టిపిసిసి షోకాజ్ నోటీసుపై మహేశ్వరరెడ్డి చిందులు

Thursday, September 19, 2024

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ టిపిసిసి షోకాజ్ నోటీసు జారీచేయడంతో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి చిందులు వేస్తున్నారు.  ఆయనకు బుధవారం మధ్యాహ్నం షోకాజ్ నోటీసులు జారీ చేసి, గంటలోపు షోకాజ్ నోటీసులకు సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. సమాధానం ఇవ్వకపోతే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

సమాధానం ఇవ్వలసింది పోయి తనకు షోకాజ్ ఎందుకు ఇచ్చారో గురువారం లోపుగా వివరణ ఇవ్వాలని ఆయన టీపీసీసీని డిమాండ్ చేశారు. పైగా, తనకు షోకాజ్ నోటీసు ఇవ్వడంపై ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని కలిసి తేల్చుకుంటానని స్పష్టం చేశారు.  క్రెడిబులిటీ లేని వాళ్లు తనకు నోటీసులు ఇచ్చారని పిసిసి నాయకత్వంపై మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు.

బ్లాక్ మెయిల్ చేసి పార్టీ మారిన వ్యక్తిత్వం తనది కాదని పరోక్షంగా రేవంత్‌పై ఆయన విమర్శించారు. తన విషయలో పిసిసి ఏ నిర్ణయం తీసుకున్నా ఇబ్బంది లేదన్నారు. తనకు కారణం లేకుండా నోటీస్ ఇస్తారా? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేయలేదని స్పష్టం చేశారు. అంతేకాదు రేవంత్ రెడ్డిపై బహిరంగంగా కూడా ఆరోపణలు చేయలేదని గుర్తు చేశారు.

కొత్తగా పార్టీలోకి వచ్చిన వ్యక్తులకు రూల్స్ తెలియవని రేవంత్ ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. అదీగాక, ఎఐసిసి కార్యక్రమాల కమిటీ అమలు చైర్మెన్‌గా ఉన్న తనకు పిసిసి ఎలా షోకాజ్ నోటీసులు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. పార్టీ మారుతానని తాను ఎక్కడా చెప్పలేదని అంటూ  తాను వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. 

తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ నేతగా ఉన్న మహేశ్వర్ రెడ్డికి షోకాజ్ నోటీసులు ఇవ్వడం కలకలం రేపుతోంది. అయితే మంగళవారం నిర్మల్ నియోజకవర్గంలో తన అనుచరులతో మహేశ్వర్ రెడ్డి సీక్రెట్ మీటింగ్ నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. సమావేశంలోకి ఫోన్లను తెచ్చుకునేందుకు అనుమతి నిరాకరించారు.

దీంతో ఈ సమావేశం నియోజకవర్గ కాంగ్రెస్‌లో దుమారం రేపింది. పార్టీ మార్పుపై చర్చించేందుకు అనుచరులతో మహేశ్వర్ రెడ్డి రహస్య భేటీ నిర్వహించారనే ప్రచారం జరుగుతోంది. బీజేపీలో చేరే విషయంపై ఆయన అనుచరులతో చర్చించారనే వార్తలు మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ టీపీసీసీ నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుందని చెప్పవచ్చు. గత కొంతకాలంగా టీ కాంగ్రెస్‌లో మహేశ్వర్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. రేవంత్ రెడ్డి నిర్ణయాలను బహిరంగంగా వ్యతిరేకిస్తున్న ఆయన పార్టీ కార్యక్రమాల్లో కూడా అంత యాక్టివ్‌గా ఎక్కడా పాల్గొనడం లేదు.

గతంలో రేవంత్‌కు పోటీగా ఆయన పాదయాత్ర చేపట్టడం గుబులు రేపింది. కానీ అధిష్టానం పాదయాత్ర ఆపేయాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడంతో మధ్యలోనే పాదయాత్రకు బ్రేక్ పడింది. ఈ నిర్ణయం మహేశ్వర్ రెడ్డిలో అసంతృప్తిని మరింతగా రగిలిపోతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles