టాలీవుడ్లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న సినిమాల్లో ‘కన్నప్ప’ ఒకటి. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం విడుదలకు ఇంకా మూడు రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో, సినిమాపై ఆసక్తి రోజురోజుకి పెరిగిపోతోంది. బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రంలో టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇటీవలే సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. మొత్తం 195 నిమిషాల పైచిలుకు నిడివితో చిత్ర యూనిట్ సెన్సార్ బోర్డుకు సమర్పించగా, కొన్ని సీన్స్పై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో వాటిని ఎడిట్ చేశారు. దాదాపు 12 నిమిషాల సన్నివేశాలను తొలగించడంతో ఫైనల్ రన్టైమ్ సుమారు మూడు గంటల మూడు నిమిషాలకు తగ్గింది.
సెన్సార్ ప్రక్రియ ముగిసిన వెంటనే సినిమాపై ప్రేక్షకుల్లో కుర్రాళ్ల నుంచి కుటుంబ ప్రేక్షకుల వరకు క్యూరియాసిటీ మరింత పెరిగింది. సినిమా ఎలా ఉందో చూడాలన్న ఆతృత స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ తదితరుల పాత్రలు ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నాయి.
ఇంత మంది స్టార్స్ ఒకే ఫ్రేమ్లో కనిపించబోతుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో అన్న ఉత్కంఠ అందరిలోనూ మొదలైపోయింది. ఇక ఈ భారీ సినిమాకు సంబంధించి థియేటర్ల వద్ద ఎలా స్పందన వస్తుందో చూడాల్సి ఉంది.