కరోనా వ్యాక్సిన్ సరఫరాపై చేతులెత్తేసిన కేంద్రం

Wednesday, September 18, 2024

కరోనా వ్యాక్సిన్ తమ ప్రభుత్వ సృష్టి అన్నట్లు, స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ కనుగొన్నట్లు, ప్రపంచంలో అందరిని దీనితో ఆడుకున్నట్లు ప్రచారం చేసుకొనే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ విషయంలో ఇక చేతులెత్తేసింది. దేశంలో ఒకవంక కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతుంటే ఇక వ్యాక్సిన్ ఇవ్వడం తమ వల్లకాదని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలే బహిరంగ మార్కెట్ లో కొనుక్కొని ప్రజలను ఆదుకోవాలని తేల్చి చెప్పేసింది.

కరోనా కట్టడిలో అతి ముఖ్యమైన వ్యాక్సినేషన్ కార్య క్రమాన్ని కేంద్ర ప్రభుత్వం తిలోదకాలచ్చినట్టు స్పష్టమైంది. ఒకవైపు కరోనా కేసులు పెరుగుతున్నాయంటూ రాష్ట్రాలను అప్రమత్తం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం, వ్యాక్సిన్ సరఫరాలో మాత్రం నిస్సహాయత వ్యక్తం చేస్తున్నది. 

తమకు వ్యాక్సిన్లు సరఫరా చేయాలని కోరిన పలు రాష్ట్రాల మంత్రులకు వ్యాక్సిన్ సరఫరా చేసేది లేదని, సొంతంగా కొనుగోలు చేసుకోవాలని సూచించింది. శుక్రవారం వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా పరిస్థితులు, సంసిద్ధతపై కేంద్ర ఆరోగ్య మంత్రి మ‌న్సుఖ్‌ మాండవీయ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

వివిధ దేశాలు, పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్, వ్యాక్సినేషన్, అప్రాప్రియేట్ బిహేవియర్ వంటి ఐదంచెల వ్యూహాన్ని పక్కాగా అమలు చేయాలని కోరారు. అంతవరకు ఉపదేశాలు బాగానే ఇచ్చారు.

ఈ సందర్భంగా తెలంగాణ వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశనంలో కరోనా కట్టడిలో, వ్యాక్సినేష‌న్‌లో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. కరోనా పరిస్థితులు రాష్ట్రంలో పూర్తిగా అదుపులో ఉన్నాయని, ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని చెప్పారు. ప్రికాషనరీ డోసులో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉన్నట్లు చెప్పారు.

అయితే కేంద్రం నుంచి రాష్ట్రానికి వ్యాక్సిన్ల సరఫరా నిలిచిపోవడంతో రాష్ట్రంలో నిల్వలు లేకుండా పోయినట్లు చెప్పారు. దీంతో వ్యాక్సినేషన్ నిలిచిపోయిందని పేర్కొన్నారు. రాష్ట్రానికి అవసరమైన వ్యాక్సిన్ డోసులను తక్షణం సరఫరా చేయాలని కోరిన మంత్రి, ఈ విషయంలో ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసినట్లు గుర్తు చేశారు.

తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలు సైతం తమకు వ్యాక్సిన్ సరఫరా నిలిచిపోయిందని, దీంతో వ్యాక్సినేషన్ కార్యక్రమానికి అంతరాయం కలుగుతున్నట్లు కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చారు. అనంత‌రం మ‌న్సుఖ్‌ మాండవీయ మాట్లాడుతూ  కావల్సిన వ్యాక్సిన్లు ఆయా రాష్ట్రాలు కొనుగోలు చేసుకోవచ్చని, బహిరంగ మార్కెట్లో పుష్కలంగా వ్యాక్సిన్ నిల్వలు ఉన్నాయని కేంద్ర మంత్రి చెప్పారు.

ఇదిలా ఉంటే, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు దృష్ట్యా హైదరాబాద్ ఫార్మా సంస్థ బయోలాజికల్ ఇ సహకారంతో 15 లక్షల డోసులు సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యాక్సిన్ సరఫరా చేసేందుకు ముందుకు వచ్చిన బయోలాజిక్ ఇ ఎండీ మహిమా ధాట్లకు ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు ధన్య వాదాలు తెలిపారు.

దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. రోజువారీ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం.. గురువారం దేశవ్యాప్తంగా కొత్తగా 6,050 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్‌గా ఉన్న కేసుల సంఖ్య 28,303కి పెరిగింది. ఒక్క రోజులో ఆరు వేలకు పైగా కేసులు నమోదవ్వడం 203 రోజుల తర్వాత ఇదే తొలిసారి. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles