ఇప్పుడే నిద్ర లేచి మాట్లాడుతున్న కొడాలి నాని!

Thursday, September 19, 2024

 వెనకటికి ఒక కోడిపుంజు నేను కోత వేయకపోతే ఊరు నిద్ర లేవదు అని అనుకున్నది.  ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో మాజీ మంత్రి కొడాలి నాని పరిస్థితి కూడా అంతకంటే భిన్నంగా ఎంత మాత్రమూ లేదు.  తనకు తెలియదు కనుక ప్రపంచంలో ఎవ్వరికీ తెలియడానికి వీల్లేదు..  అనుకుంటున్నట్లుగా ఉన్నారు. . ఆయన ఇప్పుడే నిద్ర లేచి,  ఇప్పటిదాకా జరిగిన వ్యవహారాలను తక్కువ చేసి మాట్లాడుతున్నారు!

 ఇంతకో విషయం ఏంటంటే..  వైయస్ వివేకానంద రెడ్డి హత్యోదంతంలో  40 కోట్ల రూపాయలు విలువైన డీల్ జరిగిందనే సంగతి కొన్ని నెలలుగా ప్రచారంలో ఉంది.  ఈ హత్య కేసులో నిందితులైన వ్యక్తులు,  అప్రూవల్ గా మారి సిబిఐ కు వెల్లడించిన వాంగ్మూలం వివరాలలో ఈ సంగతి ఉంది.  40 కోట్లలో తనకు 5 కోట్లు ఇస్తామని ఆఫర్ చేసినట్లుగా దస్తగిరి వెల్లడించారు.   పత్రికలన్నీ ఈ విషయాన్ని చాలా ప్రముఖంగా ప్రచురించాయి. కొన్ని నెలలుగా ఈ వ్యవహారం ప్రజల నోళ్లలో నానుతోంది. 

ఇదే సంగతిని తన పాదయాత్రలో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కూడా కొన్ని రోజుల కిందట వెల్లడించారు.  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ ఆ సమయంలో కిమ్మనకుండా ఉండిపోయారు.  నిజం చెప్పాలంటే తేలుకొట్టిన దొంగల్లాగా సైలెంట్ గానే ఉండిపోయారు.  ఇన్ని రోజుల తర్వాత తాజాగా సిబిఐ అధికారులు తెలంగాణ హైకోర్టుకు కౌంటర్ దాఖలు చేశారు. ప్రధాన నిందితుల్లో ఒకరైన సునీల్ యాదవ్ కు బెయిల్ ఇవ్వరాదు,   అతనికి బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది..  అనే డిమాండ్ తో  సిబిఐ అధికారులు ఈ కౌంటర్ దాఖలు చేశారు.  వివేకానంద రెడ్డి హత్యకు మొత్తం 40 కోట్ల రూపాయల డీల్ జరిగినట్లుగా,  ఆ కౌంటర్లో సిబిఐ చాలా స్పష్టంగా పేర్కొంది.

 గతంలో  నిందితుల వాంగ్మూలాల రూపంలో ఇదే వివరాలు బయటకు వచ్చినప్పుడు..  కొడాలి నాని పత్రికలను చదివారో లేదో తెలియదు.  ఇప్పుడు హఠాత్తుగా మేలుకొని నారా లోకేష్ మీద రంకెలు వేస్తున్నారు. ఇప్పుడు సిబిఐ కౌంటర్ లో పేర్కొన్న వివరాలు 20 రోజులు ముందే నారా లోకేష్ కు ఎలా తెలిసాయి అని కొడాలి నాని ప్రశ్నిస్తున్నారు.  అక్కడికేదో నారా లోకేష్ సిబిఐ విచారణను ప్రభావితం చేస్తున్నట్లుగా,  లోకేష్ చెప్పిన వివరాలను సిబిఐ తమ నివేదికలో రాస్తున్నట్లుగా రంగు పులమడానికి కొడాలి నాని ప్రయత్నిస్తున్నారు.  గతంలోని అందరికీ తెలిసిన ఈ విషయాన్ని ఆయన గమనించక పోయినంత మాత్రాన,  మోకాలికి బోడి గుండుకు ముడిపెట్టినట్టుగా నారా లోకేష్ మీద విమర్శలు చేస్తే ఎలా అని ప్రజలు నవ్వుకుంటున్నారు.

 ఇంతకూ కోడిపుంజు కథ ఎందుకు చెప్పుకున్నాం అంటే..  కోడిపుంజు ఆ రకంగా కూత పెట్టడం మానేసింది.  దాని యజమాని రెండు రోజులు పాటు ఆలస్యంగా నిద్ర లేచాడు.  మూడో రోజు కూడా అది కూత పెట్టక పోయేసరికి అతనికి అనుమానం వచ్చింది.  దానికి ఏమైనా సుస్తీ చేసిందేమో అనుకుని..  కోసుకొని తినేసాడు.  ఈ కథ చెప్పే నీతిని కొడాలి నాని గ్రహిస్తే మంచిది. . ఆయన ఇప్పుడే నిద్ర లేచి..  తనకు విషయం తెలియదు కనుక,  ప్రపంచంలో ఎవ్వరికీ తెలియడానికి వీల్లేదు..  అని అనుకుంటూ ఉంటే ఎన్నికలలో ఓడించి,  ప్రజలు కోడికి పట్టిన గతే పట్టిస్తారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles