జగన్ మాటల డొల్లతనం.. బయటపడిందిలా!

Saturday, May 18, 2024

అది తనమీద ఉన్న అక్రమార్జనలకు సంబంధించిన సీబీఐ కేసుల ఒత్తిడి కావొచ్చు.. లేదా తన తమ్ముడు అవినాష్ రెడ్డి- తన బాబాయి వివేకానందరెడ్డి హత్య కేసులో రోజురోజుకూ ఇరుక్కుపోతున్న వైనం గురించి కావొచ్చు.. ప్రధానిక నరేంద్రమోడీకి మొరపెట్టుకుని ఉపశమనం పొందడానికి.. జగన్మోహన్ రెడ్డి పదేపదే ఢిల్లీ తిరుగుతూ ఉంటారు. మోడీతో ఏకాంతంగా భేటీ అయి ‘ఏమేమో’ చర్చిస్తుంటారు. తీరా సమావేశం ముగిసిన తర్వాత మీడియా మీట్ లో మాత్రం.. గత నాలుగేళ్లుగా మాట మార్చకుండా, మడమ తిప్పకుండా జగన్మోహన్ రెడ్డి ఒకే మాట చెబుతున్నారు. పోలవరం నిధుల విడుదల గురించి, రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి ప్రధానితో చాలా కూలంకషంగా మాట్లాడేసినట్టు జగన్ చెబుతుంటారు.
అయితే ప్రతి సందర్భంలోనూ.. రాష్ట్రప్రభుత్వానికి ఏదో ఒక ఇరకాటం ఏర్పడినప్పుడే.. జగన్ ఢిల్లీ వెళుతుంటారనే అపప్రధలు కూడా ఉన్నాయి. అదే తీరులో ఈ దఫా కూడా.. అవినాష్ రెడ్డి పై వివేకా హత్య కేసు విచారణ ఒక కొలిక్కి వస్తున్నదని అంతా అనుకుంటున్న తరుణంలో.. జగన్ మళ్లీ ఢిల్లీ వెళ్లారు. ఈసారి ఆయన మీడియాకు బ్రీఫ్ చేయడానికి కూడా టైం లేదు. కానీ.. వార్తలు మాత్రం వచ్చాయి. పోలవరం నిధులు, రాష్ట్రానికి ప్రత్యేకహోదా గురించి జగన్ ప్రధానిని అడిగినట్లు వార్తలు వచ్చాయి.
జగన్ ఇలా హోదా అడిగి తిరిగి అమరావతి చేరుకున్నారో లేదో.. రోజుల వ్యవధిలోనే.. కేంద్రం చాలా విస్పష్టమైన ప్రకటన చేసింది. పార్లమెంటు సాక్షిగా కేంద్రమంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వక సమాధానం ఇస్తూ ఏపీ రాష్ట్రానికి ప్రత్యేకహోదా అనేది ముగిసిన అధ్యాయం అని తేల్చి చెప్పారు.
మరి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక విమానాల్లో ఇన్నిదఫాలుగా.. తన బృందాన్ని, వందిమాగధుల్ని అందరినీ వెంటబెట్టుకుని ఢిల్లీ వెళ్లి ఏం సాధిస్తున్నట్టు.
అక్కడికేదో తాము హోదా కోసం పోరాడేస్తున్నాం అని బిల్డప్ ఇవ్వడానికి వైసీపీ ఎంపీలు పార్లమెంటులో అడుగుతున్నారు. ప్రతిసారీ కేంద్రం ‘ముగిసిన అధ్యాయం’ అనే ఒకేమాట చెబుతోంది. ఇప్పుడిక వైసీపీ ఏం చేస్తోంది. తమ ఎంపీలు అడిగితేనే సమాధానం రాకపోతుండగా.. కేంద్రం మెడలు వంచి ప్రత్యేకహోదా సాధిస్తామని మళ్లీ మళ్లీ ఎలా చెప్పగలరు. పరువు పోతుంది కద. జగన్ మాటల్లోని డొల్లతనం ఈ రకంగా బయటపడుతున్నదని పలువురు విశ్లేషిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles