం వివరించింది. వారి మాటలు విని గవర్నర్ సహితం ఆశ్చర్య పోయారని టిడిపి నేత వార్ల రామయ్య తెలిపారు.

“రాష్ట్రంలో టీచర్లు రోడ్డెక్కి ధర్నా చేస్తుంటే వాళ్లను నియంత్రించారు. టీడీపీ నేతలు రోడ్డు మీదికి వస్తే కంట్రోల్ చేశారు. కమ్యూనిస్టులు, ఇతర విపక్ష నేతలు రోడ్ల మీదికి రాకుండా గృహ నిర్బంధాలు చేశారు కదా. అవినాశ్ రెడ్డి కాన్వాయ్ వందలాంది వాహనాలతో ఊరేగింపుగా వస్తుంటే ఏం చేస్తున్నారు?” అని ప్రశ్నిస్తూ  ఏపీలో సీబీఐ పరిస్థితి ఎంతో దయనీయంగా ఉందని రామయ్య వాపోయారు.

“పశ్చిమ బెంగాల్ లో మంత్రులను అరెస్ట్ చేసినప్పుడు సీబీఐ బాగానే పనిచేసిందే! ఢిల్లీలో డిప్యూటీ సీఎంగా ఉన్న సిసోడియాను అరెస్ట్ చేసేటప్పుడు ఒక కార్లో వెళ్లి లాక్కుని వచ్చారే! గతంలో టెలికాం మంత్రిగా ఉన్న రాజాను నలుగురెళ్లి లాక్కొచ్చారే… నిన్నగాక మొన్న కర్ణాటకలో ఓ మంత్రిని లాక్కొచ్చారే… మరి ఏపీలో ఎందుకు ఎంపీ అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు?” అని వర్ల రామయ్య ప్రశ్నించారు.

“జగన్ సొంత నియోజకవర్గం పులివెందులకు చెందిన రౌడీలు కర్నూలులో విచ్చలవిడిగా తిరిగారు…. మీడియావాళ్లను కూడా కొట్టారు… కెమెరాలు ధ్వంసం చేసి చానళ్ల ప్రతినిధులను భయభ్రాంతులకు గురిచేశారు. సీబీఐ అధికారులు అరెస్ట్ చేసేందుకు వస్తే వారికి కనీస భద్రత ఇవ్వలేకపోయారు” అంటూ టిడిపి నేత బొండా ఉమ నిప్పులు చెరిగారు.

మరోవంక, అవినాశ్‌ రెడ్డిని అరెస్టు చేయకుండా సీబీఐ ఎందుకు వాయిదా వేస్తూ పోతోందని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నరసింహ ప్రశ్నించారు. తాము ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత కూడా తెలంగాణ హైకోర్టు విచారణ పూర్తి చేసి ఆదేశాలు ఇవ్వకపోవడం; సీబీఐ నోటీసులు జారీ చేసినా అవినాశ్‌ రెడ్డి విచారణకు హాజరు కాకపోవడంపై తాము సంతృప్తికరంగా లేమని స్పష్టం చేశారు. అవినాశ్‌ రెడ్డిని అరెస్టు చేయవద్దని తాము చెప్పలేమని తేల్చి చెప్పారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles