ఏపీ బీజేపీలో ఎవ్వరి దారి వారిదే!

Saturday, September 7, 2024

ఏపీలో బిజెపికి నాటాకన్నా తక్కువగా ఓట్లు ఉన్నప్పటికీ ఆ పార్టీ నేతలలో ఎవ్వరిలో బెంగ కనిపించడం లేదు. పార్టీ కేంద్రంలో, పలు రాస్త్రాలలో అధికారంలో ఉండడంతో ఆ పలుకుబడిని ఉపయోగించుకొని ఇక్కడ పైరవీలు చేస్తూ రెండు చేతులా సంపాదించుకోవడంలో తప్పా పార్టీ నిర్మాణం గురించి ఎవ్వరూ ఆసక్తి ప్రదర్శించడం లేదు.

వారిలో కొందరు అధికార వైసీపీకి తాబేదార్లుగా పనిచేస్తుంటే, మరొకొందరు ప్రతిపక్షం టిడిపితో చేతులు కలిపి ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఏదైనా పదవి పొందాలను ఆరాటపడే వారున్నారు. సైద్ధాంతికంగా పార్టీకి కట్టుబడిన వారిని మాత్రం పట్టించుకొనే వారే కరువయ్యారు.

మర్యాదకోసం వైసిపి ప్రభుత్వంపై మీడియా సమావేశాల్లో విమర్శలు కురిపిస్తున్నప్పటికీ జనం `బిజెపి – వైసిపి’లను ఒకటిగానే చూస్తున్నారంటూ ఇటీవల పట్టభద్రుల ఎమ్యెల్సీ ఎన్నికలలో ఘోరపరాజయం చెందిన అనంతరం ఆ పార్టీ నాయకులు కొందరు వాపోవడం తెలిసిందే.

అందుకనే ఆ `అపఖ్యాతి’ పోగొట్టుకొనేందుకు అధికారంలో ఉన్న వైసిపి ప్రభుత్వం చేబడుతున్న అవినీతి చర్యలపై ఛార్జ్ షీట్ లను ప్రకటిస్తున్నామంటూ ఇప్పుడు బయలుదేరారు. వాస్తవానికి మూడు నెలల క్రితం విశాఖపట్నం అధికార పర్యటనకు వచ్చినప్పుడే ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయం చెప్పినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు.

దానితో ఆగ్రహించిన పార్టీ జాతీయ నేతలు నలుగురు సభ్యులతో ఒక కమిటీ వేసి, ఈ పని మొదలుపెట్టామని ఆదేశించడంతో రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు హడావుడిగా 11 మందితో (ఆ నలుగురితో సహా) ఒక కమిటీని ప్రకటించారు. అందులో వైఎస్ జగన్ ఏజెంట్లుగా పేరున్న కొందరిని కూడా చేర్చారు అనుకోండి.

ఏపీ బీజేపీలో ఉన్నన్ని గ్రూపులు మరో పార్టీలో కనిపించవు. వీటిలో ప్రధానంగా వైసీపీ అనుకూల బీజేపీ, టీడీపీ అనుకూల బీజేపీ వర్గంతో పాటు, ఆర్‌ఎస్‌ఎస్‌ నేపథ్యం ఉన్న ఒరిజినల్ బీజేపీ నాయకులు ఉన్నారు. బీజేపీ ఏపీలో ఎదగడం కంటే, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ బలహీన పడాలనే భావనతోనే ఇన్నాళ్లు బీజేపీ ఉంది. అదే సమయంలో బీజేపీ సొంతంగా బలపడే ప్రయత్నాలు కూడా పెద్దగా సత్ఫలితాన్ని ఇవ్వలేదు.

మరొకొందరు నాయకులైతే బీజేపీలో ఎవ్వరి పెత్తనం సాగుతుందో వారికి తోకగా మారిపోతుంటారు. గతంలో వెంకయ్యనాయుడు వెంట ఉన్నవారే, ఆ తర్వాత కన్నా లక్ష్మీనారాయణకు సన్నిహితంగా వ్యవహరించారు. ఇప్పుడు వారే సోము వీర్రాజు వద్ద అంతా తామే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. బిజెపి బొమ్మతో  రెండు చేతులా సంపాదించుకోవడమే వారి పని.

అధికార వైసీపీ మాత్రం బీజేపీ విషయంలో స్పష్టంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో తమ బంధాన్ని కొనసాగిస్తున్నామని ముఖ్యమంత్రి జగన్‌ చెబుతున్నా, బీజేపీ విషయంలో జగన్మోహన్ రెడ్డి కూడా అప్రమత్తంగానే ఉన్నారని, ఏదో రోజు బీజేపీ దృష్టి తనపై కూడా పడుతుందని జగన్‌కు కూడా తెలుసని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

ప్రస్తుతం సిబిఐ కేసులు, ఇతర అవసరాలకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని వాడుకొనేందుకే జగన్ బిజెపితో స్నేహం నటిస్తుండటం అందరికి తెలిసిందే. రాష్ట్రంలో వారి బలం, బలగం ఏపాటిదో ఆయనకు తెలియనిది కాదు. అయితే టిడిపి నేతలు మాత్రం జగన్ అరాచకాల నుండి రక్షణకోసం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం బాసటగా నిలుస్తుందని ఆశతో బిజెపితో స్నేహం కోసం ఆవురావురు మంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles