నరసరావుపేటలో మరోసారి రాజకీయ ఘర్షణలు

Thursday, September 19, 2024

పల్నాడు జిల్లా నరసరావుపేట అంటేనే గతంలో ఘర్షణలకు మారుపేరుగా ఉండెడిది. ముఖ్యంగా అక్కడ డా. కోడెల శివప్రసాద్ మొదటిసారి 1983లో ఎమ్యెల్యేగా ఎన్నికైన్నప్పటి నుండి ఆయన ప్రదర్శించిన దూకుడు కారణంగా గ్రామాలలో ఘర్షణలు నీతకృత్యమైపోయాయి. 

ఒక సారి మంత్రిగా ఉన్న సమయంలో కోడెల ఇంట్లోనే బాంబులు ప్రేలి మరణాలు సంభవించినా అప్పుడు ఇక్కడ టిడిపి ప్రభుత్వం, కేంద్రంలో ఆ పార్టీ మద్దతు ఇస్తున్న వాజపేయి ప్రభుత్వం ఉండడంతో ఎటువంటి చర్యలు తీసుకోలేదు. రాజకీయ ప్రత్యర్థులపై దౌర్జన్యాలు నిత్యకృత్యంగా సాగాయి. బెదిరించి వివిధ వర్గాల నుండి డబ్బు కూడా వసూలు చేసేవారని ఆరోపణలు కూడా వచ్చాయి.

అయితే, అప్పట్లో కాంగ్రెస్ కు నేతృత్వం వహించిన కాసు వెంకట కృష్ణారెడ్డి దౌర్జన్యాలకు దూరంగా ఉంటూ ఉండడంతో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడినా టిడిపి వర్గాలపై చెప్పుకోదగిన దాడులు జరగలేదు. దౌర్జన్య రాజకీయాలతో విసుగు చెందిన ప్రజలు వరుసగా రెండు ఎన్నికలలో కోడెలను ఓడించడంతో, అక్కడైతే టిడిపి గెలుపొందే అవకాశం లేదని బలవంతంగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆయన నియోజకవర్గాన్ని 2014లో  సత్తెనపల్లికి మార్చారు.

ఏదేమైనా కోడెల సృష్టించిన భయోత్పాత రాజకీయాల కారణంగా 2004 నుండి ఇప్పటి వరకు నరసరావుపేటలో టిడిపి గెలుపొందలేదు. ఆయన తర్వాత వచ్చిన టీడీపీ నాయకులు సౌమ్యులు అయినప్పటికీ ప్రజలలో అప్పటి కాళరాత్రులు చెరిగిపోయిన్నట్లు లేదు. అయితే, వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసిపి శ్రేణులు కోడెలను మరచిపోయే విధంగా దౌర్జన్యాలకు దిగుతున్నాయి.

తాజాగా, ఆదివారం సాయంత్రం టీడీపీ నేత చల్లా సుబ్బారావు ఇంటిపై వైసీపీ మద్దతుదారులు దాడి చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. శనివారం టీడీపీ నేత చల్లా సుబ్బారావు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై అవినీతి ఆరోపణలు చేయడంతో ఎమ్మెల్యే గోపిరెడ్డి మద్దతుదారులు చల్లా సుబ్బారావు ఇంటిపై దాడికి దిగినట్టు తెలుస్తోంది.

ఈ దాడిలో చల్లా సుబ్బారావు ఇంటి కిటికీలు, ఫర్నిచర్‌ ధ్వంసం అయ్యాయి. కోటప్పకొండ రోడ్డులో ఉన్న ఈ ఇంటిని టీడీపీ నేత చల్లా సుబ్బారావు ఆక్రమించారని వైసీపీ నేతలు ఆరోపించాయి.  టీడీపీ నేత ఇంటిపై దాడి విషయం తెలుసుకుని ఆ పార్టీ శ్రేణులు అక్కడిక భారీగా చేరుకున్నారు. దీంతో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య రాళ్లు, కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. 

ఇరు వర్గాల ఘర్షణలో పోలీస్ జీపు, టీడీపీ నేతలు కడియాల రమేశ్‌, అరవిందబాబు కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనలో అరవిందబాబు కారు డ్రైవర్‌ తలకు గాయాలయ్యాయి. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు రంగంలోకి ఇరు వర్గాలను చెదరగొట్టే ఎందుకు ప్రయత్నించారు.

వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఘటనాస్థలికి రావడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఇరు వర్గాలపైనా లాఠీచార్జి చేశారు. నరసరావుపేటలో ఇంకా ఉద్రిక్తత కొనసాగుతోంది. కోటప్పకొండ మార్గంలో భారీగా పోలీసులను మోహరించారు. 
టీడీపీ నేత ఇంటిపై దాడిని పల్నాడు జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయలు, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీతో జీవీ ఆంజనేయులు ఫోన్‌లో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అవినీతిపై ప్రశ్నిస్ దాడులు చేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఎమ్మెల్యే గోపిరెడ్డి దగ్గరుండి టీడీపీ నేత చల్లా సుబ్బారావు ఇంటిని వైసీపీ శ్రేణులతో ధ్వంసం చేయించారని ఆరోపించారు. పోలీసులు ఈ దాడిని అడ్డుకోకుండా, ఎమ్మెల్యేకు మద్దతుగా నిలిచారని విమర్శించారు. టీడీపీ నేతలపై దాడికి పాల్పడిన వైసీపీ నేతలతో పాటు ఎమ్మెల్యేను అరెస్టు చేయాలని ఆంజనేయులు డిమాండ్ చేశారు. ఈ పరిస్థితిని అదుపుచేయకపోతే టీడీపీ నేతలంతా నరసరావుపేట వచ్చి నిరసన తెలుపుతామని ఆయన హెచ్చరించారు.

కాగా, రాష్ట్రంలో రౌడీయిజాన్ని సీఎం జగన్‌ చట్టబద్ధం చేశారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. అధికారం ఉందని బరితెగించిన వారికి ఎన్నికల తర్వాత బడిత పూజ ఖాయమని హెచ్చరించారు. నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అక్రమాలను బహిర్గతం చేశారనే అక్కసుతోనే చదలవాడ అరవిందబాబు, టీడీపీ కార్యకర్తలపై వైసీపీ గూండాలు దాడులకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles