పాకిస్తాన్ బరితెగించింది. కవ్వింపు చర్యలు కాదు కదా.. ఏకంగా యుద్ధానికి దిగింది. భారత్ లోని పౌర ఆవాసాలు, జనసమ్మర్దంగా ఉండే ప్రాంతాల మీద దాడులు చేయడం ద్వారా భారీ నష్టాన్ని కలిగించాలనే కుట్రలను అమల్లో పెడుతోంది. అయితే భారత వైమానిక దళాల సామర్థ్యంతో వారికి భారీ షాక్ తగిలినట్టు వార్తలు వస్తున్నాయి. భారత భూభాగం మీదికి ప్రయోగించిన మూడు యుద్ధ విమానాలను భారత్ కూల్చివేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. అలాగే.. పాక్ ప్రయోగిస్తున్న డ్రోన్ బాంబులను కూడా గగనతలంలోనే గుర్తించి విధ్వంసం చేసేస్తున్నారు. పాక్ మిసైళ్లను కూడా గగనతలంలోనే విద్వంసం చేసినట్టుగా భారత్ ప్రకటించింది. అత్యాధునిక యాంటీ మిసైల్ సిస్టమ్ ఎస్400 ను భారత్ యాక్టివేట్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి.
జమ్మూ విమానాశ్రయం లక్ష్యంగా పాకిస్తాన్ మిసైళ్లు ప్రయోగించినట్టుగా తెలుస్తోంది. అయితే అప్రమత్తంగా ఉన్న భారత సైన్యం జమ్మూ విమానాశ్రయానికి కించిత్తు నష్టం వాటిల్లకుండా.. మొత్తం 8 మిసైళ్లను కూల్చివేసినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. మూడు పాక్ యుద్ధవిమానాలు నేలకూలాయి. అలాగే జమ్మూ యూనివర్సిటీ వద్ద కూడా రెండు డ్రోన్లను భారత్ సైన్యం కూల్చేసింది. జమ్మూ వ్యాప్తంగా బ్లాక్ అవుట్ ప్రకటించారు. జమ్మూ తదితర అనేక ప్రాంతాల్లో ప్రమాద హెచ్చరికల సైరన్లు మోగుతున్నాయి.
కేవలం ఉగ్రదాడికి జవాబు చెప్పడం మాత్రమే భారత్ చేసిన ఆపరేషన్ సిందూర్! పాకిస్తాన్ లో అత్యంత కచ్చితత్వంతో గుర్తించిన ఉగ్రవాద స్థావరాల మీద మాత్రమే దాడులు నిర్వహించారు. వాటిని ధ్వంసం చేశారు. అయితే పాకిస్తాన్ మాత్రం.. పౌరుల మీదికి, జనావాసాల మీదికి బాంబులను మిసైళ్లను ప్రయోగిస్తూ పెనునష్టం కలిగించాలని ప్రయత్నిస్తున్నది.
పాక్ బరితెగింపునకు తగ్గట్టుగా స్పందించిన భారత వైమానిక దళం.. పాక్ లో కూడా పలు ప్రాంతాల్లో దాడులు చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. అలాగే లాహోర్ లో ఉన్న వారి గగనతల రక్షణ వ్యవస్థను కూడా భారత దళాలు పూర్తిగా ధ్వంసం చేసినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. జమ్మూ లక్ష్యంగా వరుసగా పదుల సంఖ్యలో డ్రోన్లను ప్రయోగిస్తూ.. ధ్వంసరచనకు పాక్ ప్రయత్నిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.