జగన్ బర్త్‌డే గిఫ్ట్4 : జనసేననుంచి అదిరిపోయే పంచ్!

Friday, December 5, 2025

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాను ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటకు కట్టుబడి ఉంటున్నారా? లేదా, ఏవీ వీలవుతాయో.. ఏవి లాభసాటిగా ఉంటాయో వాటిని మాత్రమే నెరవేర్చి.. తాను మాటతప్పని నాయకుడిని అని డప్పుకొట్టుకుంటూ ఉంటారా? అనే తరహా సందేహాలను ప్రజల్లో పుట్టించేలా.. జనసేన పార్టీ ముఖ్యమంత్రి జగన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఆయన పుట్టినరోజు నాడు, జనసేన పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ అధ్యక్షుడు నాదెండ్ల మనోహర్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
‘‘HAPPY BIRTHDAY CM SIR!సామూహిక గృహ ప్రవేశాలకు ముహూర్తం ఈ రోజే.. గుర్తుందా
@ysjagan
గారూ. పునాదుల్లోంచి లేవని ఇళ్ళు, అసలు పునాదులే తీయనివి చాలా ఉన్నాయి. బటన్ నొక్కితే టపీమని ఇళ్ళు పూర్తయ్యే టెక్నాలజీ ఉంటే తప్ప రాష్ట్రంలో గృహ నిర్మాణ పథకం ముందుకెళ్ళదు.’’ అంటూ నాదెండ్ల మనోహర్ ట్వీట్ చేశారు. గతంలో పేదలకు ఇంటిస్థలాలు పంపిణీ చేసినప్పుడు.. తన పుట్టినరోజు నాటికి సామూహిక గృహప్రవేశాలు కూడా చేయిస్తాం అంటూ.. జగన్ అప్పట్లో హామీ ఇచ్చిన సంగతిని ఈ ట్వీట్ ద్వారా నాదెండ్ల మనోహర్ గుర్తుచేశారు.
రాష్ట్రంలో జగనన్న కాలనీల్లో ఇచ్చిన ఇంటి స్థలాల్లో నిర్మాణాలు గృహప్రవేశాల దశ వరకు కాదు కదా.. 90 శాతం అసలు పునాదుల దశ కూడా దాట లేదు. ప్రభుత్వం స్థలాలు ఇచ్చేశాం అని చెప్పుకోడానికి తప్ప.. అందులో సగం.. ప్రజలు నివాసయోగ్యం కాని విధంగా ఉన్నాయి. అయితే ముఖ్యమంత్రి గృహప్రవేశానికి చెప్పిన గడువు దాటిపోయింది. ఈ విషయాన్నే దెప్పిపొడుస్తూ.. నాదెండ్ల మనోహర్. ట్వీట్ చేయడం విశేషం.
ప్రతి విషయానికీ బటన్ నొక్కి ప్రజల ఖాతాల్లో డబ్బులు వేసేస్తున్నా అని సీఎం చెప్పుకుంటూ ఉండే సంగతిని కూడా ఆయన ఎద్దేవా చేస్తూ.. బటన్ నొక్కితే టపీమని ఇళ్లు పూర్తయిపోయే టెక్నాలజీ ఉంటే తప్ప రాష్ట్రంలో పేదలకు గృహనిర్మాణ పనులు ముందుకెళ్లవు అంటూ గేలి చేయడం విశేషం.
జగన్ బర్త్ డే వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు చాలా ఘనంగా నిర్వహించారు. ఈసారి బర్త్ డేకు 8వ తరగతి పిల్లలకు సాంసంగ్ ట్యాబ్ లను జగన్ కానుకగా అందించారు. అయితే ఇదే రోజున బైజూస్ సంస్థ క్రెడిబిలిటీ మీద సందేహాలు రేగేలా వార్తలు వచ్చాయి. బైజూస్ పాఠాలు పిల్లలకు జిందా తిలిస్మాత్ వంటివి అని జగన్ ప్రచారం చేస్తుండగా.. అదేసంస్థ దివాలా తీస్తున్నదని అప్పుల ఎగవేతకు పాల్పడుతున్నదని అనేకానేక ఆరోపణలు మధ్య వార్తల్లోకి రావడం.. అది కూడా జగన్ బర్త్ డే నాటికి తారస్థాయిలో ఉండడం.. అసలు బైజూస్ తో ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని వామపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం కూడా జరుగుతోంది.

No tags for this post.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles