పవన్ మౌనంతో కాపుల ఆగ్రవేశాలకు గురవుతున్న ముద్రగడ!

Saturday, October 5, 2024

అంచనాలకు మించి జనం చేరుతుండడంతో ఉత్సాహంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తూర్పు గోదావరి జిల్లాలో `వారాహి విజయ యాత్ర’ చేస్తుంటే, సహజంగానే అధికారంలో ఉన్న బిఆర్ఎస్ నాయకులు ఆందోళనతో ఆయనపై అవాకులు, చెవాకులు వెళుతున్నారు. అయితే, తనకేమి సంబంధం లేకపోయినా మధ్యలో కాపు నేత ముద్రగడ పద్మనాభం ప్రవేశించి, బహిరంగలేఖ పేరుతో పవన్ కళ్యాణ్ ను రౌడీ మాదిరిగా మాట్లాడుతున్నావంటూ నిందించడం కలకలం సృష్టించింది.

వన్ కు దమ్ముంటే కాకినాడలో పోటీ చేయాలని సవాల్ చేస్తూ కాకినాడ ఎమ్యెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వెనకేసుకు రావడంతో కాపు సామాజికవర్గం ప్రముఖులు నివ్వెరపోయారు. అయినా ముద్రగడ వాఖ్యలపై పవన్ కళ్యాణ్ మౌనం వహించడం, ఎటువంటి సమాధానం చెప్పకపోవడం ద్వారా ముద్రగడ పెద్దరికం పట్ల గౌరవం ప్రదర్శించినట్లయింది.

పవన్‌ను కాకినాడలో అడుగుపెట్టనీయనని అహంకారపూరితంగా మాట్లాడుతున్న ద్వారంపూడిని వెనుకవేసుకు వస్తూ, అతనెంతో ఉత్తముడని సర్టిఫికెట్ ఇస్తూ,  `నన్ను ముఖ్యమంత్రిగా చేయండి’ అంటూ జనం మధ్యకు వస్తున్న తోటి కాపు నేత పవన్ కళ్యాణ్ పట్ల అవమానకరంగా వ్యవహరించడం ద్వారా తన అవకాశవాదాన్ని ముద్రగడ బైటపడవేసుకున్నట్లైయిందని  ఆయన అభిమానులు సహితం వాపోతున్నారు.

జనసేన నేతలు సహితం మొత్తం మీద ముద్రగడ వాఖ్యల పట్ల మౌనంగా ఉంటుండగా, సాధారణ కాపు నేతలు మాత్రం ఆగ్రవేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంలోకి ముద్రగడ పద్మ నాభం ఎందుకు వచ్చారో అర్థం కావడం లేదని, కాపు ఉద్యమనేత ముద్రగడ పవన్ కల్యాణ్‌ను ఎందుకు టార్గెట్ చేశారో అర్థం కావడం లేదని  వాపోతున్నారు.

పవన్ డ్రగ్స్ తీసుకుంటారు, మూడు పెళ్లి్ళ్లు చేసుకున్నారని వ్యక్తిగత విమర్శలు చేసినప్పుడు నోరెత్తని ముద్రగడ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను రౌడీ అంటూ పేర్కొనడం కాపులకు తానే పెద్ద దిక్కు అన్నట్లు వ్యవహరిస్తున్న ముద్రగడకు తగునా? అని ప్రశ్నిస్తున్నారు. కాపుల ముసుగులో సీఎం జగన్‌, ద్వారంపూడికి అనుకూలంగా ముద్రగడ పనిచేస్తున్నారని తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు.

దమ్ముంటే వైసీపీలో చేరి పని‌చేసుకోవాలని, కాపు నేత ముసుగులో డ్రామాలు ఆడితే యువత తరిమికొడతారని కొందరు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాపు రిజర్వేషన్ కోసం ముద్రగడ ఒక్కసారి కూడా ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

 పవన్ కల్యాణ్‌పై ముద్రగడ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని ఆయనకి క్షమాపణలు చెప్పాలని డిమాండ్లు వినవస్తున్నాయి. మొత్తం మీద కాపు సామజిక వర్గంలో ఇప్పటివరకు ముద్రగడ ఇటువంటి ఆగ్రవేశాలను ఎదుర్కొననే లేదు. 2019 వరకు టిడిపి హయాంలో కాపు రిజర్వేషన్ గురించి హడావుడి చేసిన ముద్రగడ, ఆ తర్వాత జగన్ హయాంలో ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్న ఇప్పుడు ప్రధానంగా తెరపైకి వస్తున్నది.

ముద్రగడ పద్మనాభం వైసీపీకి అమ్ముడుపోయారని కాపు సంక్షేమ సేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కాపు జాతిని తాకట్టు పెట్టవద్దంటూ హెచ్చరించారు. పవన్ ను ఉద్దేశించి ముద్రగడ పద్మనాభం రాసిన లేఖ కాపులంతా తల‌దించుకునేలా ఉందనే ఆరోపణలు చెలరేగుతున్నాయి. ఇంట్లో కూర్చున్న ముద్రగడ ఇప్పుడు లేఖ రాయడం వెనుక ఉద్దేశం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

 పవన్ కల్యాణ్‌ను, అతని కుటుంబ సభ్యులను బూతులు తిడితే మీరెక్కడ ఉన్నారని నిలదీస్తున్నారు. కాకినాడ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి కాపు మహిళలను కొడితే ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. ముద్రగడ లేఖ వెనుక ఆయన రాజకీయ స్వార్థం ఉందనే ఆరోపణలు సహితం వినవస్తున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles