పనిచేయడం వారికి కనీసమాత్రంగా కూడా చేతకాలేదు గానీ.. కూటమి ప్రభుత్వం చేయడానికి పూనుకున్నప్పుడు మాత్రం.. ఏమాత్రం వెరపు లేకుండా అపశకునాలు పలుకుతున్నాయి జగన్ దళాలు. అయిదేళ్ల పాలన కాలంలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించకుండా.. నిరుద్యోగ టీచర్లను దారుణంగా వంచించింది జగన్ ప్రభుత్వం. చివరి సంవత్సరంలో కొంత నాటకాలాడారు. అదే చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచార సమయంలోనే.. అధికారంలోకి వస్తే మొదటి సంతకాల్లోనే మెగా డీఎస్సీ ఫైలు కూడా ఉంటుందని ప్రకటించారు. అలాగే సంతకం చేశారు. సంతకం చేసినప్పుడు.. 2025 విద్యా సంవత్సరం పూర్తయ్యేనాటికి నియామకాల ప్రక్రియ మొత్తం పూర్తిచేస్తామని కూడా వెల్లడించారు.
ఇప్పుడు అదే మాట నిలబెట్టుకుంటూ.. మెగా డీఎస్సీ ప్రకటన రాగా.. వైసీపీ దళాలు మాత్రం.. శకునాలు పలుకుతున్నాయి. పరీక్ష నిర్వహణ వరకే నోటిఫికేషన్ పరిమితం అయిందిట.. నియామక ప్రక్రియపై నిర్దిష్ట ప్రణాళిక లేనేలేదట.. అభ్యర్థుల ఆశలతో ఆడుకుంటున్నారట.. చిత్తశుద్ధితో నిర్వహించకపోతే సహించరట.. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సెలవిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి టీచరు ఉద్యోగ నియామకాల మీద అయిదేళ్లలో ఎంత చిత్తశుద్ధి ఉన్నదో ప్రజలు బాగా గమనించారు గనుకనే.. వారిని 11 సీట్లకు పరిమితం చేసి ఇంట్లో కూర్చోబెట్టారు. ఇప్పుడాయన తగుదునమ్మా అంటూ.. కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి గురించి మాట్లాడుతున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పుట్టినరోజు నాడు.. ప్రభుత్వం చాలా స్పష్టమైన కార్యచరణ ప్రణాళికతో మెగా డీఎస్సీని ప్రకటించింది. దరఖాస్తు లు మొదలు- గడువు తేదీలు మాత్రమే కాకుండా, పరీక్షలు జరిగే తేదీలు, మొదటి కీ ఎప్పుడు విడుదల చేస్తారు, అభ్యంతరాలు ఎన్ని రోజులు స్వీకరిస్తారు.. ఫైనల్ కీ ఎప్పుడు ఇస్తారు.. ఫైనల్ గా మెరిట్ జాబితా ఎప్పుడు విడుదల చేస్తారు.. అన్ని వివరాలూ నోటిఫికేషన్ లో ఉన్నాయి. మెరిట్ జాబితా రావడం అంటే.. ఇక ఆటోమేటిగ్గా నియామకాల ప్రక్రియ పూర్తయినట్టే. ఇప్పుడు టీచర్ల బదిలీలు, పదోన్నతులు అన్నీ కూడా వేసవి సెలవుల్లోనే పూర్తి చేయాలనే కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో.. విద్యాసంవత్సరం మొదలయ్యేసరికి ఆపర్వం పూర్తయితే.. జులై మాసాంతం నాటికి మెగా డీఎస్సీ నియామకాలు పూర్తవుతాయని అంచనా.
అయితే.. ఈ ధీమా నిరుద్యోగ ఉపాధ్యాయులకు ఉన్నది గానీ.. వారిలో భయాలు పుట్టించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు. అయిదేళ్లు డీఎస్సీ నిర్వహించలేకపోయిన తమ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకుంటూ.. ప్రజలు నవ్వుతారనే భయం కూడా లేకుండా.. పనిచేస్తున్న ప్రభుత్వం మీద విమర్శలకు దిగుతున్నారని జనం అంటున్నారు.