దాదాపుగా 60 వేల కోట్ల రూపాయల విలువైన నిర్మాణ పనులు, వేలకొద్దీ ఎకరాల్లో విస్తరించిన పనులు, భారీ ఐకానిక్ నిర్మాణాలు.. ఇవన్నీ ఊహించుకోవడానికే చాలా భారీగా కనిపిస్తుంది. అలాంటిది వీటన్నింటినీ.. కేవలం మూడేళ్ల వ్యవధిలో పూర్తిచేయగలగడం సాధ్యమేనా అనే భయం మనకు కలుగుతుంది. కానీ నిర్దిష్టమైన ప్రణాళిక, ఆటంకాలకు వెనుకాడని తత్వం, కార్యదీక్ష ఉంటే పనులు పూర్తిచేయడం పెద్ద అసాధ్యం కాకపోవచ్చు. అవన్నీ ఉన్న నాయకుడు గనుకనే.. నారా చంద్రబాబునాయుడు.. అమరావతి నగరాన్ని మూడేళ్లలోగా పూర్తిచేస్తాం అని ఘంటాపథంగా తెలుగు ప్రజలకు హామీ ఇచ్చారు. చంద్రబాబునాయుడు ప్రకటన సాహసోపేతమైనది అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులకు శుక్రవారం నాడు ప్రధాని నరేంద్రమోడీ శంకుస్థాపన చేశారు. రాజధానికి సంబంధించి 49 వేల కోట్ల రూపాయల వ్యయంతో 74 పనులు, 5028 కోట్లతో 9 కేంద్రప్రభుత్వ ప్రాజెక్టులు, 8 జాతీయ రహదారులు, 3 రైల్వే ప్రాజెక్టులు అన్నీ కలిపి 57,962 కోట్ల విలువైన 94 ప్రాజెక్టులకు ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. దీంతో అమరావతి రాజధాని నిర్మాణ పనులు టాప్ గేర్ లో పరుగులు పెట్టబోతున్నాయి.
రాజధాని నగరాన్ని మూడేళ్లలోగా పూర్తిచేస్తాం అని చంద్రబాబునాయుడు తొలినుంచి చెబుతూనే వస్తున్నారు. అయితే యథాలాపంగా రాజధాని రైతుల్ని కలిసినప్పుడు, వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు ఈ ప్రకటన చేయడం వేరు. సాక్షాత్తూ ప్రధానమంత్రి పాల్గొన్న శంకుస్థాపన సభలోనే ప్రకటించడం వేరు. ఈ సభావేదికనుంచి చెప్పే మాట అధికారిక ప్రకటనే అవుతుంది. ఆ డెడ్ లైన్ కు ఆయన కట్టుబడి ఉండాల్సి వస్తుంది. ఏదో అనివార్య పరిస్థితుల్లో కొన్నింటిలో జాప్యం జరిగినా పర్లేదు గానీ మూడేళ్ల డెడ్ లైన్ అనేది సహా వారికి చోదకశక్తిలాగా పనిచేస్తూ ఉంటే తప్ప.. ప్రాజెక్టు పూర్తి చేయడం కష్టం.
అయినా సరే.. చంద్రబాబు ఆ డెడ్ లైన్ ను ప్రకటించారంటే.. ఎంతటి కృతనిశ్చయంతో, దృఢదీక్షతో ఆయన అమరావతి పనులను నడిపించడానికి వ్యూహాత్మకంగా ఉన్నారో కదా అని ప్రజలు అనుకుంటున్నారు. ప్రణాళికాబద్ధమైన నిర్వహణ మీద ఎంతో నమ్మకం ఉంటే తప్ప ఈ మాట చెప్పలేరని అంటున్నారు. ప్రధాని చేతుల మీదుగా.. శుక్రవారం శంకుస్థాపనలు జరిగాయి గానీ.. ఐకానిక్ నిర్మాణాలసహా.. ఈ 74 పనులను వేగవంతంగా పూర్తి చేయడానికి సంబంధించి.. ఇంజినీర్లతో ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేయించారని తెలుస్తోంది. నిర్మాణాలు ఒక్కరోజైనా ఆగే పరిస్థితి రాకుండా సిమెంటు, కంకర, ఇసుక, స్టీల్ వంటివి కూడా సకాలంలో ఏర్పాటు అయ్యేలా కూడా ప్రణాళికలు సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. ఇవాళ్టినుంచి కూడా అమరావతి ప్రాంతంలో దాదాపు ఇరవైవేల మంది భవన నిర్మాణ రంగంలోని కార్మికులు అహరహం పనిచేస్తూ రాజధాని నిర్మాణాన్ని పరుగులు పెట్టించనున్నారు. మూడేళ్ల డెడ్ లైన్ అంటున్న చంద్రబాబునాయుడు అప్పటికి 90 శాతం నగరాన్ని పూర్తిచేసి ఒక స్వరూపాన్ని ప్రజల ముందు ఆవిష్కరించగలిగినా చాలు.. ప్రజలు ఆయనకు నీరాజనం పడతారు.
మూడేళ్ల డెడ్ లైన్ : చంద్రబాబు సాహసోపేత ప్రకటన!
Wednesday, May 14, 2025
