అమూల్ కు  కట్టబెట్టిన విజయ్ పాలు!

Friday, September 20, 2024

సరిగ్గా నెల రోజుల కిందటనే రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నందిని పాల ఉత్పత్తులకు తిలోదకాలిచ్చి, గుజరాత్ కు చెందిన అమూల్ కు పట్టాభిషేకం చేసేందుకు కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తే ఆ రాష్త్ర ప్రజలు తిరగబడ్డారు. ఆ ప్రభుత్వాన్ని కుప్పకూల్చారు. అమూల్ పాలు అమ్మమని, నందినిని అభివృద్ధి చేస్తామని బిజెపి నేతలు ఎంతగా మొత్తుకున్నా ప్రజలు నమ్మలేదు.

కర్ణాటకలో జరిగిన సంఘటనల నుండి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏమాత్రం గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో  విజయ సహకార డైరీని అమూల్ కు కట్టబెట్టారు. 2019 ఎన్నికల ముందు  ‘మేం అధికారంలోకి రాగానే చిత్తూరు, రేణిగుంట సుగర్‌ ఫ్యాక్టరీలను పునరుద్ధరిస్తాం.. విజయ సహకార డెయిరీని విజయం వైపు నడిపిస్తాం’ అని ప్రగల్భాలు పలికారు.

తీరా అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లకు ‘అమూల్‌’ చేతిలో ‘విజయ’ను పెట్టేసి చేతులు దులుపుకున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 28 ఎకరాల భూములను 99 ఏళ్లు లీజుకు ఇచ్చేస్తూ బుధవారం జరిగిన క్యాబినెట్‌లో ఆమోదముద్ర వేశారు. లీజు ప్రాతిపదికన ఏడాదికి ప్రభుత్వానికి ఎంత చెల్లిస్తారన్నది గోప్యంగానే ఉంచారు.

గుజరాత్‌ రాష్ట్రానికి చెందిన అమూల్‌ కంపెనీ మోదీ ప్రభుత్వ అండదండలతో దేశవ్యాప్తంగా విస్తరించే ప్రయత్నం చేస్తుంది. అయితే ‘అమూల్‌ వస్తే తమిళనాడు డెయిరీలు మూతబడే అవకాశం ఉందని, నష్టాల్లో కూరుకుపోతాయి’ అని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ తిప్పి కొట్టారు.

కానీ, జగన్మోహన్‌రెడ్డి మాత్రం అందరికంటే ముందుగానే అధికారంలోకి వచ్చిన వెంటనే ‘అమూల్‌’కు స్వాగతం పలికేశారు. చిత్తూరు, మదనపల్లిల్లో సహకార పాల డెయిరీలను పున్ణప్రారంభిస్తారన్న ఆశతో ఉన్న పాడిరైతులకు, కార్మికుల కళ్లల్లో కారం కొట్టారు. వాటి ఆస్తులన్నీ ‘అమూల్‌’కు అప్పగించేశారు.

ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో పాడి పరిశ్రమను నమ్ముకుని 32 ప్రైవేట్‌ డెయిరీలు ఉన్నాయి. వందలాదిమంది ఈ డెయిరీల్లో ఉపాధి పొంది ఉన్నారు. అదే అమూల్‌ పూర్తిస్థాయిలో పాలసేకరణ ప్రారంభిస్తే చిన్న చిన్న డెయిరీలన్నీ నష్టాల బాట పట్టే అవకాశం ఉందన్న దిగులు చిన్న, మధ్యతరగతి డెయిరీల యాజమాన్యంలో ఉంది.

1945లో చిత్తూరు – వేలూరు జాతీయ రహదారిలో 28 ఎకరాల్లో పాడి రైతుల సహకారంతో మూడువేల లీటర్ల పాల సేకరణతో చిత్తూరు విజయ సహకార డెయిరీ ప్రారంభమ య్యింది. అంచెలంచెలుగా ఎదుగుతూ జిల్లాలోని పాడి రైతులకు అండగా నిలుస్తూ 1980-90 మధ్య మూడు లక్షల లీటర్ల పాలను సేకరించి దేశంలో అతి పెద్ద రెండో సహకార డెయిరీగా అభివృద్ధి చెందింది.

నెయ్యి అమ్మకం ద్వారానే టిటిడి నుంచి కోటి రూపాయల పైగా అమ్మకం జరిగేది. కోట్లాది రూపాయల టర్నోవర్‌తో లాభాల బాయటలో పయనిస్తున్న విజయ సహకార డెయిరీ పాడి రైతులకు ఎంతో అండగా ఉండేది. దాదాపు 400 మంది కార్మికులు డెయిరీలో వివిధ కేటగిరీల్లో పనిచేసేవారు.

అయితే, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 2002, ఆగస్టులో విజయ డెయిరీ మూతబడింది. ఆనాడు అప్పుడప్పుడే ప్రారంభించిన తన కుటుంభ సంస్థ హెరిటేజ్ కోసం దానిని మూత పడేటట్లు చేశారని అంటూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించారు. ఇప్పుడు  బుధవారం జరిగిన క్యాబినెట్‌లో అమూల్‌కు అప్పగించడంతో విజయ డెయిరీ కథ ముగిసిపోయినట్లే.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles