తెలంగాణ బీజేపీలో `లంబాడి’ చిచ్చు రేపిన ఎంపీ బాబురావు

Sunday, July 7, 2024

తెలంగాణ బీజేపీలో  ఇటీవల చోటుచేసుకున్న మార్పులలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టడం, ఆయన స్థానంలో కేంద్ర మంత్రి పదవి పొందుతారనుకున్న మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవితో సరిపెట్టుకోవాల్సి రావడంతో ఇక మంత్రి పదవి వారించగలదని భావిస్తున్న పార్టీ ఎంపీ సాయం బాబురావు ఇపుడు వివాదాలలో చిక్కుకున్నారు. ఆయనను పార్టీ నుండి బహిష్కరించాలని సొంత పార్టీ వారే డిమాండ్ చేస్తున్నారు.

షెడ్యూల్డ్ తెగలకు చెందిన ఎంపీగా ఆయన వర్గాలతో మంచి పలుకుబడి గల బాబురావు లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని గత వారం చేసిన వాఖ్యలు అగ్గి రాజేస్తున్నాయి. పైగా అందుకోసమై తనకు ఉద్యమం చేపట్టనున్నట్లు కూడా ప్రకటించారు. దానితో, షెడ్యూల్డ్ తెగలలో ఎక్కువగా మైదాన ప్రాంతాలలో నివసించే లంబాడీలు ఆర్థికంగా, సామాజికంగా ముందంజలో ఉండడంతో తమ సౌలభ్యాలకే ముప్పు ఏర్పడుతుందని ఆగ్రవేశాలు వ్యక్తం చేస్తున్నారు. సోయం బాపురావుకు వ్యతిరేకంగా లంబాడీలు నిరసనలు చేబడుతూ సోయం బాపురావును బీజేపీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని బీజేపీ ఎంపీ సోయం బాపురావు గత వారం పార్లమెంట్ లో హోంమంత్రి అమిత్ షాను కలిసి కోరారు. ఈ విషయంపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేశామని బాపురావు తెలిపారు. ఈ కేసులో కోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చిందని అమిత్ షాకు తెలియజేశారు. ఆ కేసులో కేంద్రం తరపున రివ్యూ పిటిషన్ వేయాలని అమిత్ షాను కోరినట్టు బాపురావు తెలిపారు. 

వచ్చే నెల 11 లోపు సుప్రీంకోర్టుకు వివరణ ఇవ్వాల్సి ఉందని చెబుతూ ఈ లోపు ఏదైనా నిర్ణయం తీసుకోవాలని అమిత్ షాను కోరారు. అనంతరం కేంద్ర న్యాయశాఖ, గిరిజనశాఖ మంత్రులను కూడా కలిసి తమకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని కోరినట్లు ఎంపీ బాపురావు ప్రకటించారు. 

లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఎంపీ బాపురావు ప్రకటించడంతో లంబాడీ వర్గాలు అప్రమత్తమై ఈ విషయమై బిజెపిపై వత్తిడి పెంచే ప్రయత్నాలు చేస్తున్నాయి. వరద బాధిత ప్రాంతాలలో పర్యటనకై సోమవారం వరంగల్ వెళ్లిన కిషన్ రెడ్డికి సహితం వారి నిరసనల వేడి తాకింది. జనగామ వద్ద ఆయనను కలిసిన లంబాడీ నాయకులు సోయం బాపురావుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

దానితో బాబురావు వాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతమైనవని, వాటితో బీజేపీకి సంబంధం లేదని అంటూ కిషన్ రెడ్డి వివరణ ఇవ్వాల్సి వచ్చింది. లంబాడిలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే ఆలోచన లేదని భరోసా ఇస్తూ, సమస్యని కేసీఆర్ పై నెట్టివేసి ప్రయత్నం చేశారు. తెలంగాణలో ఎస్టీలకు రిజర్వేషన్లు రాకుండా కేసీఆర్ అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.  జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యాంగంలో ఉన్నా కేసీఆర్ చేయడం లేదంటూ మండిపడ్డారు. తెలంగాణాలో బీజేపీ అధికారంలో వస్తే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను పెంచుతామని హామీ ఇచ్చారు.మరోవంక,   బీజేపీ నుంచి సోయం బాపురావు సస్పెండ్ చేయాలని సొంత పార్టీ నేతలే డిమాండ్ చేస్తు్న్నారు.

సోయం బాపురావు వ్యాఖ్యలపై బీజేపీ నేత, మాజీ ఎంపీ  రవీంద్ర నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లంబాడీ విద్యార్థులు, గిరిజనులు సోయం బాపురావును బీజేపీ నుంచి సస్పెండ్ చేయాలని ధర్నాలు చేస్తున్నారు. బీజేపీ ఎంపీ సోయం బాపురావుపై కిషన్ రెడ్డి కూడా సీరియస్ గా ఉన్నారని తెలుస్తోంది.  సోయం బాపురావు అలా ఎందుకు మాట్లాడారో వివరణ తీసుకుంటామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించంపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. రాజ్యాంగంలో కేటాయించిన రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని ప్రకటించారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles