టిడ్కో ఇళ్ళు : పూర్తి కాకుండా డ్రామా చేస్తున్నారా?

Monday, September 16, 2024

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం నాడు గుడివాడ నియోజకవర్గ పరిధిలో 8912 టిడ్కోఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. పేదలకు సొంత ఇంటి కలను సాకారం చేయడంలో బహుశా ఇది తమ ప్రభుత్వం సాధిస్తున్న అతి గొప్ప ఘనకార్యాలలో ఒకటి .. అని ఇవాళ కార్యక్రమంలో చెప్పుకుంటారు కూడా! కానీ వాస్తవాలను గమనిస్తే.. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలలో భాగంగా మాత్రమే టిడ్కో ఇళ్లను పంపిణీ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండగా ప్రతి చోటా కూడా దాదాపు 70శాతం  కంటే ఎక్కువగా పూర్తయిన ఇళ్లను ఇప్పటికీ పూర్తిస్థాయి వసతులుకల్పించకుండానే లబ్ధిదారులకు ఇచ్చేయడం అనేది కేవలం ఒక డ్రామా అని ప్రజలు భావిస్తున్నారు.

టిడ్కో ఇళ్లు గత ప్రభుత్వ హయాంలో మంజూరయ్యాయి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వేగంగానే పనులను కొనసాగిస్తూ వచ్చింది. ఆ ప్రభుత్వం పదవీకాలం పూర్తయ్యే సమయానికి దాదాపుగా ప్రతి చోటా కూడా 70 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. అప్పుడు అధికారంలోకి వచ్చిన వైయస్ జగన్మోహన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ పేరుతో ఒక ప్రహసనం నడిపిస్తూ నిర్మాణాలను ఉన్నపళంగా ఆపు చేయించారు. అప్పటినుంచి వాటి నిర్మాణం ఇప్పటిదాకా పూర్తి స్థాయిలో కొనసాగలేదు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది ఇళ్ల నిర్మాణాలు పూర్తి అయినప్పటికీ,  ఒక్కటంటే ఒక్కటి కూడా లబ్ధిదారులకు అందించలేదు. టిడ్కో ఇళ్లు అనేవి తెలుగుదేశం హయాంలో ప్రారంభమైన పథకం గనుక దానిని పూర్తిచేస్తే, లబ్ధిదారులకు అందిస్తే క్రెడిట్ చంద్రబాబు నాయుడుకు వెళుతుంది అనే సంకోచంతో జగన్మోహన్ రెడ్డి వాటిని పట్టించుకోకుండా వదిలేశారు.

తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గాని, నారా లోకేష్ గాని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు టిడ్కో ఇళ్ల సముదాయం కనిపిస్తే అక్కడ సెల్ఫీలు దిగి ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ ‘‘ఇవి మేము చేపట్టిన నిర్మాణాలు మీరు చేసిన పని ఏదైనా ఉందా’’ అని జగన్ కు సవాలు విసరడం ప్రారంభించారు. అయినా సరే పూర్తయిన ఇళ్ల పట్ల కూడా పూర్తి ఉపేక్ష భావం చూపిస్తూ వచ్చిన సర్కారు ఎట్టకేలకు గుడివాడలో ఇళ్లు పంపిణీ చేయడానికి నిర్ణయించుకుంది.

అయితే ట్రాజెడీ ఏమిటంటే ఇక్కడ ఇళ్ల నిర్మాణం ఇంకా చాలా వరకు పూర్తి కాలేదు. వాటికి మౌలిక వసతులు లేవు. మొత్తం 8912 ఇళ్ల పట్టాలు అందజేస్తుండగా కేవలం 2700 ఇళ్లకు మాత్రమే ఇప్పటిదాకా విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు. మిగిలిన వాటికి కరెంటుకు గతి లేదు. దాదాపుగా 6000 ఇళ్లకు కరెంటు, తాగునీరు, పైపులైన్లు, ఓవర్ హెడ్ ట్యాంకులు ఇంకా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఇవేమీ చేయకుండానే హడావుడిగా లబ్ధిదారులకు అందించేందుకు ఒక కార్యక్రమం నిర్వహించడం కేవలం ఓటు బ్యాంకు రాజకీయంగా, డ్రామాగా ప్రజల భావిస్తున్నారు. ప్రభుత్వానికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలోనూ వాటిని పూర్తిచేసి ప్రజలకు అందించాలని కోరుతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles