కేసీఆర్- అఖిలేష్ భేటీలో `రహస్య’ అజెండా!

Thursday, September 19, 2024

గత నెల 23న పాట్నాలో జరిగిన ప్రతిపక్ష కూటమి భేటీ గురించి `రాజకీయ పార్టీలు కాదు, ప్రజలు కలవాలి’ అంటూ నర్మగర్భంగా వాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ తో గత సోమవారం సమాజవాది పార్టీ అధినేత, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ప్రత్యేకంగా హైదరాబాద్ కు వచ్చి కలవడం ఎందుకో అంతుబట్టడం లేదు.

వారిద్దరూ కలిసి నాలుగైదు గంటలసేపు గడిపారు. తమ మధ్య ఏమి చర్చలు జరిగాయో కేసీఆర్ నుండి అధికారికంగా గాని, `మీడియా లీక్’ దారా గాని ఎటువంటి సమాచారం బైటకు రాలేదు. పాట్నా భేటీకి కేసీఆర్ ను ఆహ్వానించలేదు. కేసీఆర్ సహితం ఏ ప్రతిపక్ష కూటమిలో చేరే ప్రసక్తే లేదంటూ సంకేతం ఇచ్చారు.

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అంతకు ముందు రోజు సాయంత్రంమే  ఖమ్మంలో ఓ బహిరంగసభలో మాట్లాడుతూ బిఆర్ఎస్ భాగస్వామిగా ఉండే ఏ కూటమిలో కూడా కాంగ్రెస్ ఉండబోదని ప్రకటించారు. పైగా, పాట్నా భేటీకి బిఆర్ఎస్ ను ఆహ్వానించాలనుకొంటే తాము అభ్యంతరం చెప్పామని, ఆ పార్టీని ఆహ్వానిస్తే తాము హాజరు కాబోమని చెప్పామని కూడా వెల్లడించారు. బిఆర్ఎస్ ను బీజేపీ `బి టీం’గా రాహుల్ అభివర్ణించారు.

పాట్నా భేటీలో అఖిలేష్ యాదవ్ పాల్గొన్నారు. పైగా, అక్కడ నేతలు చెప్పినట్లు ఉమ్మడిగా పోటీ చేయాలి అంటే ఉత్తర ప్రదేశ్ కీలకమైన రాష్ట్రం కానుంది. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉన్నదని హైదరాబాద్ లో అఖిలేష్ చెప్పారు.  ప్రతిపక్ష కూటమిలోకి కేసీఆర్ ను బహిరంగంగానే ఆహ్వానించారు.

జాతీయ పార్టీగా అనూహ్యంగా ఎదుగుతూ దేశ ప్రజల ఆదరణ చూరగొంటున్న బీఆర్‌ఎస్‌ పార్టీ ఐక్య సంఘటనలో భాగస్వామ్యం కావాలని అఖిలేశ్‌ ఆహ్వానించారు. ఎంతో దార్శనికత గల జాతీయ నేత సీఎం కేసీఆర్‌ లేకుండా ప్రత్యామ్న్యాయ ఐక్య సంఘటనకు అర్థమేలేదని, తమతో కలిసి ముందుకు సాగాలని ఆయన కోరారు. అంటే పరోక్షంగా కాంగ్రెస్ కు ప్రతికూల సంకేతాలు ఇస్తున్నట్లు స్పష్టం అవుతుంది.

కాంగ్రెస్ భాగస్వామిగా ఉంటె ప్రతిపక్ష కూటమితో సంబంధం లేకుండా మరో వేదిక కోసం అఖిలేష్- కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారా? ఇటువంటి అనుమానాలు తలెత్తుతున్నాయి.  లేదా బిజెపికి `బి టీమ్’గా వ్యవహరిస్తూ ప్రతిపక్ష కూటమి బీటలు వారేవిధంగా కేసీఆర్ మంత్రాంగం నడుపుతున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

గతంలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని ఓట్ల మార్పిడి జరగక పోవడంతో అఖిలేష్ చేతులు కాల్చుకోవలసి వచ్చింది. అయితే, ఇప్పుడు జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలు ఉమ్మడిగా బిజెపిపై పోరాడుతున్నాయనే సంకేతం ఇవ్వాలంటే ఉత్తర ప్రదేశ్ లో ఉమ్మడిగా పోటీ చేయడం అత్యవసరం కాగలదు.  ఈ విషయంలో కాంగ్రెస్ ఎత్తుగడలకు బ్రేక్ వేసేందుకు అఖిలేష్ కేసీఆర్ తో చేతులు కలుపుతున్నట్లు భావించాల్సి వస్తుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles