విశాఖపట్నంలో సినిమా రంగం అభివృద్ధి చెందడానికి స్టుడియోల నిర్మాణం చేపడతాం అంటూ వారు ప్రభుత్వంనుంచి చవక ధరలకు భూమిని తీసుకున్నారు. దాదాపు సగం స్థలంలో స్టుడియోలు కట్టడం కూడా జరిగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలన సాగుతున్న రోజుల్లో వారికి ఒక సరికొత్త ఆలోచన వచ్చింది. మిగిలిన సగం స్థలాన్ని రెసిడెన్షియల్ లే అవుట్ గా వాడుకునేందుకు అనుమతి కావాలంటూ వారు ప్రభుత్వాన్ని అడిగారు. అలాంటి పని నియమాలకు విరుద్ధమే అయినప్పటికీ.. అనుమతి వచ్చేసింది. తీరా రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఇలాంటి తప్పు జరగడానికి వీల్లేదు.. నియమాలను అనుసరించాల్సిందే.. అని షోకాజు నోటీసు పంపితే.. దానికి జవాబు చెప్పడానికి బదులుగా.. ఏకంగా సుప్రీం కోర్టుకు వెళ్లారు. రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన షోకాజు నోటీసును కొట్టేయాలంటూ.. సురేష్ ప్రొడక్షన్స్ చేసిన విజ్ఞప్తిని సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది. అసలు విచారణకే స్వీకరించలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన షోకాజు నోటీసు చట్టవిరుద్ధం అని భావిస్తే కావలిస్లే అలా పిటిషన్ వేసుకోవచ్చునని. అంతే తప్ప నోటీసులను కొట్టేయాలనడం కరెక్టు కాదని వ్యాఖ్యానించింది.
ఎక్కడైనా సరే.. ప్రభుత్వం ఒక సంస్థకు ఒక పర్పస్ కోసం స్థలం కేటాయించిన తర్వాత.. అదే పర్పస్ కోసం దానిని వినియోగించాలి. అంతే తప్ప స్థలాలు పుచ్చుకునే వరకు సంఘ ప్రయోజనాలకోసం అని చెప్పి.. పుచ్చుకున్న తర్వాత.. ఆ స్థలాలతో వ్యాపారం చేసుకుంటాం అంటే కుదరదు.
అలాంటిది సురేష్ ప్రొడక్షన్స్ వారు స్టుడియోల నిర్మాణం కోసం 34 ఎకరాలు తీసుకున్నారు. అందులో 17 ఎకరాల్లో స్టుడియోలు కట్టారు కూడా. జగన్ జమానా సాగుతున్న రోజుల్లో మిగిలిన భూమిలోని 15.80 ఎకరాలను రెసిడెన్షియల్ లే అవుట్ గా మార్చేిందుకు జీవీఎంసీ అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ విజ్ఞప్తి వెనుక కొందరు వైసీపీ పెద్దల హస్తం కూడా ఉన్నట్టు సమాచారం. అలా దరఖాస్తు చేసుకుంటే అనుమతులన్నీ తాము ఇప్పించేస్తాం అనే ప్రోద్బలంతో దరఖాస్తు చేయించినట్టుగా పుకార్లున్నాయి. అనుకున్నట్టే అనుమతులు ఆగమేఘాల మీద వచ్చాయి. 2023 మార్చి 2 న జీవీఎంసీ కమిషనర్ వారికి అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చారు. అప్పటి విశాఖపట్నం ఈస్ట్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధం అంటూ హైకోర్టులో పిల్ వేశారు. ఇందులో ప్రజాహితం లేదంటూ హైకోర్టు ఆ కేసును కొట్టేసింది. ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అక్కడ కేసు నడుస్తుండగానే.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇలా స్టుడియో కు తీసుకున్న స్థలాలను లేఅవుట్ కోసం మళ్లించడం గురించి వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసు ఏప్రిల్ 7న ఇచ్చింది. ఆ నోటీసుకు సమాధానం ఇచ్చి ఉన్నా, లేదా, లేఅవుట్ చేసే ఆలోచన ఉపసంహరించుకుంటున్నట్టుగా సంజాయిసీ ఇచ్చి ఉన్నా వ్యవహారం సింపుల్ గా తేలిపోయేది. కానీ సురేష్ ప్రొడక్షన్స్ ఈ విషయంలో అతి చేసినట్టుగా పలువురు భావిస్తున్నారు. తాము చేసిన పని.. చాలా స్పష్టంగా చట్టవిరుద్ధం అని తెలిసినప్పటికీ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టును ఆశ్రయించినందుకు ఇప్పుడు వారికి భంగపాటు ఎదురైందని అనుకుంటున్నారు.
సురేష్ ప్రొడక్షన్స్.. ఆ విషయంలో అతిచేశారా?
Wednesday, May 14, 2025
