చిరు ఫ్యాన్స్ కు ఆత్మాభిమానం లేదా?

Saturday, May 4, 2024

చిరంజీవి ఫ్యాన్స్‌కు ఆత్మాభిమానం ఉండదా? తమ హీరోని ఎవ్వరు ఏమన్నా సరే వారు అలా తుడుచుకొని వెళ్ళిపోతుంటారా? అంతకుమించి మరేరకంగానూ స్పందించడం వారికి చేతకాదా? తమ అభిమాన కథానాయకుడిని అత్యంత నీచంగా, హేయంగా తిట్టిన వ్యక్తిని నెత్తిన పెట్టుకోవడం అంటే ఆ పరిణామాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అనే అనుమానాలు ఇప్పుడు రాష్ట్రంలోని పలువురికి కలుగుతున్నాయి. గుడివాడ నియోజకవర్గంలో జరిగిన చిరంజీవి జన్మదిన వేడుకలలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కొడాలి నాని పాల్గొని కేక్ కట్ చేయడమే అందుకు  కారణం!

మెగాస్టార్ చిరంజీవి విషయంలో నోటి దూకుడుకు మారుపేరైన ఎమ్మెల్యే కొడాలి నాని ఎంత అవమానకరంగా ప్రవర్తించారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. సినిమా ఇండస్ట్రీని కక్షపూరితంగా టార్గెట్ చేయవద్దని రాజకీయ నాయకులు వీలైతే రాష్ట్రానికి మేలు చేసేందుకు ప్రయత్నించాలని సలహా ఇచ్చినందుకు చిరంజీవికి పట్టిన ఖర్మ అది. మీకు చేతనైతే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురండి, పోలవరం ప్రాజెక్టు నిర్మించండి, రోడ్లు ఇతర ప్రాజెక్టులు పూర్తి చేయండి అని మెగాస్టార్ చిరంజీవి భోళాశంకర్ ఫంక్షన్ లో అన్నారు. దానికి ప్రతిస్పందనగా అనేకమంది నోటిదూకుడుకు మారుపేరైన వైసీపీ నాయకులు ఆయనను ఎడాపెడా తిట్టిపోయడం జరిగింది.

మీడియాలో పాపులర్ గా ప్రచురితమయ్యే అలాంటి ఆపర్చునిటీని తాను మాత్రం ఎందుకు వదులుకోవాలని అనుకున్నారేమో గానీ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా ఈ విషయంలో జోక్యం చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి పకోడీ గాడు, గొట్టం గాడు అంటూ చాలా హేయంగా మాట్లాడారు. దీనిపై చిరంజీవి ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా.

అయితే మంగళవారం జరిగిన చిరంజీవి బర్త్డే వేడుకలలో గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నానినే ముఖ్యఅతిథిగా పిలవడం ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది. చిరంజీవి ఫ్యాన్స్ కు ఆత్మాభిమానం లేదా? అన్నేసి తిట్లు తిట్టిన నానిని చిరంజీవి పుట్టినరోజు వేడుకకు ఎలా పిలవగలిగారు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ వేడుకలో కేక్ కట్ చేసిన కొడాలి నాని చిరంజీవిని తాను ఏమీ అనలేదని నటించడం చేతకాని నటులను మాత్రమే అన్నానని వ్యాఖ్యానించడం విశేషం. తన ఓటర్లలో  60 శాతం చిరంజీవి అభిమానులే ఉంటారని, అలాంటిది వారికి కోపం తెప్పించే పని తాను ఎందుకు చేస్తానని నాని అంటున్నారు.

కానీ స్థానికంగా విశ్వసనీయవర్గాల నుంచి తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. చిరంజీవి బర్త్డే వేడుకలకు తనను ఆహ్వానించడానికి కొడాలి నాని భారీగానే ఖర్చు పెట్టారని తెలుస్తోంది. విడిగా వివరణ ఇస్తే పరువు పోతుందనే భయంతో, ఈ కార్యక్రమానికి తాను అతిధిగా వచ్చేలా ప్లాన్ చేసుకుని ఆ వేదిక నుంచి నాని తన వివరణ ఇవ్వదలుచుకున్నట్లుగా తెలుస్తోంది. చిరు ఫ్యాన్స్ వల్ల కలిగే నష్టం పూడ్చుకోడానికే తాను అతిథిగా వెళ్లే ఏర్పాటు తానే చేసుకోవడం జరిగిందని తెలుస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles