ఏ2 ను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచారు!

AW Telugu
2 Min Read

పొరబాట్లు చేయకుండా ఉండడం కష్టం. కానీ ఎంత త్వరగా తమ పొరబాట్లను గుర్తిస్తారు, ఎంత త్వరగా వాటిని దిద్దుకుంటారు.. అలా తమ పొరబాట్లను దిద్దుకోవడానికి సిగ్గుపడకుండా ఉంటారు అనేదాని మీదనే మనుషుల వ్యక్తిత్వం ఆధారపడి ఉంటుంది. రాజ్యసభ ఛైర్మన్ కూడా ఇప్పుడు తన పొరబాటును దిద్దుకునే ప్రయత్నం చేశారు. రాజ్యసభ వైస్ ఛైర్మన్ ప్యానెల్  జాబితాలోంచి వైఎస్సార్ సీపీ ఎంపీ, జగన్ అవినీతి కేసుల్లో కీలక నిందితుడు ఏ2 విజయసాయిరెడ్డి పేరును తొలగించారు. రాజ్యసభ వైస్ ఛైర్మన్ గా ప్యానెల్ జాబితాలో ఉండడం అనేది ఒక గౌరవప్రదమైన రాజ్యాంగపరమైన బాధ్యత. అలాంటి స్థానంలో అనేకానేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని ఉంచడం పొరబాటు అని గ్రహించి వెంటనే దిద్దుకున్నట్టుగా కనిపిస్తోంది. 

ఈనెల 5వ తేదీన రాజ్యసభ ప్యానెల్ వైస్ ఛైర్మన్ల జాబితాను విడుదల చేశారు. మొత్తం 8మంది పేర్లతో ఈ జాబితా తయారైంది. అందులో విజయసాయిరెడ్డి పేరు కూడా ఉంది. వందల కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలతో కోర్టు కేసులను, విచారణలను ఎదుర్కొంటున్న నాయకుడు, భూకబ్జాలు దందాలకు సంబంధించి నిత్యం అనేక వివాదాల్లో ఉండే విజయసాయిరెడ్డి లాంటి నాయకుడిని.. ఎంతో గౌరవప్రదమైన రాజ్యసభ వైస్ ఛైర్మన్ ప్యానెల్ లో పెట్టడాన్ని గమనించి పలువురు విస్తుపోయారు. అయితే విజయసాయికి ఇది సహజంగానే ఆనందం కలిగించింది. ఆ జాబితాను ఆయన తన ట్విటర్ ఖాతాలో షేర్ చేస్తూ.. తనకు ఆ అవకాకాశం కలిగించిన రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ కు కృతజ్ఞతలు కూడా తెలిపారు. సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే మూడురోజుల వ్యవధిలోనే ఉపరాష్ట్రపతి తన పొరబాటును దిద్దుకున్నారు. ఏ2 ను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచడమే మంచిదని గుర్తించినట్టుగా, అనుచితమైన గౌరవం కట్టబెడితే తమ పరువే పోతుందని భయపడినట్టుగా ఆయన పేరును తొలగించారు. 

విజయసాయిరెడ్డి.. తన మీద ఉన్న సీబీఐ కేసులు, కోర్టులో ఉన్న విచారణల నేపథ్యంలో సహజంగా ఇతరుల మీద ఎంత దూకుడుగా వ్యవహరిస్తున్నప్పటికీ కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ నాయకులతో చాలా చాలా సన్నిహితంగా మెలగుతుంటారు. కొన్ని సందర్బాల్లో ఆయన కూడా బిజెపి నాయకుడేనా అన్నట్టుగా వారితో కలిసిపోయి వ్యవహరిస్తుంటారు. రాసుకుపూసుకు తిరుగుతుంటారు. బిజెపి కేంద్ర మంత్రులను, పెద్దలను పదేపదే పొగుడుతూ ప్రసన్నం సుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. 

ఇలాంటి భజన కార్యక్రమాలు ఫలితం ఇచ్చాయేమోనని, బిజెపి కూడా విజయసాయి భజనలకు బుట్టలో పడినదని.. ఆయన పేరు ప్యానెల్ జాబితాలోకి వచ్చినప్పుడు అంతా అనుకున్నారు. అయితే.. మూడు రోజుల వ్యవధిలోనే ఆ జాబితాను అప్ డేట్ చేస్తూ రాజ్యసభ చైర్మన్ తన పొరబాటు దిద్దుకోవడం విశేషం. పాపం.. విజయైసాయికి ఆ మురిసిపాటు, మిడిసిపాటు మూడు రోజులు కూడా దక్కలేదు. 

- Advertisement -
Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *