మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తన ప్యాలస్ దాటి బయటకు వస్తున్నారు అంటే ఏదో ఒక ప్రత్యేకమైన కారణం ఉంటే గాని అది జరగదు. ఇప్పటిదాకా ప్రజా సమస్యల కోసం ఆయన అలా అడుగు బయట పెట్టిన సందర్భాలు గుంటూరు మిర్చి యార్డుల సందర్శించడం మాత్రమే! మిగిలిన పర్యటనలు అన్నీ కూడా మరణించిన పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించడానికి, జైళ్ళలో ఉన్న పార్టీ నాయకులతో ములాఖత్ కావడానికి జరిగినవి మాత్రమే. ఈ రెండు రకాల సందర్భాలలోనూ అధికార పార్టీ చేతగానితనం వల్ల రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అధమ స్థాయికి చేరుకుంటున్నదని నిందలు వేయడానికి మాత్రమే ఆయన సమయం వెచ్చించారు. పోనీ ములాఖత్తుల కోసం అయినా సరే ఏదో ఒక సాకుతో బయటకు వస్తున్నారు అదే చాలు అని పార్టీ కార్యకర్తలు కూడా సరిపెట్టుకుంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ల పాలనను పూర్తిగా ప్రకంపనలకు గురి చేస్తున్న అతిపెద్ద అవినీతి కేసులో ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న ఏ వన్ నిందితుడు కెసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ని మూలాఖత్ రూపంలో పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వస్తున్నారు అనేది పార్టీ వర్గాలలో చర్చనీయాంశంగా ఉంది.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులలో ఎవరు అరెస్టు అయినా సరే ప్రభుత్వం మీద నిందలు వేయడానికి, తమను వేధిస్తున్నారని ఆక్రోశించడానికి ఏ కొంతైనా అవకాశం ఉంటుందని తెలిస్తే జగన్మోహన్ రెడ్డి వెంటనే మూలాఖత్ పేరుతో ఆ జైలు వద్ద వాలిపోతూ వచ్చారు. ప్రతి అరెస్టు సందర్భాన్ని కూడా తన రాజకీయ మైలేజీ కోసం వాడుకోవడానికి ఆయన ప్రయత్నించారు. అదే మాదిరిగా ఇప్పుడు కూడా రాజ్ కేసిరెడ్డిని మాత్రం ఎందుకు పరామర్శించడం లేదు.. అనే ప్రశ్నలు పార్టీలోనే వస్తున్నాయి! ఎప్పుడు రాబోతున్నారు అనే సందేహాలు తెరపైకి వస్తున్నాయి?
మిగిలిన పరామర్శలకు, కెసిరెడ్డి పరామర్శకు చిన్న తేడా ఉంది. కెసిరెడ్డిని పరామర్శించడానికి వెళ్తే ఆ ములాఖత్ తన మెడకు చుట్టుకుంటుందని జగన్మోహన్ రెడ్డి భయపడుతున్న వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే కెసిరెడ్డి అరెస్టు అయి ఉన్న ఆ కుంభకోణంలో 3,200 కోట్ల రూపాయలకు పైగా కాజేసిన సొమ్ముకు అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని ఆల్రెడీ సిట్ పోలీసుల విచారణలో వెల్లడించినట్లుగా వార్తలు వస్తున్నాయి. వాంగ్మూలం మీద కెసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సంతకం చేసి ఉండకపోవచ్చు గాక.. కానీ వెల్లడించిన విషయాలను పూర్తిగా కొట్టి పారేయడం సాధ్యం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ స్వయంగా వెళ్లి కెసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని కలిస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని ఆయన భయపడుతున్నట్లుగా పుకార్లు రేగుతున్నాయి. మద్యం కుంభకోణంలో పోలీసులు మళ్లీ కెసిరెడ్డిని విచారించినప్పుడు లేదా న్యాయస్థానంలో మాట్లాడవలసిన వచ్చినప్పుడు వాస్తవాలు వెల్లడించకుండా, జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన లేకుండా మాట్లాడేలా కెసిరెడ్డికి సంకేతాలు పంపాల్సిన అవసరం ఆ పార్టీనేతకు ఉంది. అలా చేసినట్లయితే అందుకు తగిన ప్రత్యుపకారం చేయగలమని ఒప్పించడం, మభ్యపెట్టడం జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు అవసరం. అయితే అందుకోసం స్వయంగా ఆయన ములాఖత్ కు వెళ్లడం జరక్కపోవచ్చునని పలువురు అంటున్నారు.
రాజ్ కెసిరెడ్డి ములాఖత్ జగన్ వెళ్లేదెప్పుడు?
Wednesday, May 14, 2025
