కాంగ్రెస్ – ఆప్ రగడతో ప్రశ్నార్ధకంగా ప్రతిపక్ష కూటమి!

Saturday, September 7, 2024

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కూటమిగా ఏర్పడి, కనీసం 450 సీట్లలో ఉమ్మడిగా పోటీచేసి, కేంద్రంలోని బీజేపీని గద్దె దించాలని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సారధ్యంలో పాట్నాలో ఈ నెల 23న ఒక భేటీ ఏర్పాటు ద్వారా విపక్షాలు చేస్తున్న ప్రయత్నాలకు ఒకొక్క పార్టీ సొంత అజెండా అడ్డంకిగా మారుతుంది. 

ఒక వంక ఢిల్లీ ఆర్డినెన్స్‌ అంశంపై మద్దతు తెలిపే విషయంలో ఆప్‌, కాంగ్రెస్‌ మధ్య పంచాయితీ నడుస్తుండగా, తాజాగా కేరళలో సీపీఎం, కాంగ్రెస్‌ మధ్య మరో తగాదా పుట్టుకొచ్చింది. కేరళ పీసీసీ అధ్యక్షుడు సుధాకరన్‌ అరెస్టును ఆ పార్టీ తీవ్రంగా పరిగణించింది. ముఖ్యంగా కాంగ్రెస్- ఆప్ లమధ్య రగడ ఉమ్మడి వ్యూహానికి గండికోట్టేట్లు చేయనుంది.

మరోవైపు పాట్నా భేటీ అనంతరం జరిగిన విలేకర్ల సమావేశానికి ఆప్‌ జాతీయ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ గైర్హాజరవడం చర్చనీయాంశంగా మారింది.  దీంతో ఐక్యతపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.  బీహార్‌లో  జరిగిన విపక్షాల భేటీలో ఢిల్లీ ఆర్డినెన్స్‌పై ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ పట్టుబట్టినట్టు తెలుస్తున్నది. దీంతో పార్లమెంట్‌ సమావేశాల సమయంలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.

ఈ భేటీలో దీనిపై కాంగ్రెస్‌ ఓ నిర్ణయానికి రాకపోవడంతో భవిష్యత్తులో జరిగే భేటీకి ఆప్‌ గైర్హాజరు అయ్యే అవకాశం ఉందని ఆప్ స్పష్టం చేసింది. దీంతోపాటు పార్లమెంట్‌లో ఓటింగ్‌ సందర్భంగా వాకౌట్‌ చేయాలని కాంగ్రెస్‌ ఆలోచిస్తున్నదని ఆ పార్టీ నేతలు చిట్‌చాట్‌లో చెప్పినట్టు ఆప్‌ దృష్టికి వచ్చింది. దీంతో వాకౌట్‌ చేయడమంటే పరోక్షంగా బీజేపీకి మద్దతు తెలపడమేనని ఆప్‌ నేతలు విమర్శిస్తున్నారు.

పాట్నా భేటీ సందర్భంగా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నేరుగా రాజీవ్ గాంధీని కలిసి “మన మధ్య గల విబేధాలను మనం టీ తాగుతూ పరిష్కరించుకోవచ్చు” అంటూ సూచించారు. పైగా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జోక్యం చేసుకొని `మీరిద్దరూ కలిసి భోజనం చేస్తూ సమస్యలు చర్చించుకొని’ అంటూ సూచించారు. అయినా, రాహుల్ గాని, కాంగ్రెస్ నేతలు గాని స్పందించలేదు.

రాహుల్ పార్లమెంటరీ సభ్యత్వం రద్దు కాగానే కేజ్రీవాల్ తీవ్రంగా ఖండించారని, ఆర్డినెన్స్ గురించి చర్చించేందుకు కలుస్తామంటే కాంగ్రెసు నేతల నుండి స్పందన లేదని ఆప్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నది. ఆప్ భేటీ చివరిలో ఆప్ అధికార ప్రతినిధులు కాంగ్రెస్ గురించి మీడియా సమావేశాలలో అనుచితంగా మాట్లాడుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేస్తే,  కాంగ్రెస్ అధికార ప్రతినిధులు సహితం ఆప్ గురించి చులకనగా మాట్లాడుతున్నారంటూ కేజ్రీవాల్ ప్రత్యుత్తరమిచ్చారు.

వాస్తవానికి, పాట్నా భేటీలో ఢిల్లీ ఆర్డినెన్సును బహిరంగంగా వ్యతిరేకించాలని కాంగ్రెస్ కు సూచించినా, ఆ పార్టీ నేతల నుండి స్పందన లేదు. ఆ భేటీలో పాల్గొన్న ప్రతిపక్ష పార్టీలలో రాజ్యసభలో సభ్యులున్న వారంతా ఆ ఆర్డినెన్సును వ్యతిరేకించారు. కానీ కాంగ్రెస్ మాత్రమే మౌనం దాలుస్తుంది. కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరి కారణంగా వచ్చేనెల 10 లేదా 12న సిమ్లాలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే నేతృత్వంలో జరిగే తదుపరి భేటీకి ఆప్ హాజరుకావడం అనుమానాస్పదంగా మారింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles