కేసీఆర్ కు సెంటిమెంట్ అస్త్రాలు అందిస్తున్న కేంద్రం మంత్రులు 

Wednesday, May 1, 2024

తెలంగాణ సెంటిమెంట్ తో రెండు దశాబ్దాలకు పైగా రాష్ట్ర రాజకీయాలలో కీలక పాత్ర వహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా చేసి, పేరును బిఆర్ఎస్ గా మార్చడంతో ఇక సెంటిమెంట్ అస్త్రం ప్రయోగించలేరని సంబర పడుతున్న బిజెపి నేతలకు పార్లమెంట్ లో కేంద్ర మంత్రులు ఇస్తున్న సమాధానాలు ఇరకాటంలో పడేస్తున్నాయి. 

గిరిజన రేజర్వేషన్ల విషయమై కేంద్ర గిరిజన మంత్రి అర్జున్ ముండా ఇచ్చిన సమాధానం, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి హిందీ ప్రసంగాన్ని అవహేళన చేస్తూ ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వాఖ్యలను టిఆర్ఎస్ అస్త్రాలుగా మలచుకొని అవకాశం కల్పిస్తున్నాయి. 

సుప్రీంకోర్టులో తెలంగాణ బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై కేసు విచారణ జరిగిన తర్వాతే ఆ విషయంలో ముందుకు వెళ్తామని పార్లమెంట్ లో కేంద్ర మంత్రి స్పష్టం చేయడంతో మరోసారి గిరిజన రేజర్వేషన్ల చిచ్చు తెల్లనగానలో  రాజేసిన్నట్లయింది. ఓ విధంగా తెలంగాణాలో బిజెపిని ఆత్మరక్షణలోకి నెట్టివేసిన్నట్లయింది. 

తెలంగాణలో 10% ఎస్టీ రిజర్వేషన్ల పెంపు బిల్లుకు ఆమోదం తెలిపారా? అంటూ లోక్‌స‌భ‌లో టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు అర్జున్ ముండా లిఖితపూర్వక సమాధానం ఇస్తూ సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోమని తేల్చి చెప్పారు. గిరిజన రిజర్వేషన్లను 10 శాతం వరకు పెంచాలని కోరూతూ పంపిన తెలంగాణ బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల బిల్లు- 2017లో హోంశాఖకు చేరిందని ఆయన తెలిపారు. 

ప్రస్తుతం సుప్రీంకోర్టులో రిజర్వేషన్ల కేసు పెండింగ్ లో ఉందని పేర్కొంటూ ఆ కేసు పరిష్కారం అయిన తర్వాతే తెలంగాణ రిజర్వేషన్ల బిల్లును ప్రాసెస్ చేస్తామని చెప్పారు.  అయితే.. జనాభా ప్రాతిపదికన బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించాలని, తెలంగాణ హైకోర్టు గతంలో తీర్పు నిచ్చింది. ఇక ప్రస్తుతం బీసీ,ఎస్టీ, ఎస్టీలకు రిజర్వేషన్ విషయంలో 27 శాతం మాత్రమే అమలు చేస్తున్నారు. 

అయినా తెలంగాణ‌లో గిరిజ‌న రిజ‌ర్వేష‌న్ల పెంపు ఇప్పుడు కుద‌ర‌దని కేంద్రం స్పష్టం చేయడంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ తెలంగాణ గిరిజ‌నుల‌ను మ‌రోసారి మోసం చేసిందని దాడిచేసే అవకాశం బిఆర్ఎస్ నేతలకు కల్పించినట్లయింది. కాగా, గిరిజన రిజర్వేషన్లను పెంచుతూ ఇటీవల నోటిఫికేషన్‌ను తెలంగాణ ప్ర‌భుత్వం జారీ చేసింది. 

మరోవంక, తన హిందీ భాషపై ఆర్ధిక మంత్రి వాఖ్యలకు రేవంత్ రెడ్డి తీవ్ర అభ్యంతరం తెలుపుతూ “నేను శూద్రుడిని…. ” అంటూ చెప్పిన సమాధానం బిజెపి నేతలకు ఖంగు తినిపించింది. ప్రత్యర్థులను దూషిస్తూ మాట్లాడటమే కాదు, తెలివిగా వారి మాటలను తిప్పికొట్టగలరని రేవంత్ పై ఇతర పార్టీలలో సహితం ప్రశంసలు వ్యక్తం అవుతున్నాయి. 

రేవంత్ ను తీవ్రంగా వ్యతిరేకించే కేసీఆర్ కుమార్తె కవిత సహితం “హిందీ వస్తేనే రాజకీయాలు చేయాలా?” అంటూ ఘాటుగా స్పందిస్తూ ఓ విధంగా రేవంత్ కు సంఘీభావం తెలిపారు.  “నిర్మల సీతారామన్ వీక్ భాష కంటే.. వీక్ రూపాయి మీద మాట్లాడితే బాగుండేది” అంటూ ఆమె ఎద్దేవా చేశారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles